ఉలక’వేం’? పలక’వేం’!?
మౌనంగా ఉంటా”వేం”!?
– అజంజాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!?
సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి?
సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి?
కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు?
ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి?
మీ జోక్యం కోసం కోసం అజం జాహి కార్మిక లోకం ఆశగా ఎదురుచూస్తున్నది
కొందరికి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. కానీ కొందరికి అరుదైన అవకాశాలు వస్తాయి. రెండు కోవలకు చెందిన వారు వేం నరేందర్ రెడ్డి. కే సముద్రం మండలం అర్పణ పల్లె లో పుట్టిన ఆయన వరంగల్ సి కె ఎం కాలేజీలో డిగ్రీ చేసి, 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమింపబడ్డారు. ఆయనకు వరంగల్ చరిత్ర తెలుసు. ఆజం జాహి మిల్లు చరిత్రా తెలుసు. కార్మికుల సంగతి తెలుసు. మిల్లు కార్మిక భవన స్థలం కబ్జా సంగతీ తెలుసు. ఆ స్థలాన్ని ఎప్పుడు? ఎలా? ఏం? చేయాలో కూడా తెలుసు. సమస్య తెలుసు! పరిష్కారం కూడా తెలుసు!! అ(ఇ)న్నీ తెలిసిన, సీఎం కే సలహాలిచ్చే పొజిషన్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదేం!? ఉలక’వేం’? పలక’వేం’!? మౌనంగా ఉంటా”వేం”!? అజం జాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!? అంటూ “వేం” జోక్యం కోసం మిల్లు కార్మిక లోకం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్నది.
వరంగల్ మట్టి పరిమళం వేం నరేందర్ రెడ్డి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడి… ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింప పడ్డారు. ఆయన సీఎం కు సలహాలిచ్చే అసాధారణ స్థానంలో ఉన్నారు. ఇది వరంగల్ కే గర్వకారణం. ఇంతటి స్థాయి, స్థానంలో ఉన్న మనిషి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్త మంచి, వీలైతే ఓ మాట సాయం. అంతేగా!? కానీ ఆయన నుంచి ఓ మంచి మాట సాయాన్ని కోరుకున్న అజం జాహి మిల్లు కార్మికులు మాత్రం ఉలుకు, పలుకు లేని మౌనాన్ని ఎదుర్కొంటున్నారు. చారిత్రక అజంజాహి కార్మిక భవనం కబ్జాకు గురైంది. తప్పుడు దస్తావేజులతో అన్యాక్రాంతమైoది, ఓ బడా వ్యాపారి అక్రమ పర్మిషన్లు పొందాడు. కాంగ్రెస్ కే చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొబ్బరికాయ కొట్టి, బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్మికుల కళ్ళ ముందే వాళ్ళ కలల సౌధం, ఎన్నో కార్మిక ఉద్యమాల సాక్షీభూతం, కార్మిక దేవాలయం, కార్మిక భవనం నేలమట్టం అయింది. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నాయి. కార్మికులు, కార్మిక కుటుంబాలు, కాంగ్రెస్ సహా పార్టీలన్ని అఖిల పక్షమై, కార్మిక, ప్రజా సంఘాలన్నీ ఏకపక్షమై కోట్లాడుతున్నాయి. అది ముమ్మాటికీ కార్మిక భవన స్థలమే అనడానికి భవన శిలాఫలకం నుండి ఇంటి నెంబర్, ఇంటి పన్ను వరకు అవసరమైన అనేక ఆధారాలను బయట పెట్టారు. కార్మిక నాయకుల కాసుల కక్కుర్తిని, తప్పుడు దస్తావేజులతో చేపట్టిన కబ్జాని, నియమ నిబంధనలు అతిక్రమించిన అధికారుల అవినీతిని సాక్ష్యాలతో సహా ఎలుగెత్తారు. అయినా సరే, ప్రజాపాలనే గీటురాయిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదు. అధికారంలో ఉన్న ఏ ప్రజా ప్రతినిధి కీ ఇది తప్పని తోయలేదు. ఏ ఉన్నతాధికారికి తప్పును సరిదిద్దుకోవాలనిపించలేదు. సరిదిద్దే ప్రయత్నం ఏ కోణం నుంచీ జరగలేదు. ఒక అవినీతి కోణం వెనుక ఇంత మౌనమా?!
చివరకు మీలాంటి వారికి కూడా పట్టకపోతే, ఎవరికి పడుతుంది? ఇంకెవరిని అడగాలి సార్!? బహిరంగంగా అందరికీ తెలిసిన అజం జాహి లాంటి చారిత్రక మిల్లు కార్మిక స్థలానికే రక్షణ, దిక్కు దివాణం లేకపోతే, ఈ ప్రజా పాలనలో ఇంకెవరికి రక్షణ ఉన్నట్లు సార్?! మన ప్రజా పాలన ఫలాలు ఎవరికి అందుతున్నట్లు సార్? ప్రజలకేనా సార్?! పాలకులకా? ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నోళ్లకా సార్?!
అందుకే సార్, అజం జాహి మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, అఖిల పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు అంతా కలిసి, ఈ మట్టి బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నారు. మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పై సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి? సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి? కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు? ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి? ఉలక ‘వేం’? పలుక ‘వేం ‘? మాట్లాడ ‘వేం’? అంటూ మీ ప్రతిస్పందన కోసం అఖిల పక్షం… ప్రజాపక్షమై… మీ జోక్యం కోసం అజం జాహి కార్మిక కుటుంబ లోకం ఆశగా ఎదురుచూస్తున్నది.

