GOVERNMENT|సర్కార్ కే సవాళ్ళు!
రేసులో నేనున్నాను : డీసీఎం భట్టీ
అదేపనిగా వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డీ
PARTY|పార్టీ మద్దతు నాకేనంటూ వ్యాఖ్యలు
‘ముఖ్య’ నేతలే అవమానిస్తున్నారని మాటలు
డీకే మధ్యవర్తిత్వమూ బేఖాతర్?
ఆశావహులు అనేక మంది
అసంతృప్తులు ఇంకెందరో..?
క్రమశిక్షణ కమిటీ చర్యలేవి?
కాంగ్రెస్ కలహాల కాపురం?
కాంగ్రెస్ కల్చరే అంతా?
హైదరాబాద్, ఆగస్టు 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ కలహాల కాపురం మొదలైంది. అసంత్రుప్తుల స్వరం పెరుగుతోంది. మొన్న ఓ మంత్రిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు, నాగర్ కర్నూలు ఎంపీ, క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే క్రుష్ణమోహన్ రెడ్డిల మధ్య వివాదం, నిన్న మంత్రి కొండా సురేఖ మురళి దంపతులు, వరంగల్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య వివాదం, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య గలాటా, ఇవ్వాళ నేరుగా సీఎంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన మాట నిజమేనని, సీఎం రేసులో నేనున్నానంటూ డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు. ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్న విభేదాలు కాంగ్రెస్ పార్టీని అతాలకుతలం చేస్తుంటే, ఈ వేళ్ళన్నీ సీఎంవైపే చూపిస్తుండటం సంచలనంగానూ, ఆసక్తికరంగానూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రెండేళ్ళు కూడా కాకముందే ఈ వ్యాఖ్యలేంటి? ఇవన్నీ సీఎం కే ఎసరు తెస్తాయా? లేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే సవాల్ గా మారుతాయా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందు పార్టీ నాయకత్వం ఆయన కు మంత్రి పదవి హామీ ఇచ్చింది. ఆ సమయంలో స్ట్రాటజిస్టు సునిల్ కనుగోలు, డిప్యూటీ సీఎం భట్టి, అప్పటి పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ ఉన్నారని రాజగోపాల్ చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కుల, ప్రాంత, కుటుంబ రాజకీయాల సమీకరణల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గొంతు పెంచారు. అనేక వేదికల మీద తనకు మంత్రి పదవిపై ప్రస్తావిస్తున్నారు. సీఎం రేవంత్ పైనా ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి బహబూబ్ నగర్ లో జరిగిన ఓ సభలో ’పదేళ్లు తానే సీఎం నని, రేవంత్ వ్యాఖ్యానించగా, ‘మూడేళ్ళు రేవంత్ సీఎంగా ఉండొచ్చు. కానీ, ఆతర్వాత కూడా తానే సీఎం అనడం పార్టీ విధానాలకు విరుద్ధం. కాంగ్రెస్ లో అధిష్ఠానం ఉంది. ప్రజాస్వామ్యం పద్ధతి ఉంటుంది. ఇది కూదరదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఓ పత్రిక 15ఏళ్ళ వార్షికోత్సవ సభలో సీఎం, ‘రాయరానోడూ జర్నలిస్తే?’ అని వాపోతే, ‘ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడ మల్లయ్యా? సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలు సరైనవి కావు’ అంటూ రికవర్స్ఖ్ కౌంటరిచ్చారు.
రాజగోపాల్ కు మద్దతుగా భట్టి
రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట నిజమేనని, ప్రస్తుత సమీకరణల్లో ఆయన్ని అకామిడేట్ చేయలేకపోయామని చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు పలికినట్లయింది. పైగా, ఆ సమయంలో తానున్నానని కూడా భట్టీ చెప్పారు. దీనికి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి కి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. “కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు.’’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ మారింది.
సీఎం రేసులో నేనున్నాను :భట్టీ
‘సీఎం రేసులో నేనున్నాను, అందుకు అవసరమైన అన్ని అర్హతలూ నాలో ఉన్నాయి. అయితే ప్రస్తుత బాధ్యతలతో సంతోషంగా ఉన్నాను. అని భట్టి విక్రమార్క్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. యథాలాపంగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పటికీ, ఇప్పుడు భట్టి వ్యాఖ్యలు సీఎం రేసు వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చాయి.
ఒకవైపు రాజగోపాల్ రెడ్డి సీఎంను ప్రశ్నిస్తున్న ఈ సమయంలో, ఆయనకు మంత్రి పదవి హామీ నిజమేనని ఈ ఇష్యూని మరింత జఠిలం చేసినట్లయింది. సీఎం రేసులో తానూ ఉన్నాననడం కాంగ్రెస్ లో కుర్చీలాట మొదలైందా? అన్న అనుమానాలకు తెరలేపింది.
కుదరని సమీకరణలతో వ్యతిరేకంగా వెంకట్ రెడ్డి?
ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ సొంత అన్నదమ్ములు. ఇద్దరూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. ఇద్దరు రెడ్డీలే మంత్రులుగా ఉండగా, మూడో రెడ్డికి అదే జిల్లా నుండి ఇవ్వడం పార్టీ లెక్కల్లో కుదరడం లేదు. పైగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు సాధ్యం కావడం లేదు. బీసీ డిక్లరేషన్ ను అమలు చేసే ప్రయత్నంలో మొత్తం మంత్రి వర్గంలోనే మరో రెడ్డికి అవకాశం కల్పించే చాన్స్ లేదు. ఒక వేళ కల్పిస్తే ఉత్తమ్ సతీమణి పద్మావతి కూడా లైన్ లో ఉన్నారు. ఒక రెడ్డీకి ఇచ్చి, మరికొందరు రెడ్డీలను వ్యతిరేకం చేసుకోవడం ఎందుకని అధిష్టానం వెనుకడుగు వేసింది. అయితే, తనకు పదవి రాకుండా సీఎమ్మే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి బావిస్తున్నట్లుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే, వెంకట్ రెడ్డిని తప్పించడం ఖాయం. అందుకని తన పదవిని కాపాడుకోవడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
డీకే మధ్యవర్తిత్వమూ బేఖాతర్?
ఇదిలా వుండగా, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి మరీ, ఒక ప్రైవేటు హోటల్ లో రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. రాజగోపాల్ ను బుజ్జగించి, కొంత మేర హెచ్చరించి వెళ్ళారు. అయినా సరే, మునుగోడు ఎమ్మెల్యే మెత్తబడినట్లు లేదు. ఆతర్వాత కూడా అదే వాడి వేడిని కొనసాగిస్తున్నారు.
క్రమశిక్షణ కమిటీ జోక్యం
రాజగోపాల్ పార్టీ విధానాలకు విరుద్ధంగా పార్టీపైనా, నాయకత్వంపైనా, సీఎం రేవంత్ రెడ్డిపైనా చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. రాజగోపాల్ తో మాట్లాడతామని కొద్ది రోజుల క్రితం ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన వాయిస్ ను పెంచుతూనే ఉన్నారు. సీఎం కి, పార్టీకి వ్యతేరకంగా రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారు.
పార్టీ నియమావళి అందరికీ వర్తించదా?
పార్టీకి ఓ పద్ధతి ఉంటుందని సీఎంకే చెప్పిన రాజగోపాల్ రెడ్డికి అదే పార్టీ నియమావళి వర్తించదా? తనకు పార్టీ హామీ ఇచ్చి ఉండవచ్చు. అలాగే అందరికీ ఆశలుంటాయి. కానీ అవన్నీ నెరవేరడం సాధ్యమేనా? ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు అదీ అన్నాదమ్ముళ్ళకు ఇవ్వడం సాధ్యమేనా? ఇస్తే ప్రజలకు ఏ సంకేతాలు పోతాయి? పార్టీ నేతలు స్వార్థంతోనే ఆలోచిస్తే, పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడాల్సినవి బహిర్గతంగా మాట్లాడటాన్ని నిబంధనలు అనుమతిస్తాయా? అందరినీ అకామిడేట్ చేయడం సాధ్యమేనా? ఇలా ప్రశ్నించేవాళ్ళు పార్టీలో ఎవరూ లేరా?
కాంగ్రెస్ కల్చరే అంతా?
పదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ వైఫల్యాలు, ఎవరేమనుకున్నా రేవంత్ రెడ్డి కారణంగా వచ్చిన అధికారాన్ని అనుభవిస్తారా? లేక చిల్లకల్లం చేసుకుని చింపిన విస్తరిలా మార్చుకుంటారా? కనీసం ప్రజలేమనురకుంటారన్న ఇంగితం ఆ పార్టీ నేతలకుందా? లేదా? అధిష్టానం ఏం చేస్తోంది? క్రమశిక్షణ సంఘం నిద్రపోతోందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ లు టార్గెట్ చేస్తున్న ఈ తరుణంలో సొంత పార్టీని, ప్రభుత్వాన్ని సొంత ఎమ్మెల్యేలే టార్గెట్ చేస్తే భవిష్యత్తేంటి? కాంగ్రెస్ గత పద్ధతులనే తిరిగి ఆవిష్కరిస్తున్నది. ఇప్పటిలే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్, స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఉంది. ఈ తరుణంలో ఇవన్నీ పార్టీకి, ప్రభుత్వానికి సవాల్ గానే నిలుస్తున్నాయి. కాంగ్రెస్ కల్చరే అంత అని సరిపెట్టు కోవాలా?

