కాకతీయ గడ్డ నుంచే సెకండ్ ఇన్నింగ్
ఓరుగల్లు వేదికగా పర్యటనలకు శ్రీకారం
ఓరుగల్లు గులాబీ దండుపైన అన్నా చెల్లెలు ఆశలు
నాటి ఉద్యమ సెంటిమెంటు పండేనా?
బీఆర్ఎస్ కు పునర్ వైభవం సాధ్యమేనా?
అన్నా, చెల్లెళ్ళు సక్సెస్ అయ్యేనా?
బీఆర్ఎస్ ని అభిమానించే వాళ్ళు…
కేసీఆర్ ఫ్యామిలీని ప్రేమించేవాళ్ళు ఇంకా ఉన్నారా?
అందుకే… ఉద్యమానికి పరిచయం చేసిన
వరంగల్ నుంచే తిరిగి ఉద్యమిస్తున్నారా?
బీఆర్ఎస్ కు ఓరుగల్లే వేదిక కానుందా?
కేసీఆర్ రాజకీయ వారసులుగా ప్రపంచానికి పరిచయం చేసిన ఓరుగల్లు వేదికగానే తమ భవిష్యత్తును మలుచుకునేందుకు మరోమారు అన్నా చెల్లెళ్ళు కేటీఆర్, కవితలు తమ ప్రయత్నాలు ప్రారంభించారా? వాళ్లని ఉద్యమకారులుగా తీర్చిదిద్దిన పోరుగల్లునే తిరిగి పోరాటానికి వేదికగా చేసుకుంటున్నారా? తెలగాణ ఉద్యమాన్న ప్రేమించేవారు, వారి కుటుంబాన్ని అభిమానించే వారు ఇంకా కాకతీయ గడ్డపైనే ఉన్నారని వారు భావిస్తున్నారా? అధికారాంధకారంలో ఇంతకాలంగా మరచిన వాళ్ళని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆనాడు రగిల్చిన విధంగానే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను పండించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఉద్యమ ఖిల్లా, ఓరుగల్లు జిల్లా కేంద్రంగానే మరో ఉద్యమ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఆ దిశగానే కనిపిస్తున్నాయి. అయితే విచిత్రంగా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మళ్ళీ ఈనాడు అదే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాకపోతే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం. ఇనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఆనాడు అధికారం కోసం (తెలంగాణ కోసం) పోరాడిన టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ గా అధికారం కోసమే పోరాడుతోంది. పోరాట లక్ష్యం వేరుగా కనిపిస్తున్నా, పోడుతున్నది మాత్రం అదే కేసీఆర్ కుటుంబం. కేటీఆర్, కవిత! విచిత్రంగా ఆనాటిలాగే పోరాట కేంద్రంగా కనిపిస్తున్నది కూడా ఓరుగల్లే!!
వరంగల్, జూలై 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన కొద్ది రోజులకే హన్మకొండ జూనియర్కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగసభ ఆనాటి ఉద్యమ స్వరూపాన్నే కీలక మలుపు తిప్పింది. ఆ రోజే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. స్థానిక సమరంలోకి అడుగు పెట్టబోతున్నామని పార్టీ అధినేత కేసీఆర్ హన్మకొండలోనే ప్రకటించారు. అప్పటి వరకు టిఆర్ఎస్ ఉద్యమ లక్ష్యం ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని చెబుతూ వచ్చిన కేసీఆర్, ఉద్యమ వేదికను పార్టీగా, పోటీ చేస్తున్నట్లుగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించి, తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను చాటింది. అప్పటి నుండి మొన్నటి 2025 ఏప్రిల్ 27 వరంగల్ సభ వరకు టీఆర్ఎస్ కు వరంగల్ సెంటిమెంటుగా మారింది. నేటికీ అది కొనసాగుతోంది. 2002 అక్టోబర్28 న భూపాలపల్లిలో బహిరంగ సభ, దేవేగౌడ, అజిత్సింగ్లు హాజరైన 2003 ఏప్రిల్27న వరంగల్లో తెలంగాణ జైత్రయాత్ర, ఇదే ఏడాది డిసెంబర్5న ఓరుగల్లు వీరగర్జన, శరద్ పవార్ హాజరైన 2005 జులై 17న వరంగల్లో బహిరంగ సభలు విజయవంత మయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపును తెచ్చాయి. ఈ విజయ పరంపరలోనే 2006లో కరీంనగర్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ తెచ్చింది. మిగతా జిల్లాల నుంచి ఉన్నా, ఆ ఎన్నిక కోసం మొత్తం వరంగల్ నేతలే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పాగా వేసి కేసీఆర్ కోసం పని చేశారు. అదే సమయంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్, కవితలు తమ తండ్రి కేసీఆర్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటిదాకా తాము చేస్తున్న అమెరికా ఉద్యోగాలను వదిలి తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టిందప్పుడే!
ఆతర్వాత కూడా వరంగల్ వేదికగానే టీఆర్ఎస్ సభలు సమావేశాలు నిర్వహించింది. 2007 ఏప్రిల్27న వరంగల్లో తెలంగాణ విశ్వరూప సభ, 2010 డిసెంబర్16న వరంగల్లో తెలంగాణ మహాగర్జన. ఈ సభకు స్వామి అగ్నివేశ్హాజరయ్యారు. కాగా ఈ సభ ప్రపంచ టాప్టెన్ జన సభల్లో ఒకటిగా రికార్డు నెలకొల్పింది. అధికారం పోయిన తర్వాత 2025 ఏప్రీల్ 27న నిర్వహించిన వరంగల్ సభ వరకు పోరుగల్లు వేదికగానే బీఆర్ఎస్ సక్సెస్ అవుతూ వచ్చింది.
తిరిగి ఇదే ఒరవడిని బీఆర్ఎస్ కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘పరమపద సోపాన పటంలో పెద్ద పాము మింగితే’ లాగా… ‘రాజకీయ సోపాన పథం’లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కుటుంబం మళ్ళీ మొదటి వచ్చినట్లుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కో వాలన్నట్లుగా తిరిగి వరంగల్ నే తమ ఉద్యమ వేదికగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. జూలై 27న ఒకే రోజు అటు కేటీఆర్, ఇటు కవిత ఇద్దరూ వరంగల్ జిల్లాలోనే పర్యటించారు. మరో జలియన్ వాలా బాగ్ గా పేరున్న పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ల వితరణ, కార్యకర్తలతో సమావేశం వంటి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొనగా, ఓరుగల్లు నగరం నడిబొడ్డులో కల్వకుంట్ల కవిత బోనమెత్తారు. కాకతీయ మహారాణి రాణీ రుద్రమకు నివాళులర్పించారు. పునరుద్ధరించనున్న మామునూరు ఎయిర్ పోర్టుకు ఏ గాంధీ పేరు పెట్టవద్దని, రాణీ రుద్రమ పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పైకి కాకతాళీయంగా కనిపించవచ్చు. కానీ, వ్యూహాత్మకని చెప్పక తప్పదు. కలహించుకున్నట్లుగా పైకి కనిపిస్తున్న, ఈ అన్నా చెల్లెళ్ళు, లోలోన కలిసి కావాలనే వరంగల్ సభలకు వచ్చారన్న ప్రచారమే జరుగుతోంది. నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారులను, నిజమైన తెలంగాణ వాదులను కూడగట్టడానికి కవితను ముందు పెట్టారు. అందుకే ఆమె చేత తెలంగాణ జాగృతిని తిరిగి తెరిపించారు. ఆ కారణంగానే ఆమె తెలంగాణ సంబంధ, అనుబంధ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఇక కేటీఆర్ తన మిత్రుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన కార్యక్రమాన్ని సందర్భంతో సంబంధం లేకుండా పెట్టించుకుని మరీ పరకాలకు వెళ్ళారు. ఆనాడు ఉద్యమానికి, ఆతర్వాత తమ అధికారానికి అన్ని విధాలుగా వేదికగా నిలిచి, కలిసి వచ్చిన వరంగల్ నుంచే తిరిగి అధికారాన్ని ‘హస్త-గతం’ చేసుకోవాలన్న తలంపు కూడా ఈ పర్యటనలో ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
‘అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఓరుగల్లు గుర్తుకురాలేదు. ఉద్యమకారుల ఊసెత్తలేదు. తమతో కలిసి పని చేసిన వాళ్ళను పగబట్టినట్లుగానే ప్రవర్తించారు. కలవడానికి కాదు కదా కంటి చూపునకు కూడా కన్నమ్మ కష్టాలు పెట్టారు. ప్రగతి భవన్ గడీలకు గడాలు పెట్టారు. కనీసం కనికరం చూపకుండా ఫోన్లకు కూడా అందని ఈ అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు పిలిపించుకుని, పిలవకపోయినా సరే, పిలవనోడిదే పాపం అన్నట్లుగా అనుకున్నదే తడవు అతిథుల్లా వాలిపోతున్నారు. ఒక్కసారిగా ఇంతలో ఎంత మార్పు?’ అని ఓరుగల్లు ఉద్యమకారులు ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు.
ఎవరేమనుకున్నా, అనుకోకపోయినా, తమ ఉద్యమ ఉనికిని తిరిగి తెచ్చుకోవడానికైనా, పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికైనా, పవర్ లోకి రావడానికైనా సరే, దేనికైనా రెడీగా కేసీఆర్ కుటుంబం ఉంది. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉద్యమకారుల పార్టీగా ఉండేది. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ వాదులంతా దానికి మద్దతుగా ఉండేవారు. పదేళ్ళ అధికారం తర్వాత ఆ ఉనికిని బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన టిఆర్ఎస్ కోల్పోయింది. అవినీతి, బంధుప్రీతి, కుల గజ్జి, తెలంగాణ వాదుల పట్ల నిర్లక్ష్యం ఆ పార్టీని నిలువునా దహించి వేస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్ కుటుంబం తిరిగి వరంగల్ ను కార్యస్థలంగా, వేదికగా చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కి రెండే రెండు వచ్చాయి. అందులో ఒకరు కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంపీస్థానాల్లో రెండుకు రెండింటిలో కోల్పోయారు. ఈ దశలో మరి వారికి ఓరుగల్లు కలిసి వస్తుందా? సెంటిమెంట్ పండుతుందా? చూడాలి.

