ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
మలుపులు తిరుగుతున్న ‘కొండా’ దారులు!?
ట్విస్టుల మీద ట్విస్టులు
హైదరాబాద్, జులై 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్ర అటవీ దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం పార్టీ లోపలా, బయటా రోజుకో మలుపు తిరుగుతూ, ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటోంది. ఒకవైపు అంతర్గతంగా పార్టీలో కొందరిపై తిట్లతో మొదలైన పంచాయతీ, పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. చివరకు షోకాజు నోటీసులు, వివరణలు, వివరణల పేరుతో ఆరోపణలు, డెడ్ లైన్ల దాకా వెళ్ళింది. ఇంకోవైపు ‘పరకాలలో పోటీ చేయడానికి నేనొస్తున్నానంటూ’ కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ ఇన్ స్టాలో పెట్టిన పోస్టు సంచలనమైంది. మరోవైపు గత ఎన్నికలో తూర్పు నియోజకవర్గంలో రూ.70 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి కొండ సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోరు జారడం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుకు దారి తీసింది. గత ఎన్నికలో కొండా సురేఖ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్వయంగా బుధవారం ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా కొండా మురళి వరంగల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వారెవ్వరైనా సరే, ఎర్రబల్లులే!’ అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. పార్టీలో అంతర్గత ప్రత్యర్థులను, బయటి పార్టీ ప్రత్యర్థులను పక్కన పెట్టి, తన పాత ప్రత్యర్థులను అనూహ్యంగా తెరమీదకు తెచ్చారు. బహుశా ఈ విధంగా పార్టీ లోపలి లొల్లిని మరిపించడానికే, కొత్త లొల్లిని కొండా మురళి తెరమీదకు తెచ్చారా? ఈ ఎత్తుగడ వేశారా? కాకపోతే తన పాత శత్రువులను కొత్తగా తెర మీదకు తెచ్చిన ఎత్తుగడ ఫలిస్తుందా? కచ్చితంగా కొంత టైమ్ పాస్ కి సహాయ కారిగా మాత్రం నిలుస్తుందడంలో సందేహం లేదు.
నిజానికి కొండ దంపతులు ఎర్రబెల్లికి మిత్రులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం క్రితమే ఎర్రబెల్లి కి ప్రత్యర్థులుగా మారారు. అలా ఒకరికొకరు ప్రత్యర్థుల పేరు మీదే పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతోనే ఎదిగారని కూడా రాజకీయాల్లో అంటుంటారు. వేర్వేరు పార్టీల్లో, వేర్వేరు దారుల్లో వేర్వేరుగా ఎదిగినప్పటికీ, వాళ్ళంతా ఒక్కటే అనే వారూ లేకపోలేదు. కావాలనే ఇదంతా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ రాజకీయంగా తలపడని కారణంగా కూడా ఈ విమర్శలు వచ్చి ఉంటాయి. ఒకే పార్టీలో కొద్ది కాలం ఉన్నప్పుడు కూడా వాళ్లు స్నేహం చేసినట్లు కానీ, కయ్యానికి కాలు దువ్వినట్లు కానీ కనిపించలేదు. ఇదంతా అవసరమైన చర్చ కాకపోయినా, సందర్భోచితం మాత్రమే!
ఇక నోరు పారేసుకోవడం వల్ల స్వయంకృతాపరాధం వల్ల ప్రస్తుతం కొండ దంపతులు పార్టీలోపలా, బయట సమస్యల్లో చిక్కుకున్నారు. కొన్ని అనూహ్య సమస్యల్లో కూరుకుపోయారు. మంత్రి గా మాట్లాడకూడదని అంశాలు వెల్లడించి మంత్రి సురేఖ, పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ చేస్తూ, తిట్టిపోసి మురళి ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కు రాలేక ఒక్కో మెట్టు దిగుతూ, మరింత గా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చారు. దీనికి దీటుగా పార్టీ నేతలు సైతం సమాధానమిస్తూ వస్తున్నారు. సమస్యలు అధిష్టానానికి ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. వివరణల్లో ఫిర్యాదులు, పార్టీలో కొందరు పెద్దలను వివాదాల గోదా లోకి లాగడం వంటివి అనవసరంగా అనివార్యమయ్యాయి. వివరణల వరకు ‘ చేయి ‘ దాటింది. డెడ్ లైన్ల వరకు వెళ్ళింది. మరోవైపు ఎన్నికల ఖర్చు వ్యవహారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులకు వెళ్ళింది. సరిగ్గా ఈ సమయంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన కొంత కొండా దంపతులకు కలిసి వచ్చిందనే భావించాలి. ఈ వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోవాల్సిన కొండా దంపతులు, మరో వైపు లాగారా?
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
అన్న చందంగా, తన పాత ప్రత్యర్థిని, పార్టీలో అంతర్గతంగా తనకు ఇబ్బందులు తెస్తున్న మరో ప్రత్యర్థిని, తాజాగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎన్నికల ప్రత్యర్థిని మొత్తం ముగ్గురిని కలిపి ఒకే గాటన కడుతూ కొండ మురళి ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వాళ్లంతా ఎర్రబల్లులే అని విమర్శలకు దిగారు. దీంతో సై ఒక వైపు నుంచి మరో వైపునకు మలుపు తిప్పినట్లు అయింది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ, జిల్లా రాజకీయాల్లో అత్యంత విభాగంగాను చర్చనీయంగాను మారిన కొండా దంపతులు, మరెన్ని ట్విస్టులు ఇస్తారో చూడాలి. ఆయా సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
వాళ్ళు ఎర్రబల్లులే

ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సరే వాళ్ళు ఎర్రబల్లులేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు విమర్శించారు. వరంగల్ ఓసిటీ మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండా మురళీధర్రావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిట్ల సత్యనారాయణ, ఇతర కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. భారాస నేత ఎర్రబెల్లి దయాకర్రావు, భాజపా నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఉద్దేశించి కొండా మురళీ తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి పేరు ఉన్నోళ్లు ఎర్ర బల్లులేనన్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖమ్మను గెలిపించిన విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామన్నారు. డివిజన్ల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులు, స్థానిక కార్పొరేటర్ల చేతుల మీదుగా తీసుకోవాలని సూచించారు.
https://youtu.be/UVR8t_PKe-0?feature=shared
కొండాపై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్ రావు, కొండా సురేఖ తన అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సరైనవిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.
సురేఖ భర్త కొండా మురళి ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మొత్తం ఖర్చు సురేఖ అఫిడవిట్లో ప్రస్తావించకపోవడం RP చట్టంలోని సెక్షన్ 10-A, 77, 78 ప్రకారం గంభీర ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఆమె అఫిడవిట్లో 2 ఎకరాల స్థిరాస్తిని మాత్రమే చూపించగా, మురళి 500 ఎకరాల భూమిని వారసత్వంగా పొందినట్లు స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.
ఇవి తప్పుడు అఫిడవిట్ కింద RP చట్టంలోని 125-A సెక్షన్తో పాటు IPC సెక్షన్ 191, 193 ప్రకారం శిక్షార్హంగా పరిగణించాలన్నారు. పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదీప్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ కూడా గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

