నన్నెవరూ పిలవలేదు
PARTY|పార్టీ మీద RESPECT|గౌరవంతో నేనే వచ్చా
DESCIPLINARY COMMITTEE|క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు
కమిటీకి ERSTWHILE WARANGAL|ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వివరాలు
MLA|MLC|LEADERS|ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నేతలపై ఫిర్యాదు
లోపల సంజాయిషీ
బయట అజమాయిషీ
‘కొండ’ దిగొచ్చినా… ‘మాట’ మారలే
హైదరాబాద్, జూన్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘నన్ను రెచ్చగొట్టొద్దు. నన్నెవరూ పిలవలేదు. నేనే వచ్చాను. నా బాడీలో ఇంకా నాలుగు బుల్లెట్లున్నాయి. బీసీ బిడ్డ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీద, పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను. మా కుటుంబాన్ని కొందరు పనిగట్టుకుని వేధిస్తున్నారు. మంత్రి పదవి పోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కడియం వచ్చాకే సమస్యలు మొదలయ్యాయి. మంత్రి సీతక్కతో ఓకే, మంత్రి పొంగులేటి కక్షగట్టారు. నాయిని రాజేందర్ రెడ్డి, బస్వరాజు సారయ్యతో కలిసి మా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వేం నరేందర్ పాత కోపంతో ఉన్నారు. పరకాల నాదే. నాయిని, రేవూరిలను నేనే గెలిపించాను. గండ్ర కోసం సీటు వదులుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి అంటే అభిమానిస్తాను. రాహుల్ ని ప్రధాని చేయడమే నా లక్ష్యం’ అంటూ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీకి సంజాయషీ ఇచ్చుకున్నట్లుగానే లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చి, అందులో తన గత వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పార్టీకి తానే పెద్ద దిక్కుగా పేర్కొంటూ, అందరినీ గెలిపించానని, తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బయటకు వచ్చాక తిరిగి తన అజమాయిషీని ప్రవర్తించారు. విలేకరులు అడిగిన ‘ఆత్మగౌరవం మీకే కాదు కదా, మీరు తిట్టిన వాళ్ళకు కూడా ఉంటుంది కదా?’ అంటే ‘నన్ను రెచ్చగొట్టద్దం’టూ బాణీ మార్చేశారు. తిరిగిన తన మూసలో పడి వ్యాఖ్యలు చేసేశారు. తాను దిగి వచ్చినట్లే వచ్చి, తాను మారలేదని, తన మాట కూడా మారదని తేల్చిపడేశారు.
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఈ నెల 19న రాహుల్ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై తమకు అందిన ఫిర్యాదుల మేరకు వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే, వివరణకు బదులు ఫిర్యాదు ఇవ్వడంతో వారంలోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని, అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇదిలావుంటే, కొండా మురళి ఇచ్చిన ఫిర్యాదు మరోసారి కాంగ్రెస్ లో సంచలనంగా మారి, చర్చనీయాంశమైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన కీలక నేతగా కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కమిటీ తనను ఎలాంటి ప్రశ్నలు అడగకపోయినా, తానే స్వయంగా ఆరోపణలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ కి తాను నిబద్ధత కలిగిన కార్యకర్తనని, బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను రెచ్చగొట్ట వద్దని, బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని, చావుకే భయపడని వ్యక్తినని స్పష్టం చేశారు. తన శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్లున్నాయని స్పష్టం చేశారు.
మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన 6పేజీల ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్థావించారు. గతంలో తాను, తన భార్య మంత్రి కొండా సురేఖ గత పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామన్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయన్నారు. పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సురేఖ, సీతక్కల మధ్య తప్పుడు ప్రచారాలతో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఇందిరను కూడా ఇబ్బందీ పెడుతున్నారన్నారు.
పరకాల నియోజకవర్గం తమదేనని, రేవూరి ప్రకాష్ రెడ్డిని తాము గెలిపించామన్నారు. ఇప్పుడు రేవూరి గూడుపుఠాని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. నాయిని రాజేందర్ రెడ్డి తనకు సంబంధం లేని తూర్పులో ప్రభుత్వ పోస్టులను ఇప్పిస్తున్నాడన్నారు. నాయినికి ఎమ్మెల్సీ సారయ్య, మంత్రి పొంగులేటి కలిసి సహకరిస్తున్నారన్నారు. పొంగులేటి మామ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డికి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తన మీద కోపమన్నారు. గత పునర్విభజనలో వారి నియోజకవర్గాలు రిజర్వ్ కావడానికి తానే కారణమన్నది వారు మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తేల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
అయితే, తాను పార్టీ మారినప్పుడు రాజీనామా చేశానని, తనతో పాటు 26 మంది కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ కి తెచ్చానని ఆ ఫిర్యాదులో చెప్పారు. తన లాగే ఇప్పుడు వచ్చిన వారు రాజీనామాలు చేస్తారా? లేదా అనేది వారికే వదిలేస్తున్నానన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్, సీఎంలపై గౌరవ మర్యాదలు ప్రకటిస్తూనే, రాహుల్ ని ప్రధాని చేయాలన్నారు. ఇప్పుడు కొండా మురళి ఫిర్యాదు సరే, వివరణ ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తిగా మారింది.
మొత్తంగా, కాంగ్రెస్లో ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు, విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి లేఖపై అధిష్టానం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ వ్యవహారం, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
…….
ఫిర్యాదులు సరే, వివరణ ఏది?
అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వండి
కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం
హైదరాబాద్, జూన్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘వివరణ అడిగితే, ఫిర్యాదులు ఇచ్చారు. సరే, క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు చెప్పండి. వారం రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వండి. పరిశీలించి మా నిర్ణయం మేం తీసుకుంటాం.’ అని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై మురళీ చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మురళిని వివరణ కోరింది. అయితే శనివారం భారీగా వాహనాలతో గాంధీ భవన్ కు చేరిన కొండా మురళి, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 6 పేజీల ఫిర్యాదును అంద చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాలో తమ కుటుంబ పాత్ర, కావాలనే కొందరు నేతలు తమపై కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటికి గల కారణాలతో సహా అందులో వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎవరేంటి? అనే అంశాలను కూలంకశంగా అందులో పేర్కొన్నారు. ఆ లేఖను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి అంద చేశారు. అయితే, కమిటీ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు కావాలని, వారంలోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని మురళిని ఆయన ఆదేశించారు.

