కిషన్ రెడ్డి |kishan Reddy వ్యాఖ్యలపై రాజాసింగ్ |Raja Singh
Goshamahal| గోషామహల్ MLA| ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. “రాజాసింగ్ సీనియర్ నాయకుడు, నేను కేవలం సామాన్య కార్యకర్త” అని కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యలతో పాటు, “రాజాసింగ్ చెప్పినదాన్ని మేము పాటిస్తాము” అనే వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ పార్టీలో తన స్థానమేమిటో స్పష్టంగా వివరించారు. పార్టీ పట్ల తనకు ఉన్న ప్రేమను, అనుభవాలను వివరించడంతో పాటు, ప్రస్తుత పరిణామాలు పార్టీ ఐక్యతకు హానికరం అవుతాయని హెచ్చరించారు.
రాజాసింగ్ తన ప్రకటనలో, తన ఉద్దేశం ఎప్పుడూ పార్టీ బలోపేతమేనని, వ్యక్తిగత పదవులు, తన లబ్ది కోసమేమీ కృషి చేయలేదని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన ధ్యేయమని, పార్టీ సేవ చేయడమే తన ధ్యేయంగా ఉందన్నారు. కానీ, తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించాలన్న లక్ష్యాన్ని మరిచి, ఒక్కరినే లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టించడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందన్నారు. అయినప్పటికీ, తాను ఎప్పటికీ పార్టీకి అంకితంగా పని చేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్నను రాజాసింగ్ అడుగుతూ, “ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా?” పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమాత్రం లాభం లేదని, ఇది పార్టీ పటిమకు హాని కలిగించే అంశమని అన్నారు. తన వ్యక్తిగత గౌరవం కన్నా, పార్టీ ఐక్యతను కాపాడడమే తన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ ఓ విన్నపం చేశారు. “మాకు కొంత సమయం కేటాయించండి. నేను, ఇతర కార్యకర్తలు వ్యక్తిగతంగా మీకు కలుసుకుని సమస్యలు వివరించదలిచాము. ఇది విభేదాల కోసం కాదు, ఐక్యత కోసం” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా మీ నిర్ణయం మేరకు మేము కలుసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
తమ లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అందుకే వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.తమ ప్రయాణం పైన పార్టీ నాయకత్వం పునరాలోచించాలని సూచించిన రాజాసింగ్, చివరగా “జై హింద్, జై బీజేపీ” అంటూ తన ప్రకటనను ముగించారు.

