మాచారంలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. “నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నిలబడి మాట్లాడటం నాకు గర్వకారణం” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేష ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు చేశామని, రైతుల పక్షాన పోరాడే ప్రభుత్వంగా నిలుస్తామని స్పష్టం చేశారు.
పోడు భూముల విషయంలో గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేస్తూ, పోరాడిన వారిని జైలుకు పంపిన చరిత్ర వారి దెబ్బతిన్న పాలనకు నిదర్శనమని అన్నారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో వ్యవసాయం చేయేందుకు సోలార్ పంపుసెట్లు అందించడం ద్వారా రైతులకు బలాన్నిచ్చామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ సోలార్ పంపుసెట్ అందించేలా చర్యలు చేపట్టామని, రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.60 వేల కోట్లను ఖర్చు చేసిందని సీఎం గుర్తు చేశారు. ముఖ్యంగా సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడం, పేదలందరికీ సన్న బియ్యం సరఫరా చేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశాలిచ్చామని, ఆడబిడ్డలను RTC బస్సులకు యజమానులుగా చేస్తూ వారి ఆధిక్యాన్ని చాటామన్నారు. వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యత అప్పగించిన ఘనత తమదేనన్నారు. ఆదానీ, అంబానీలకు పోటీగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని, 60 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలుపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. కేంద్రం సైతం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచిన రాష్ట్రంగా తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.
చివరిగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోనని, పథకాలను అనుభవించే ప్రజలే తమకి న్యాయమైన సమాధానమని స్పష్టం చేశారు. రుణమాఫీ, ఉచిత బస్సులు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు గుర్తుండిపోతాయని, తప్పుడు ప్రచారాలు ప్రజలను మోసగించలేవని అన్నారు. “ఇందిరమ్మలా, నేను కూడా ప్రజల గుండెల్లో నిలవాలన్నదే నా లక్ష్యం” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

