ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అతి ప్రయత్నం మీద కాపాడిన పోలీసు యంత్రాంగం!
ప్రభుత్వ ఇసుక పాలసీ తో ఇ‘బ్బందులు’!
‘స్థానిక దందా’ను కొనసాగించాలని విన్నపాలు!
వినిపించుకోలేదని ఎమ్మెల్యేపై డౌన్ డౌన్ నినాదాలు!
అప్పటికప్పుడు మెరుపు ధర్నాకు దిగిన ఇసుక దందాదారులు!
తమ భర్తలను కాపాడాలంటూ మహిళల వేడుకోలు!
సంచలనం రేపుతున్న వర్ధన్నపేట ఆకేరు వాగు ఇసుక దందాదారుల ఆందోళన!
ఇసుక వినియోగం పెరిగింది. ప్రభుత్వం కొత్త పాలసీని తెచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారుడి ఇంటికే చేరే విధంగా ఆన్ లైన్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఆన్ లైన్ కు అతీతంగా దర్జాగా సరఫరా చేసే స్థానిక దందాదారులకు ఇసుక ఇబ్బందులను తెచ్చింది. సమస్య ప్రాణం మీదకు వచ్చింది. ఏకంగా ఎమ్మెల్యేనే పట్టుకుని డౌన్ డౌన్ అంటూ నిలదీసేలా చేసింది. ఎమ్మెల్యే నచ్చ చెప్పినా, పట్టువీడని ఆ ఇసుక దందాదారులు మెరుపు ధర్నాకు దిగారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అందులో ఒకరు పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అనూహ్య ఈ వరస ఘటనలకు అటు ఎమ్మెల్యే, ఇటు పోలీసులు బిత్తరపోయారు. చివరకు మహిళలు మా భర్తలను కాపాడండంటూ వేడుకునే దాకా వెళ్ళింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది.
ఇసుక తెచ్చిన ఇబ్బందులు ఇన్నీ, అన్నీ కావు. ఏకంగా ఓ మనిషి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసింది. ఇన్నాళ్ళూ దర్జాగా నడిచిన ఇసుక దందా ప్రభుత్వ పాలసీతో ఆగిపోగా, ఆ దందా చేస్తున్న వాళ్ళంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేను నిలదీశారు. డౌన్ డౌన్ అంటూ నినదించారు. మా దారికి అడ్డు రావద్దు. మా దందాను అడ్డుకోవద్దు. చూసీ చూడనట్లుగా వదిలేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఆ సమస్యను తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మంగళవారం జరిగిన ఈ ఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి.
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో సన్నబియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నారనే సమాచారంతో మండలంలోని ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి, కట్ర్యాల, వర్ధన్నపేట, కడారిగూడెం, నల్లబెల్లి గ్రామాలకు చెందిన… ఆకేరు వాగు నుంచి ఇసుకను స్థానికంగా సరఫరా చేసే దందానే ఉపాధిగా నమ్ముకున్న కొందరు, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం వద్దకు భారీగా చేరుకున్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముగింపు దశకు చేరుకోగానే, ఒక్కరిగా ‘‘ఇసుక నడిపించాలి, దందాను కొనసాగించాలి. ఎమ్మెల్యే డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు వారి వద్దకు వెళ్ళారు. అనునయించారు. ఎంతకూ వినకపోవడంతో, ఆకేరు వాగులో ఇసుక తీయడంవల్ల స్థానికంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. పైగా ఇసుక తరలింపు అక్రమమని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. మంత్రి కొండా సురేఖకు ఆకేరు ఇసుక సమస్యను వివరించానని, త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు. అదేకాక స్థానికంగా ఉపాధి అవకాశాల కోసం ఏదైనా పరిశ్రమ ఏర్పాటు కోసం ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో చర్చించామని చెప్పారు. స్థానికంగా ఏదైనా పరిశ్రమ వస్తే, సమస్యలన్నీ సమసిపోతాయని తెలిపారు. అప్పటి దాకా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని అక్కడి నుండి వెళ్లిపోయారు.
మెరుపు ధర్నా..ఆందోళన..
అయినప్పటికీ, 2 నెలలుగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని తమపై దయ చూపి, ‘చూసీ చూడనట్లు’ ఉండాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుని కోరాడానికి వస్తే, మాతో మాట్లాడకుండా వెళ్లడం ఏంటని ఆ దందాదారులు వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నాకి దిగారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాల చేశారు. తమని ఆదుకోవాలని, తమ బతుకు తెరువును తిరిగి ఇవ్వాలని, ఇసుక దందాని స్థానికంగా చేసుకోనివ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
పెట్రోల్ బాటిల్ తో ఓ వ్యక్తి హల్ చల్… ఆత్మహత్యాయత్నం
ఇక ఆ ఆందోళనకారుల్లోని ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశాడు. ఆ పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గుర్తించి అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కార్యక్రమ బందోబస్తు కి వచ్చిన వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు చందర్, రాజు వారి సిబ్బంది తో కలిసి ఆత్మహత్య యత్నం చెయ్యబోయిన వ్యక్తి నుండి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులకి సర్ది చెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
మహిళలు సైతం...
మరోవైపు స్థానిక ఇసుక వ్యాపారుల కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. లక్షలు పెట్టి ట్రాక్టర్లు కొన్నామని, ఒక్కో ట్రాక్టర్ కు నలుగురు చొప్పున కూలీలను పెట్టుకున్నామని, 2 నెలలుగా స్థానికంగా ఇసుక దందాని నిలిపివేయడంతో, ఉపాధిని కోల్పోయి, తమ కుటుంబాలు రోడ్డుపడ్డాయని, మళ్ళీ వలసపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

