ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ, ఆన్ లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ బెట్టింగ్ ల విషయంలో కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందని, వ్యసనాలకు తెలంగాణలో తావులేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు.
నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదనీ, ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో గత పాలనల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు. బాధితులపై సానుభూతితో ఉండి…నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుదేశాన్ని ఆపాదిస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై గరం అయ్యారు.
తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉందనీ, రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదన్నారు. అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది? అని ప్రశ్నించారు. గత 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నాం అని, అప్పుడే మీకు అంత అసహనం ఎందుకు?, కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ BRS ను కడిగిపారేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి.. సూచనలు ఇవ్వండి అని BRS కు హితవు పలికారు.
మీరు హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావు.. ఎన్నికలు వచ్చేది 2028 లోనేనన్నారు. బీఆరెస్ లో వాళ్ల మధ్య పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తల నొప్పిగా మారుతోందనీ, ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా అన్నారు. గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని, మొన్న పద్మారావు గారు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చామన్నారు. మేం మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవు అన్నారు. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు.. అన్నారు. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదు.. అని, డాంబికాలతో మేం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదన్నారు. చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. 95 శాతం మేం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజం కాబోతుందనీ జోస్యం చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. 25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారని, ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదనీ, ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదన్నారు. ఆ భూమిలో గుంట నక్కలు ఉన్నాయనీ, ఆ గుంట నక్కలకి గుణపాఠం చెప్తాం అన్నారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం కొందరు చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నామన్నారు.
హరీష్ రావును సూటిగా అడుగుతున్న…..రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా? రేడియల్ రోడ్లు వేయాలా వద్దా? అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా? ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా? కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు? ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది? అని అడిగారు
మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం అన్నారు. అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదన్నారు. మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో …కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే, ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదన్నారు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామన్నారు. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు.. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనేనన్నారు.
ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం. మీ పై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు.. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ ప్రతిపక్షాలను కోరారు.

