తేల్చలేకపోతున్న జాతీయ పార్టీ నాయకత్వం!
తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం!
పలు గ్రూపులు రెండు గ్రూపులుగా మారిన వైనం!
అనివార్యం కానున్న సంఘ్ పరివారం జోక్యం?!
పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యానం
బీజేపీలో ఏం జరుగుతోంది? అంతర్గతంగా రాజకీయం రాజుకుంటోందా? అంతర్లీనంగా ఉన్న కుమ్ములాటలు తెరమీదకు వస్తున్నాయా? సంప్రదాయ పార్టీలో సరళీకరణలు వికటిస్తున్నాయా? ఆ విపరిణామాలు కొత్తపాతల కొట్లాటలకు దారితీస్తున్నాయా? వరసగా మూడోసారి హస్తినను హస్తగతం చేసుకున్న బీజేపీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మొత్తం దేశాన్ని, పరిపాలనను, రాజకీయాలను శాశిస్తున్నది. కానీ, తెలంగాణ అధికార పీఠం అధిష్టించే కలను సాకారం చేసుకోలేకపోతున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని తేల్చడంలో నాన్చుడు ధోరణిని అధిష్టానం అవలంబిస్తుంటే, పార్టీ రాష్ట్ర నాయకత్వం తమ నాయకుడిని తేల్చుకోలేని దీన స్థితిలో ఉన్నది. ఆ పార్టీలోని పలు గ్రూపులను ఏకం చేసి, రెండు గ్రూపులుగా మార్చిన తాజా పరిణామాలు.. సంఘ్ పరివార్ జోక్యాన్ని అనివార్యం చేస్తున్నాయి. అదే జరిగితే, తెలంగాణలో బీజేపీకి అధికారం అందుతుందా? అందని ద్రాక్షలా!.. అందనంత దూరం వెళుతుందా? ఇవెలా ఉన్నా, తాజాగా ఆ పార్టీ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు మాత్రం అటు పార్టీలో, ఇటు రాష్ట్ర నాయకత్వంలో, శ్రేణుల్లో, చివరకు రాజకీయాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర అధ్యక్ష పదవి పందేరంలో బీజేపీ ఏం చేయనుంది!? రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీజేపీ పరిస్థితిపై ‘‘అడుగు’’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
తేలికగా విప్పి తేట తెల్లం చేయాల్సిన తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక పీట ముడి, రోజురోజుకు మరింతగా బిగుసుకుంటున్నది. తేల్చాల్సిన లెక్కల్ని దాచేసి, నాన్చుతున్న కొద్దీ ఆ ముడి గట్టిపడుతున్నది. ఆలస్యమవుతున్న కొద్దీ ఆ పార్టీలో అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తున్నది. క్షేత్రంలో పని చేస్తూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ నేతలు పదవుల లాలసలో, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అధికార వ్యామోహంలో పడిపోయి, పార్టీకి పూర్తిగా పక్కన పెట్టేశారా!? అన్న అనుమానాలు ఆ పార్టీ కేడర్ లోనే కలుగుతున్నాయి. పార్టీ దిశానిర్దేశంతో ప్రజా క్షేత్రంలో పరుగులు పెట్టాల్సిన పార్టీ శ్రేణులు పక్క పార్టీలను చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. సరిగ్గా ఈ దశలో బీజేపీ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ తాజా పరిస్థితికి తార్కాణంగా నిలుస్తున్నాయి.
సంప్రదాయ పార్టీలో సరళీకరణలు
బీజేపీ సంప్రదాయ పార్టీ. మత సంప్రదాయాలు నమ్మి, ఆచరించేవారి, వ్యక్తిత్వాన్ని కూడా హిందూత్వ తత్వంగా మార్చుకున్నవారి, కొన్ని సమాజిక వర్గాలకి మాత్రమే పరిమితమైనవారి పార్టీగా పేరుపడింది. సంఘ్ పరివారం సొంత పార్టీగా ముద్రపడింది. ఆ ఆలోచనా పరంపర, ఆచరణ నుంచి వచ్చినవారి పార్టీగానే నిలబడింది. అయితే, పార్టీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల అధీనంలోకి వచ్చాక, పార్టీ రూపురేఖలు మారాయి. సిద్ధాంత రాద్ధాంతాలెలా ఉన్నప్పటికీ, అధికారమే పరమావధిగా పని చేయడం ప్రారంభించింది. పవర్ పాలిటిక్స్ ని పవర్ ఫుల్ గా ఆడటం మొదలయ్యాక, సంప్రదాయ పార్టీలో సరళీకరణలు అనివార్యమయ్యాయి. భావ సారూప్యతే కాదు, భిన్న భావాలున్న వారిని, అధికార వ్యామోహ సారూప్యత ఉన్న వారిని, పార్టీలను కలుపుకుని అధికారం కోసం పాకులాట మొదలైంది. దేశంలో సంకీర్ణ శకం కూడా బీజేపీని ఆ దిశగా నడిపించి ఉంటుంది. ఈ పవర్ గేమ్ లో కలిసి వచ్చే వారిని కలుపుకోవడమే కాదు, కలిసి రాని వారిని కూడా లొంగ దీసుకొని, తమ దారికి తెచ్చుకోవడం ఆ పార్టీకి అలవాటు అయింది. అందుకే అనేక పార్టీల నేతలను, కొన్ని చోట్ల పార్టీలను కూడా బీజేపీ తమలో కలుపుకుంది. ఈ నేపథ్యంలోనే, దేశంలోని మిగతా రాష్ట్రాల్లోలానే తెలంగాణలో కూడా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం మొదలైంది. అలా వచ్చిన ఓ బీసీ నేతే మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్. వామపక్ష భావజాలం, ఆచరణ, తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఈటల కూడా అనివార్యంగానే బీజేపీలో చేరారు. అలా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోదం నగేశ్, డి.కె.అరుణ వంటి మరికొందరు నేతలు కూడా వేర్వేరు పార్టీల నుండి బీజేపీ లో చేరి కాషాయ తీర్థం పుచుకున్నారు.
పార్టీలో కొత్త – పాతల కొట్లాట!
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలను బట్టి, నాయకత్వ మార్పు అనివార్యమని బీజేపీ అధినాయకత్వం భావించింది. సంజయ్ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా, జోడు పదవుల్లో ఉన్నారు. ఆయన్ని రాష్ట్ర నాయకత్వం నుంచి విముక్తం చేసి, కేంద్ర నాయకత్వంలో వాడుకోవాలని పార్టీ భావిస్తున్నది. దీంతో రాష్ట్ర నాయకత్వానికి సరిపోయే ఓసీ, బీసీ తదితర జాబితాలను సిద్ధం చేసింది. కేంద్రంలో మొదటిసారి మోడీని బీసీ పీఎంగా ప్రమోట్ చేసిన విధంగానే, రాష్ట్రంలో బీసీ సీఎం నినాదంతో వెళ్ళాలని పార్టీ భావిచింది. అందులో భాగంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా అనేక బీసీ నేతలను వడపోసింది. మొదట సంజయ్ నిరాకణతో ఈటల పేరు ఖరారైందన్న ప్రచారం ఊపందుకుంది. సరిగ్గా ఈ దశలో పార్టీలో పలు గ్రూపులుగా ఉన్న నేతలు రెండు గ్రూపులుగా మారారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతున్నది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు, పార్టీలో మొదటి నుంచి ఉంటున్నవారు రెండు గ్రూపులుగా మారినట్లు తెలుస్తున్నది. ఈటల, ధర్మపురి, రఘునందన్ రావు తదితరులు తమలో ఎవరికి పదవి వచ్చినా అంతా సహకరించుకోవాలని ఒక గ్రూపుగా, సరిపడని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కలిసి మిగతా వాళ్ళను కలుపుకుని మరో గ్రూప్ గా మారారని సమాచారం. అంతే కాకుండా ఈటలకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారని చర్చ జరుగుతున్నది.
మోడీని, అమిత్ షా ను ప్రభావితం చేసే పనిలో ఆ వర్గాలు
దాదాపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఖరారు చేసిన తరుణంలో పాత తరమంతా ప్రధాని మోడీని, కొత్త నేతలు అమిత్ షాను ప్రభావితం చేసే పనిలో పడ్డట్లు ఆ పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. విభేదాలను వీడి, మేమంతా ఒక్కటయ్యామని పాత, కొత్త నాయకత్వాలు అదే పనిగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఈ మధ్య ఢిల్లీకి పదే పదే నేతలు క్యూ కట్టారని ప్రచారం జరుగుతున్నది.
తేల్చలేక పోతున్న అధిష్ఠానం
ఈ రెండు గ్రూపుల ఒత్తిడిలో బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం. మరికొంత సమయం తీసుకుంటే ఇందులో తాలు తేలిపోతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.
ఏమి జరగనుంది?
ఈ తరుణంలోనే ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యల పరమార్థాన్ని డీ కోడ్ చేసేందుకు రాజకీయ పరిశీలకులు, మీడియా తెగ ఆరాట పడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగుతుందంటున్న రాజాసింగ్, గత అధ్యక్షుల వైఖరులను ఎండగుడుతూ, కొత్త అధ్యక్షుడికి దిశానిర్దేశం చేశారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పినా ఫలితం లేకే, ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు. దీంతో రాజాసింగ్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరిని టార్గెట్ చేశారు? ఆ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండీ అంత సాహసం చేయడం వెనుక ఎవరున్నారు? సంచలనాలు చేయడం రాజాసింగ్ కు కొత్తేమీ కాకపోయినా, కేంద్ర నాయకత్వం ఆదేశాలతోనే ఆయన ఆ విధంగా మాట్లాడారా? అన్న అనుమానాలు రేకెత్తడం సహజమే కదా? మొత్తంగా రాజా సింగ్ అన్నట్లు 3 నెలల క్రితమే జరగాల్సిన అధ్యక్ష ప్రకటన పరిపక్వానికి వచ్చినట్లుంది. త్వరలోనే ప్రకటన వెలువడవచ్చు. తక్షణమే తేల్చకపోతే ప్రస్తుత ఈ పరిస్థితులు పార్టీలో మరిన్ని విపరిణామాలు దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది.

