మొదలైన చోటే ముగింపు!
-కార్మిక భవన నిర్మాణానికి కసరత్తు
-వివాదంలో ఇరికించి.. పత్తా లేకుండా పోయిన ఆ ఇద్దరు!
-శస్త్ర చికిత్సల అనంతరం కోలుకుంటున్న కొండా
-వరంగల్ కు చేరుకున్న కొండా.. త్వరలోనే కార్మిక భవనానికి శంకుస్థాపన
పోగోట్టుకున్నచోటే వెతుక్కోవాలన్నది పెద్దల మాట. మొదలైన చోటే ముగింపు పలకడమన్నది వివేకవంతుల ముచ్చట. గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన అజంజాహీ మిల్లు కార్మిక భవన వివాదంలో విచిత్రంగా ఇరుక్కున్న కొండా మురళి, నష్ట నివారణకు నడుం బిగించారు. తనను ఇరికించి పత్తా లేకుండా పోయిన ఆ ఇద్దరిపై ఆగ్రహంతో ఉన్నప్పటికీ, ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. తాను కార్మిక పక్షపాతినేనని మరోమారు నిరూపించుకునే విధంగా సాలోచనలు చేస్తున్నారు. శస్త్రచికిత్సల నుంచి కోలుకుంటున్న ఆయన తన అంతరంగికులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం వరంగల్ కు చేరుకున్న ఆయన ఆతర్వాత కొద్ది రోజుల్లోనే కార్మిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
వరంగల్ అజంజాహి కార్మిక భవన కూల్చివేత అంశం తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తోందంటూ ‘‘కొండా’’ దంపతులు ఆవేదన చెందుతున్నారా? పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోలోన మథన పడుతున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మిల్లు కార్మిక భవనం కూల్చివేత, ఆ స్థలంలో కాసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన అనే రెండు కీలక అంశాలకు కారకులైన ఆ ఇద్దరి పై కొండా దంపతులు కోపంగా ఉన్నారా? అంటే ఆయన అనుచర వర్గం నిజమే అంటున్నారు. అనవసరంగా ఆ వివాదంలోకి తనను లాగారంటూ ఈ మొత్తం వివాదానికి ముఖ్య కారణమైన నరేశ్ రెడ్డి, నమశ్శివాయ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొబ్బరికాయ కొట్టిచ్చి 40 రోజులు దాటినా ఆ ఇద్దరు ఇప్పటి వరకు కనీసం తనను కలవలేదని మురళి తన అనుచరులతో చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థలం అమ్మిన నరేశ్ రెడ్డి, స్థలం కొని కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నమశివాయ ఇద్దరు బాగానే ఉన్నారు. రాజకీయంగా తమకు మాత్రం తీరని నష్టం జరిగిందని కొండా దంపతులు బాధ పడుతున్నట్లు సమాచారం. తమను ఇరికించి ఆ ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారని కొండా మురళి వారం క్రితం తమకు దగ్గరి వ్యక్తితో వాపోయినట్టు తెలుస్తోంది. కనీసం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి నష్ట నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, నరేశ్ రెడ్డి, నమశ్శివాయ ఇద్దరూ కనీసం పత్తా లేకుండా పోయారని, కనీసం కలిసి మాట్లాడలేదని కొండా మురళి కోపం ప్రదర్శిస్తున్నట్లుగా సమాచారం.
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలన్న సూక్తి ఆధారంగా కొండా దంపతులు, అజం జాహి కార్మిక భవన వివాదానికి మొదలైన చోటే ముగింపు పలకాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకోసం తమ ఆంతరంగికులైన ముఖ్య నాయకులతో కొండా మురళి ఇప్పటికే ఒక రెండు సార్లు ఇదే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
కోలుకుంటున్న కొండా
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించిన మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి ఆరోగ్యం మెరుగవుతుంది. ఆయన కంటితోపాటు, బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అనంతరం క్రమంగా ఆయన కోలుకుంటున్నారు. ఈ నెల ఆరో తేదీన తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతోపాటు పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం భర్త కొండా మురళిని, సురేఖ తన వెంట హైదరాబాద్ తీసుకెళ్లారు. మూడు వారాల క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లో కొండా మురళికి కంటి శస్త్ర చికిత్స జరగగా, అనంతరం బేరియాట్రిక్ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ జరిగిన తర్వాత వారం రోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్న ఆయన పక్షం రోజుల క్రితం హైదరాబాదులో తన ఇంటికి వెళ్లారు. క్రమంగా ఆయన కోరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి హనుమకొండలోని రాంనగర్ ఇంటికి మురళి మంగళవారం వచ్చారు. మంత్రి కొండా సురేఖ మాత్రం ఒకవైపు భర్త ఆరోగ్యాన్ని చూసుకుంటూనే మరోవైపు మంత్రిగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తన మార్కును చాటుతున్నారు.
కార్మిక భవనానికి శంకుస్థాపన
వరంగల్ అజం జాహీ కార్మిక భవన స్థలం, భవనం విషయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొండా మురళి పై అటు స్వపక్షంలోనూ ఇటు విపక్షంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. కార్మిక భవన నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయించాలనే ఆలోచనలో ఉన్న కొండ మురళి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. కార్మిక భవన నిర్మాణానికి త్వరలో తేదీ నిర్ణయించే వీలుంది.

