మీ ఫోన్ ని మరెవరో వింటున్నారు!
చాటుమాటేసి మీ మాటల్ని వింటున్నారు
సాక్షాత్తు మంత్రే ఈ మాటలంటున్నారు
నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..
స్వయంగా సీఎమ్మే అంటున్నారు|CM|REVANTH REDDY|PONGULETI
ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా?
చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా?
సంచలనంగా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు
విచారణ జరుగుతుండగానే పేలిన తూటాలు
అనధికార ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలు
ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై అనేక ప్రశ్నలు
ఈ ట్యాపింగ్ కు ఫుల్ స్టాపింగ్ లేదా?
ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోందా? అధికారికంగానా? అనధికారికంగానా? ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుండగానే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ‘నేను అధికారులతో మాట్లాడిన టెలి కాన్ఫరెన్స్ విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఏ ఫామ్ హౌస్ నుండి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించడం సంచలనమైంది. నిర్ణీత నిబంధనల ప్రకారం. పరిమితంగా అధికారిక ఫోన్ ట్యాపింగ్ ఆక్షేపణీయం కాదని, అది చట్టబద్ధమేనని తెలిసిందే. అయితే, ఆ అధికారిక ఫోన్ ట్యాపింగ్ పరిధులు దాటి అనేకమంది ఫోన్లు విని, బ్లాక్ మెయిల్ చేసి, అధికారానికి తిరిగి రావడానికి, కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది? కానీ, అనధికారికంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినా, దానిపై విచారణ జరగకపోగా, చర్చ కూడా లేకుండాపోయిన తరుణంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ఇప్పుడు అంత్యంత ప్రాధాన్యంతను సంతరించుకున్నాయి. నాలుగ్గోడల మధ్య జరిగితే మాకేంటని..స్వయంగా సీఎమ్మే ఢిల్లీలో అంటున్నారు.*
*నిజంగానే అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా? జరిగితే ఎక్కడెక్కడి నుండి జరుగుతోంది? ఎంత కాలంగా జరుగుతోంది? ఆ పరికాలు ఇంకా భద్రంగా పని చేస్తూనే ఉన్నాయా? అది ఏ ఫాం హౌస్ నుండి జరుగుతోందో తెలుసన్న మంత్రి ప్రభుత్వ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? చట్టపరంగా ఎందుకు అరికట్టలేదు? మంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమా? చేతగాని తనమా? రాజకీయ వ్యూహమా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విచారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
✍🏻-డా.మార్గం లక్ష్మీనారాయణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత రెండున్నరేళ్ళుగా రచ్చరచ్చగా మారింది. అధికారిక ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతున్న సమయంలోనే మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలను బట్టి, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఏ ఫామ్ హౌస్ నుంచి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయంటున్న దాన్ని బట్టి తగిన సాక్ష్యాధారాలున్నట్లుగా తేలిపోతోంది.
జాతీయ భద్రత, తీవ్రమైన నేరాల విచారణ వంటి పరిమిత సందర్భాల్లో, చట్టబద్ధమైన అనుమతులతో మాత్రమే పోలీసు నిఘా విభాగం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. గత కొంతకాలంగా బయటకు వచ్చిన లీకులు, రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టుల సంభాషణలు అనధికారికంగా రికార్డ్ అయ్యాయన్న ఆరోపణలు ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ను నియమించింది. కొంత విచారణ పూర్తయ్యాక మరో సిట్ ను వేసింది. ఇప్పటికే వందల మంది బాధితులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ను సైతం విచారించారు.
రకరకాల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక నిర్ణయాలు కూడా లీకవుతున్నాయని భావించి, అధికారుల శాఖలు సమూలంగా మార్చారు. ఏకంగా సీఎంఓనే ప్రక్షాళన చేశారు. నిర్ణయాలు తీసుకోకముందే అవి లీకవడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు వాటిని పట్టుకుని నానా యాగీ చేయడం మాములైపోయింది. ఇదే విషయమై అనేక మంది మంత్రులతోపాటు సీఎం కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, చివరకు కల్వకుంట్ల కవిత కూడా తన, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయండంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను కాపాడుతున్నారని బీజేపీ, లేదు బీజేపే కేసీఆర్ ను కాపాడుతోందని సీఎం ఆరోపించకుంటుంటే, తమనేమీ చేయలేరని బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. విచారణాధికారులను సైతం బహాటంగానే బెదిరిస్తూనే ఉన్నారు.
విచారణ చివరి దశకు చేరిందని కూడా అంటున్న ఈ దశలో ఒక కేబినెట్ మంత్రి “ఫోన్ ట్యాపింగ్ ఆగలేదు. ఇంకా జరుగుతూనే ఉంది” అనడం, ఏ ఫాం హౌస్ నుంచో తెలుసని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఆందోళనపరుస్తోంది. ఆలోచింప చేస్తోంది. మంత్రి వ్యాఖ్యలు నిజమైతే, అనధికారంగా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుంటే, అది తీవ్రమైన చట్ట వ్యతిరేక చర్య. నేరం. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అలాంటి నేరాన్ని, నేరగాళ్ళను ఎందుకు అదుపు చేయలేకపోతోంది?
మంత్రి వ్యాఖ్యలు వ్యూహాత్మకమైనవా? ప్రత్యర్థులను కట్టడి చేసే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలైతే, అవి విచారణ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. విచారణలో ఉన్న అంశాలపై వ్యాఖ్యలు విచారణ తీరుపైనే అనుమానాలను కలిగిస్తున్నాయి.
మంత్రి ప్రస్తావించిన “ఫామ్ హౌస్” వ్యాఖ్య మరింత సంచలనాత్మకం. ఇది గత పాలనలోని ఆరోపణలను గుర్తుకు తేవడమే కాదు, తెరమీదకు తెస్తోంది. అయితే, ఏ ఆరోపణలకైనా ఆధారాలే కీలకం. మంత్రి వ్యాఖ్యలకు మంత్రే సమాధానం చెప్పాలి. లేదంటే మంత్రి వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారం రేపే ప్రమాదం ఉంది.
నాయకత్వం వహించే పాలకులే తమ ప్రభుత్వ యంత్రాంగం తమ మాటల్నే లీక్ చేస్తోందని అనుమానిస్తే, బహిరంగంగా ప్రకటిస్తే, పరిపాలన ఎలా సాగుతున్నట్లు? అది పాలనపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ నిజంగా విశ్వసనీయంగా సాగాలంటే, రాజకీయ వ్యాఖ్యలకంటే సంస్థాగత చర్యలు ముఖ్యం. స్వతంత్ర దర్యాప్తు, కాలపరిమితిలో స్పష్టంగా జరగాలి. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే, అది ఎంతటి వ్యక్తి అయినా చట్టం ముందు సమానమేనని ప్రజలకు తెలిసేలా శిక్షించాలి.
మరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పై విచారణ పారదర్శకంగా సాగుతుందా? లేక రాజకీయ వ్యాఖ్యల తుఫానులో కొట్టుకుపోతుందా? తేలాల్సి ఉంది.

