ఆదివాసీ సంప్రదాయాల మధ్య జాతర శుభారంభం
మేడారం ప్రత్యేక ప్రతినిధి, జనవరి 21 (అడుగు న్యూస్):
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తొలి ఘట్టం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాతర ఆరంభానికి అధికారిక సంకేతంగా భావించే ‘మండమెలిగే పండుగ’ను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు స్వామి కొలువై ఉన్న ఆలయంలో ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పండుగతోనే మహాజాతరకు తొలి అడుగు పడిందని గిరిజనులు విశ్వసిస్తారు.
‘వరుడు సిద్ధం’ అనే సంకేతం
మేడారం జాతర ప్రారంభానికి ముందు పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్ఠ తప్పనిసరి అనే కోయ సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయానికి అనుగుణంగా మండమెలిగే పండుగను నిర్వహించడం ద్వారా “వరుడు సిద్ధం… తల్లుల జాతరకు సమయం ఆసన్నమైంది” అనే భావనను చాటుతారు. ఈ పూజలతో మేడారం మహాజాతర విజయవంతంగా సాగుతుందన్న నమ్మకం భక్తుల్లో గాఢంగా ఉంది.
మండమెలిగే పేరు వెనుక చరిత్ర
పూర్వకాలంలో అగ్నిప్రమాదాల వల్ల దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతర వారం ముందు కొత్త కొమ్మలతో (మండలు) శుద్ధి చేసి పునర్నిర్మించే ఆచారం ఉండేదని పూజారులు వివరిస్తున్నారు. ఆ పవిత్ర సంప్రదాయానికే ‘మండమెలిగే’ అనే పేరు వచ్చిందని తెలిపారు. ఈ పండుగ సజావుగా జరిగితే మహాజాతర ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా జరుగుతుందని ఆదివాసీలు విశ్వసిస్తున్నారు.
రహస్యంగా ప్రత్యేక పూజలు
మండమెలిగే పండుగను ప్రధాన పూజారి పెనుక బుచ్చి రాములు, ఇతర ప్రధాన పూజారులు, పెనుక వంశస్థుల ఆధ్వర్యంలో శతాబ్దాల నాటి కోయ తెగ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి అత్యంత రహస్యంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సమయంలో సామాన్య ప్రజలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. డోలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ మామిడి తోరణాలతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.
దొరస్తంభాలతో అష్టదిగ్బంధనం
మహాజాతర పూజలకు దుష్టశక్తులు అడ్డురాకుండా ఉండేందుకు అడవిలో నుంచి తెచ్చిన బూరుక కర్రలకు మామిడి ఆకులు కట్టి పూనుగొండ్ల గ్రామ పొలిమేరల్లో దొరస్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని అష్టదిక్కుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయం కొనసాగుతుందని పూజారులు తెలిపారు.
కఠిన నిష్ఠతో పూజలు
ఇక నేటి నుంచి మహాజాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠిన నియమాలు పాటిస్తూ ప్రత్యేక నిష్ఠతో పూజలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధమైన జీవనం, నియమిత ఆహారం, శుద్ధి ఆచారాలతో వనదేవతల అనుగ్రహం పొందుతారన్న విశ్వాసం ఆదివాసీ సమాజంలో బలంగా ఉంది.

