రాజకీయ జోక్యం, పోలీసుల ప్రమేయంతో..
అమాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు|CASE
ఉన్నతాధికారితో విచారణకై డీజీపీకి విజ్ఞప్తి|DGP
WARANGAL|EAST|వరంగల్ తూర్పులో మళ్ళీ చెలరేగిన అలజడి
CONGRESS|MLC|కాంగ్రెస్ ఎమ్మెల్సీ సారయ్య సంచలనం
సంచలనాలకు నెలవైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి స్వపక్షంలో విపక్షం సమరానికి సై అంటోంది. అటో ఇటో తేల్చుకోవడానికి రె‘ఢీ’ అయింది. ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి కొందరి రాజకీయ నాయకుల ఆధిపత్యం కోసం కొందరు పోలీసు అధికారులు, మరికొందరి అమాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు పెడుతున్నార’ని, మాజీ మంత్రి, కాంగ్రెస్ కే చెందిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేయడం ద్వారా కయ్యానికి కాలుదువ్వారు. ‘నమోదైన తప్పుడు కేసులను ఉన్నత పోలీసు అధికారితో విచారించాలని డీజీపీకి వినతి పత్రం అందచేశారు. అయితే, ఈ నియోజకవర్గానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆసక్తిగా మారింది.
వరంగల్, జనవరి 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కొద్దికాలంగా నిశ్శబ్దంగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ వివాదాల అలికిడి వినిపిస్తోంది. నియోజకవర్గంలో చెలరేగుతున్న అట్రాసిటీ కేసుల పరంపరపై వ్యతిరేక అలజడి మొదలైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఈరోజు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ జోక్యంతో, తమ ఆధిపత్యం కోసం కొందరు సామాన్యులపై పోలీసు అధికారులు తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీకిచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో ఈ విధంగా ఉంది.

‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏజే మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్, మట్వాడా అనే మూడు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఒక ఉన్నత పోలీసు అధికారితో పునః విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే, కొందరి రాజకీయ నాయకుల ప్రభావంతో పోలీసు అధికారులు ప్రముఖ వ్యక్తులపై, సంబంధిత రాజకీయ నాయకుల బృందంలో చేరడానికి నిరాకరించిన రాజకీయ నాయకులపై, ఆధిపత్యం చెలాయించడానికి, అమాయక ప్రజలపై తప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని సామాన్య ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో, ఇటీవల వరంగల్లో పనిచేసిన ఒక ఏసీపీ, మట్వాడా స్టేషన్ లో పనిచేసిన ఒక సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. కొంతమంది పోలీసు అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు, ఆందోళనకు గురి చేస్తున్నారనడానికి ఇది స్పష్టమైన రుజువు.’ అని సారయ్య రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే, గతేడాది మార్చిలో ఖిలా వరంగల్ లో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని, కనీసం నిందితులను గుర్తించి, అరెస్టు చేయలేదని సారయ్య ఆరోపించారు. పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా మసులుకోవాలని ఆ విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సారయ్య డీజీపీని కోరారు.
ఎమ్మెల్సీ సారయ్య ఫిర్యాదు ఇంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అలాగే, కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందున, బాధితులు, వరంగల్ నగర ప్రజల పక్షాన డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

