‘మలి’ ఉద్యమానికి ‘తొలి’ ఆయనే!
నాటి గురుతులకు నేటి నెమరు…
DHIKSHA DIWAS|దీక్షాదివస్ సందర్భంగా అచ్చ విద్యాసాగర్ తో ‘అడుగు’ జాడ!|ADUGU
వారి కుటుంబం అప్పటికే వందల ఎకరాలకు భూస్వాములు. కార్ల కంపెనీలకు డీలర్లు. అనేక వ్యాపారాలకు ఆసాములు. తరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం. ఎవ్వరినీ నొప్పించని వ్యక్తిత్వం. ఇవన్నీ వారి సంకల్పం ముందు చిన్న బోయినాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కర్తవ్య బోధన చేసినాయి. 2001నుంచి ఉద్యమ ప్రస్థానం సాగిన 14ఏళ్ళపాటు వరంగల్ తెలంగాణ ఉద్యమాలన్నింటికీ వారే ఊతం. వారిదే ఇం‘ధనం’. తండ్రి అచ్చ రాఘవులు నేర్పిన జీవిత పాఠాల పాఠశాలలో అన్న అచ్చ వీరేశ్ బాబు, తమ్ముడు అచ్చ విద్యాసాగర్ లు రాటుదేలారు. తెలంగాణ పోరాట ఉద్యమాలకు వెరువని వీరుల్లా నిలిచారు. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. దీక్షాదివస్ రోజున కూడా కేసీఆర్ డైరెక్షన్ లో అచ్చ విద్యాసాగర్ కేటీఆర్ వెంటే ఉన్నారు. ఆనాటి గురుతులను అచ్చా విద్యాసాగర్ ‘అడుగు’జాడ తో నెమరేసుకున్నారు.
వరంగల్, నవంబర్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన నాటి నుండి నేను, మా కుటుంబం మొత్తం వారి వెంటే, ఆ ఉద్యమం వెంటే ఇప్పటి దాకా ఉన్నాం. వరంగల్ లో మొదట కేసీఆర్ గారు మా ఇంటికి కూడా వచ్చేవారు. కేసీఆర్ దిశా నిర్దేశంలో చిన్నా చితక మీటింగుల నుంచి వరంగల్ సింహ గర్జన వంటి చారిత్రక భారీ బహిరంగ సభల వరకు ఉద్యమంతోపాటే మా ప్రయాణం, మా పాత్ర కొనసాగుతూనే ఉంది. అలా జయశంకర్ సార్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితక్కలు సహా, ఉద్యమానికి అండగా వచ్చిన నేతలెవరైనా మా ఆతిథ్యం తీసుకోవాల్సిందే. ఇలా సాగిన మా ఉద్యమ ప్రస్థానంలో దిక్షా దివస్ ఓ మరచిపోలేని మధుర ఘటన. జ్ఞాపకం.
2009 నవంబర్ 29కి కొద్ది రోజుల ముందు నుంచే కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించిన చర్చలు తెలంగాణ భవన్ లో జరుగుతూనే ఉన్నాయి. వినోద్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్ తదితరులమంతా ఆ చర్చల్లో పాలు పంచుకున్నాం. అప్పట్లో తెలంగాణ ఉద్యమ రూపమేదైనా అందులో అగ్రభాగం వరంగల్ కే ఉండేది. వరంగల్ ఉద్యమానికి ఊపరిగా సాగేది. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలుపులోనూ వరంగల్ పాత్ర అజరామరం. సార్.. అప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. దీనికి ఒకటి రెండు రోజుల ముందే కేసీఆర్ కరీంనగర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీక్షకు సంబంధించి తర్జనభర్జనలు జరిగాయి. ముందుగా దీక్ష వరంగల్ లోనే చేయాలనుకున్నారు.
తర్వాత హైదరాబాద్, కరీంనగర్ అనుకున్నారు. చివరకు హరీశ్ రావు గారి సూచన మేరకు సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేశారు. అయితే దీక్షను కచ్చితంగా పోలీసులు అడ్డుకుంటారు. అప్పుడు దాన్ని కొనసాగించే దెలా? అన్నదే ప్రధాన సమస్య. దానికి అన్ని జిల్లాలు, ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలను సమాయత్తం చేశారు. కేసీఆర్ వెంట ఎవరుండాలి? వరంగల్ లో ఎవరెవరుండాలి? దీక్షను పోలీసులు అడ్డుకున్న తర్వాత కూడా ఎలా కొనసాగించాలన్న ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మమ్మల్ని వరంగల్ లోనే ఉండాలని, ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ గారు ఆదేశించారు.
‘తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి బయలు దేరిన కేసీఆర్ ను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ ను తన వాహనం నుంచి బలవంతంగా దించివేయడంతో, రోడ్డుమీదే ధర్నా ప్రారంభించారు. దీంతో కేసీఆర్ ను వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. వరంగల్ మీదుగా కావడంతో వరంగల్ నగరం దాటే వరకు కేసీఆర్ ని తీసుకెళ్ళిన వాహనాల వెంబడి పడి ప్రయాణించాం. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాం. అడగడుగునా పోలీసుల వాహనాలను అడ్డుకున్నాం. ఖమ్మం దాకా ఇదే పరిస్థితి.
పోలీసులు ముందుగా కేసీఆర్ ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ సెంట్రల్ జైలు వరంగల్ నగరం నడిబొడ్డున ఉంది. వరంగల్ కు మార్చారు. వరంగల్ ఉద్యమాల గడ్డ. అడ్డా కావడంతో ఇక్కడ ఉద్యమకారులను అదుపుచేయడం సాధ్యం కాదని, తర్వాత కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తీసుకెళ్ళారు. అప్పుడు ఖమ్మంలో ఉద్యమ తీవ్రత తక్కువగా ఉండేది. కానీ, ఖమ్మం కు కూడా వరంగల్ నుంచి ఉద్యమకారులు వెళ్ళారు.
అయితే, ఆ సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేటీఆర్ ఉప్పుడప్పుడే ఉద్యమంలో బలం పుంజుకుంటున్నారు. కేటీఆర్ వెంటే ఉండే డ్యూటీ మాకప్పగించారు. మేమంతా టీమ్ గా కేటీఆర్ వెంటే ఉన్నాం. కేసీఆర్ వెంట నాయిని నర్సింహారెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్, వినోద్ గారు తదితరులు వెళ్ళారు. వరంగల్ కేటీఆర్ విడుదలైనప్పుడు కూడా మేమంతా ఆయనకు ఘనంగా స్వాగతం పలికాం.
అదే రోజు శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఘటన ఉద్యమాన్ని రగులుకొల్పింది. ఖమ్మం జైలులో కేసీఆర్ దీక్షలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. కేటీఆర్ విడుదల తర్వాత ఒకవైపు వరంగల్ లో ఉద్యమాన్ని నడుపుతూనే, మరోవైపు నిమ్స్ కు వెళ్ళి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆరోగ్యాన్ని వాకబు చేస్తూనే, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే వరంగల్ లో జరిగే ఉద్యమాలే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు దిశానిర్దేశంగా ఉండేవి.
డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష విరమించిన వరకు11 రోజుల పాటు ఉద్యమాన్ని వరంగల్ లో ఉద్ధృతంగా నిర్వహించాం. సబ్బండ కులాలు, వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇప్పటికీ తెలంగాణ నిబద్ధతతోనే ఉన్నాం. అయితే ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలే మాకు మిగిలాయి. ఫలితాలు అందరికీ అందాయి.
ఉద్యమం కోసం మా వ్యాపారాలను నిర్లక్ష్యం చేసి, చాలా వరకు వదులుకున్నాం. ఎంతో ఖర్చు చేశాం. విలువైన మా భవిష్యత్తును ఉద్యమానికి త్యాగం చేశాం. ఎందుకనో కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ళ పాలనలో మాకు తగిన గుర్తింపు రాలేదు. ఏ అవకాశమూ ఇవ్వలేదు. అయినా మేం బీఆర్ఎస్ పార్టీని వీడలేదు. ఎవరినీ నిందించడం లేదు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సంతోషం మిగిలింది. చాలు.’


