ఓరుగల్లు…
హోరు జల్లు! గుండె గొల్లు!!
క‘న్నీటి’ కష్టాల్లో ‘కాక’తీయ నగరం|KAKATIYA
ఆగమాగంగా DRAINAGE|డ్రైనేజీ వ్యవస్థ
అగమ్య గోచరంగా జనావస్థ
ROADS|రోడ్లు వేసి డ్రైనేజీ మరిచారు
చెరువులను మింగేశారు
నాలాల వెడల్పు తగ్గించారు
కాలువలను తవ్వేశారు
మట్టిని వదిలేశారు
RAILWAY TRAK|రైల్వే ట్రాక్ వేశారు
కాలువలను మూశారు
నిధుల ఖర్చు చూపారు
పనులు మిగిల్చిపోయారు
రెండేండ్ల కింద ఇలాగే…
మరోసారి అలాగే…
మునిగినా మంత్రులు రారు?
సీఎం పశ్చిమకొచ్చారు
తూర్పును మరిచారు
వరంగల్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం. తెలంగాణ సాంస్కృతిక రాజధాని. విద్యా కేంద్రం. విపరీతంగా విస్తరిస్తున్న మహానగరం. అంతేకాదు, ప్రతి ఏటా వర్షాలకు నీట మునిగే నగరం కూడా. మౌలిక వసతుల లోపాలు, కాల్వల దురాక్రమణలు, చెరువుల కబ్జాలు, ప్రణాళికలేని విస్తరణ, పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, పట్టింపులేని ప్రజలతో కలగలిసి వరంగల్ను వర్షానికి వణికే నగరంగా మార్చేశాయి. వరంగల్ నీట మునగడానికి గల కారణాలు – నివారణ చర్యలపై ‘అడుగు’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

వరంగల్, ఆక్టోబర్ 31 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
చారిత్రకగా వరంగల్ కాకతీయుల రాజధానిగా అద్భుతమైన ప్రణాళికతో నిర్మితమైంది. నగరానికి చుట్టుముట్టు చెరువులు, వాగులు, కాల్వలు వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేయడమే కాకుండా, నగరాన్ని ముంపు నుంచి కాపాడేవి. పద్మసముద్రం, ధర్మసాగర్, భద్రకాళి చెరువు, హనుమకొండ వడ్డేపల్లి చెరువు వంటి నీటి వనరులు సహజ జలవనరుల కేంద్రాలుగా ఉండేవి. కాలక్రమేణా చెరువులు ఆక్రమణకు గురవడం, కాల్వలు మూసివేడటం లేదా డ్రైనేజీలుగా మారడమే వరంగల్ ను ముంచేస్తున్నాయి.
వానంటే వణుకు
సమరాంగ ‘కాక’ ‘తీయ’ నగరానికి వానంటే వణుకు. వాన కురిస్తే ఎవరికైనా సంతోషం వేస్తే, వరంగల్ ప్రజలకు భయం వేస్తోంది. వాన గంట కొడితే చాలు, హనుమకొండ, కాజీపేట, సుబేదారి, కాజీపేట రైల్వే స్టేషన్, ఎన్ఆర్ఐ కాలనీ, ఎంజీఎం హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాలు, సమ్మయ్య నగర్, పెద్దమ్మగడ్డ, గిర్మాజీపేట్, ఫతేపూర్, రామానుజపురం, శివనగర్ కాలనీలు మునిగిపోతాయి.
పడకేసిన పట్టణ ప్రణాళిక
వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగరి వేగంగా అభివృద్ధి చెందింది. కానీ విస్తరణలో పట్టణ ప్రణాళిక పడకేసింది. కొత్త కాలనీలు చెరువుల ఫీడర్ చానెళ్లపై, నదీ వాగుల పక్కన ఏర్పడ్డాయి. వరంగల్ కార్పొరేషన్ అనుమతులిచ్చిన నిర్మాణాలు వర్షపు నీటి ప్రవాహ దారులను ఆపేస్తున్నాయి. ఫలితంగా వర్షపు నీరు సహజంగా ప్రవహించకుండా ఇళ్లలోకి చేరుతుంది.
పాతబడిన డ్రైనేజీ వ్యవస్థ
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పాతపడింది. చాలా చోట్ల సిమెంట్ పైపులు చిట్లిపోయాయి, మట్టితో నిండిపోయాయి. కొత్త కాలనీలు ఏర్పడ్డా, పాత డ్రైనేజీల సామర్థ్యం పెంచలేదు. వర్షపు నీరు, కాలువ నీరు రెండూ ఒకే లైన్లో కలవడం వల్ల డ్రైనేజీ లైన్ ఓవర్ఫ్లో అవుతోంది. మురికి నీరు రోడ్లపైకి రావడం, కాలుష్యం పెరగడం సాధారణమైపోయింది.
చెరువుల దురాక్రమణ – కాలనీలు
వరంగల్ చుట్టుపక్కల ఉన్న 70కి పైగా చెరువులు గత రెండు దశాబ్దాల్లోనే ఆక్రమణకు గురయ్యాయి. చెరువుల్లోనే కాలనీలు ఏర్పడ్డాయి. భద్రకాళీ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు చెరువు సహజ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. అలాగే, పద్మసాగర్, ధర్మసాగర్ చెరువులకు వచ్చే కాల్వల మీద ఇళ్లు, రోడ్లు, వ్యాపార సముదాయాలు ఏర్పడ్డాయి.
ఎత్తైన రోడ్ల ప్రభావం
ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాలో విస్తృతంగా రోడ్లు, రింగ్ రోడ్లు, హైవేలు నిర్మాణమయ్యాయి. వీటికి సరైన వర్షపు నీటి అవుట్లెట్లు ఏర్పాటు చేయలేదు. కాలనీల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తులో ఉండడంతో నీరు ఆ ప్రాంతాల్లో చేరిపోతోంది.
స్మార్ట్ సిటీ నిధులేమయ్యాయి?
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో డ్రైనేజీ విస్తరణ, రీ-మోడలింగ్, కొత్త రోడ్ డ్రైనేజీల ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ ఉన్నాయి. కాజీపేట–హనుమకొండ కనెక్టింగ్ కాల్వల క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ ఆ పనులేవీ ప్రభావం చూపడంలేదు. పనుల్లో జాప్యం, నాణ్యతాలోపాలతోపాటు, పట్టణాభివృద్ధి వేగం, వర్షాల తీవ్రత దానికంటే ఎక్కువగా ఉంది.
ప్రజల నిర్లక్ష్యం కూడా కారణమే
నగర ప్రజలు కూడా ఈ సమస్యలో భాగస్వాములే. వర్షపు నీటి కాల్వల్లో చెత్త వేయడం, డ్రైనేజీలను మూసివేయడం, ఆక్రమణల్లో నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యల వల్ల నీటి ప్రవాహం ఆగిపోతోంది. కాలుష్యం పెరగడమే కాకుండా వర్షాకాలంలో దోమల సమస్యలు, వ్యాధులు ప్రబలుతున్నాయి.
వాతావరణ మార్పులు, భారీ వర్షాలు
ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు కారణంగా క్లౌడ్ బరస్ట్ తరహాలో తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదవుతోంది. గంటల్లోనే 10–12 సెం.మీ. వర్షం కురుస్తోంది. ఈ వర్షాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలు వరంగల్లో లేవు. వరంగల్ లో ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ 2–3 సెం.మీ. వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. పెద్ద వర్షం పడితే చాలు నగరం నీట మునుగుతోంది.
స్మార్ట్ సిటీ – స్మార్ట్ నీటి నిర్వహణ
వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ‘ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను ప్రవేశపెట్టవచ్చు. సెన్సార్ల ద్వారా నీటి మట్టం, వర్షపాతం, డ్రైనేజీ ప్రవాహం రియల్ టైమ్లో మానిటర్ చేయవచ్చు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ అమలు చేస్తే ప్రజలు ముందుగానే సురక్షితంగా ఉండగలరు.
పర్యావరణ సుస్థిరతపై దృష్టి
వరంగల్ నగరాన్ని నీట మునగని నగరంగా మార్చాలంటే పర్యావరణానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి. చెట్లు నరికి రోడ్లు వేసే బదులు, గ్రీన్ బఫర్ జోన్లు ఏర్పరచాలి. చెరువుల చుట్టూ గ్రీన్ బెల్ట్ లు ఏర్పాటు చేయాలి. వర్షపు నీరు సహజంగా మట్టిలో కలిసేలా తగిన సదుపాయాలు చేయాలి.
శాశ్వత పరిష్కారం వైపు
ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజలు కలిసి పనిచేస్తే వరంగల్ను ముంపు సమస్య నుంచి విముక్తం చేయడం సాధ్యమే. మానవతప్పిదాలను సవరించాలి. ఆక్రమణలను తొలగించి, సహజ నీటి మార్గాలను పునరుద్ధరించడమే ప్రధాన పరిష్కారం. వరంగల్ నగరానికి ప్రత్యేక మాస్టర్ డ్రైనేజీ ప్రణాళిక రూపొందించి, దశల వారీగా అమలు చేయాలి.
కేవలం వర్షాల వల్ల మాత్రమే వరంగల్ నీట మునగడం లేదు. మనిషి నిర్లక్ష్యం, ప్రణాళికల లోపం, ఆక్రమణలు కలిసి ఆగం చేస్తున్నాయి. తాత్కాలికం కంటే దీర్ఘకాల ప్రణాళిక అవసరం. చెరువులు, వాగులు, కాల్వలు మళ్లీ జీవం పొందితేనే వరంగల్ నగరం నీటి ముంపు సమస్య నుంచి విముక్తమవుతుంది. సహజ సమతుల్యతను కాపాడుతూ పర్యావరణహిత అభివృద్ధి దిశగా ‘అడుగు’లు వేస్తేనే వరంగల్ మళ్లీ ‘శాశ్వత స్మార్ట్ సిటీ’గా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
నివారణ చర్యలేంటి?
వరంగల్ నగరానికి శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు అవసరం.
1. చెరువుల పునరుద్ధరణ: పాత చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేయాలి. ప్రతి చెరువు క్యాచ్మెంట్ ప్రాంతాన్ని గుర్తించి రక్షణ గోడలు నిర్మించాలి.
2. కాల్వల క్లీనింగ్, రీ-మోడలింగ్: ప్రధాన డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, వాటిని సాంకేతికంగా విస్తరించాలి. వర్షపు నీటిని వేరుగా సేకరించే “స్టార్మ్ వాటర్ డ్రెయిన్” వ్యవస్థను ప్రవేశపెట్టాలి.
3. పట్టణ ప్రణాళిక సంస్కరణలు: కొత్త భవనాలకు, కాలనీలకు అనుమతుల నిబంధనలను కఠినం చేయాలి. వాగు, చెరువు, కాల్వ పరిధుల్లో ఏ నిర్మాణం చేయకుండా చట్టపరంగా నిషేధించాలి. పకడ్బందీగా అమలు చేయాలి.
4. టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్: డ్రోన్ల సహాయంతో ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటి ప్రవాహ దిశను సిమ్యులేషన్ ద్వారా అంచనా వేయాలి.
5. వర్షపు నీటి హార్వెస్టింగ్: ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్లో వర్షపు నీటిని నిల్వ చేసే రీచార్జ్ పిట్లు తప్పనిసరి చేయాలి
6. ప్రజల్లో అవగాహన, చైతన్యం: చెత్తను కాల్వల్లో వేయకూడదని, ఆక్రమణలకు సహకరించకూడదని ప్రజల్లో అవగాహన పెంచాలి.
7. సహజ నీటి మార్గాల పునరుద్ధరణ: పాత వాగులు, నదీ మార్గాలను మళ్లీ తెరిపించి సహజ నీటి ప్రవాహం కొనసాగించాలి.

