జన-తన బాటా?
ఇంటి గుట్టు బయటేశారు
కుట్ర పన్ని బయటకు పంపారు
నా దారి నేను వెతుక్కుంటున్నా
ఎన్నో అవమానాలు భరించా…
మెట్టినింటి నుంచి పుట్టినింటిపై కవిత ఆరోపణలు
పదళ్ళూ పవర్లో ఉండీ వాళ్ళకేం చేయలేకపోయాం
అమరవీరుల కుటుంబాలకు అన్యాయం
ఆడబిడ్డలకు తులం బంగారం ఎప్పుడు
ఇంతకాలం పొలిటికల్ వ్యాక్యూమ్ వెతుకులాట!?
వచ్చే ఎన్నికల్లో మెట్టినింటి నుంచే కవిత పోటీ?
ఆసక్తిగా మారిన కవిత ‘జాగృతి జనం బాట’
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత జనం బాట పట్టారు. జనం బాటలోనే తన బాటను వెతుక్కుంటున్నారు. జన-తన బాటలో స్వతంత్రంగా మొదటి అడుగు వేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం నుండి ‘జాగృతి జనం బాట’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మెట్టినింటి నుంచి పుట్టినింటిపై మరోసారి ఆరోపణలు చేశారు. ‘ఇంటి గుట్టు బయటేశారు. నాపై కుట్ర పన్ని, బయటకు పంపారు. 20ఏళ్ళు బీఆర్ఎస్ కోసం పని చేశాను. ఎన్నో అవమానాలు పడ్డాను. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాను’ అని కవిత అన్నరు. అంతేకాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. మరోవైపు ఆడబిడ్డలకు తులం బంగారం ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను పుట్టి, పెరిగిన పార్టీని సుతిమెత్తగా తిడుతూనే, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు. నిజానికి కవిత గత కొంత కాలంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ని వెతుక్కున్నారు. నిజంగానే జనం బాటలో కవిత, తన బాటను వెతుక్కుంటున్నారా? ఆసక్తిగా మారిన కవిత ‘జాగృతి జనం బాట’పై ‘అడుగు’ ప్రత్యేక కథనం
హైదరాబాద్, అక్టోబర్ 25 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కల్వకుంట్ల కవిత. తెలంగాణకు పరిచయం అవసరంలేని పేరు. తెలంగాణ సాంస్కృతిక సారథిగా పేరు బడ్డ ఆమె, మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ. పుట్టినింటి నుండి గెంటివేయబడ్డ తర్వాత చివరకు మెట్టినింటికే చేరారు. మెట్టినింటి నుండి పుట్టినింటిపై మరోసారి విమర్శులు చేశారు. తనపై కుట్ర పన్ని బయటకు పంపారని, ఇంటి గుట్టును బయటేశారని, అందుకే జనం బాట పట్టానని చెప్పారు. తనకు ఎంపీగా, ఎమ్మెల్సీగా రాజకీయ భిక్ష పెట్టిన నిజామాబాద్ నుండే తన రాజకీయ రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత మొదటిసారిగా జనజీవనంలోకి అడుగిడారు. తెలంగాణ ‘జాగృతి జనం బాట’ పట్టారు.
రాజకీయ భవిష్యత్తు కోసమే
‘నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు… ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన జిల్లా. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే ‘జాగృతి జనం బాట’ ను ప్రారంభించడం సముచితంగా భావించాను. అంతేకాదు, నిజామాబాద్ లో తన ఓటమికి కుట్ర జరిగిందని కూడా కవిత ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎక్కడ పోగొట్టకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను కవిత నిజం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా ఆమె నిజామాబాద్ నుండి ఎంపీగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. కొందరి కుట్రల వల్లే ఓడిపోయానని చెబుతున్న ఆమె, తిరిగి ఆమె తన రాజకీయ స్థానాన్ని, ప్రారంభించిన ప్రస్థానం నుండే సుస్థిరం చేసుకుంటున్నారన్నది ఆమె వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.
పొలిటికల్ వ్యాక్యూమ్ కోసం..
నిజానికి తనపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు, జైలు జీవితం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కవిత, తన రాజకీయ జీవితంపై మథన పడ్డారని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. అదే ఆమెకు నెగెటివ్ అయిందేమో? అనూహ్యంగా పార్టీ బహిష్కరణకు గురయ్యారు? ఆ నెగెటివ్ ని పాజిటివ్ గా మార్చుకోవడంపై దృష్టి సారించారు. బీసీ ఉద్యమం వంటివన్నీ అందులో భాగమే. అయితే తన సామాజిక వర్గం, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, ఏకంగా స్థానికంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఎత్తు వేయడం ఆమెకు కలిసిరాలేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం, అమరుల కుటుంబాలను పట్టించుకోకపోవడం వంటికి కనిపించాయనుకోవాలి. లేదా వారిని తమవైపునకు మళ్ళించడానికైనా ఇలా మట్లాడుతూ ఉండాలి. వాళ్ళకు క్షమాపణలు చెప్పడం ద్వారా అదే చేశారు. జనం బాట పట్టారు.
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుండే పోటీ
రాజకీయాల్లో స్థాన బలం ముఖ్యం. పురుషులకైతే పుట్టినిల్లు బలం. మహిళలకైతే మెట్టినిల్లు మరో బలం. పెళ్ళైన తర్వాత సాధారణంగా మెట్టినింటికే పరిమితమయ్యే మన సంప్రదాయాలకు భిన్నంగా కవిత, పుట్టినింటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల ఇంటి పేరునే మోస్తూ, ఫేమ్ అయ్యారు. అయితే, ఇప్పుడు పుట్టినిల్లు పొమ్మంది. తాను పుట్టిన రాజకీయ పార్టీ నుండి కూడా బయటకు పంపేశారు. దీంతో ఆమె అనివార్యంగా మెట్టినింటిని తన రాజకీయ భవిష్యత్తుకు వేదికగా ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
వ్యూహంగానో, అనూహ్యంగానో కవిత, నిజామాబాద్ నుంచి 2014లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కేంద్ర రాజకీయాల్లో కరుణానిధి కూతురు కణిమొలి లా జాతీయంగా మెరిశారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, బీజేపీ చేతిలో ఓడారు. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆమెను ఓడించారని ప్రచారం జరిగింది. ఆమె ఓటమిలో బీఆర్ఎస్ కుట్ర కోణం ఉన్న సంగతి కవిత వెల్లడించే వరకు బయటి ప్రపంచానికి తెలియదు. తర్వాత జరిగిన పరిణామాల్లో అనూహ్యంగా కవిత, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవాల్సిన అనివార్యత ఏర్పడింది.
కవితకు కాంగ్రెస్ తో అనుబంధం ఉందని బీఆర్ఎస్, లేదు బీజేపీ వదిలిన బాణమని కాంగ్రెస్ విమర్శలు వచ్చాయి. అయితే, కవిత కేసీఆర్ వదిలిన బాణమేనని కూడా ఆరోపణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కవిత మరోదారి ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే కవిత పదే పదే ‘నా దారి నేను చూసుకుంటున్నాను.’ ‘రాజకీయాల్లో ఎవరూ లిఫ్టివ్వరు.. మనమే తొక్కుకుంటూ ముందుకు పోవాలి’, ‘అవసరమైతే, ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ పెడతాను’ వంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే కవిత తాజాగా జనం బాట పట్టారు. జనం బాటలోనే కవిత తన బాటను వెతుక్కుంటున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా కవిత అభ్యర్థి కానున్నారు. ఎంపీకా, ఎమ్మెల్యేకా? అన్నది వేరే విషయం కాగా, పార్టీ ఏదనేది, ఆమె పదే పదే చెబుతున్న బహుషా పెట్టే పార్టీని బట్టి ఉండవచ్చు.
అయితే అప్పటి దాకా జనంలో ఉండడానికి కవిత జనం బాటను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు వింటూ, వచ్చే ఎన్నికలనాటి దాదాపు మూడేళ్ళు ప్రజల్లోనే ఉండటం ఆమె ఎత్తుగడ కావచ్చు. అప్పటికి పరిస్థితులను బట్టి కొత్త పార్టీ పెట్టడమా? లేదంటే అప్పటికే ప్రజల్లో ప్రముఖంగా ఉన్న పార్టీలో చేరడమా? అంతకు మించి వస్తున్న ఆరోపణలు నిజమైతే సొంతగూటికి వెళ్ళడమా? అన్నది కాలం నిర్ణయిస్తుంది.

