Friday, April 3, 2026
35.2 C
Hyderabad

తప్పించి, తప్పించుకోగలరా!?|KONDA SUREKHA

తప్పే లేకపోతే నిందితుడిని..
ఎందుకు తప్పించినట్లు?
అంతగా భయమెందుకు?
సీఎంను ఎందుకు కలవలేదు?
మంత్రులను కలవడమేంటి?
కేబినెట్ కు ఎందుకు పోలేదు?
సీఎం వరంగల్ పర్యటనకు,
ఎందుకు దూరంగా ఉన్నారు?
సాగితే మరి ‘పటేల్’ గిరీ!?
సాగకపోతే చాలు బీసీ కార్డు!

హైదరాబాద్, ఆక్టోబర్ 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
నిందితుడిని తప్పించి, ఆ నిందారోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పించుకోగలరా? అసలు తప్పించడంలోనే తప్పు ఉంది కదా? పైగా అది నేరం కూడా. మరి తప్పే లేకపోతే నిందితుడిని ఎందుకు తప్పించినట్లు? అంతగా భయపడటమెందుకు? ఆ హైరానాలో సీఎంను, మంత్రులను, ఓ సమాజిక వర్గాన్ని టార్గెట్ చేసి, బీసీ కార్డు నెత్తుకోవడమెందుకు? అడసు తొక్కనేల? కాళ్లు కడగనేల? అన్నట్లుగా ఉంది రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖది. ఆమె కుటుంబ సభ్యులది.
సాధారణంగా సరైన ఆధారాలు లేకుండా ప్రభుత్వం స్థాయిలో ఓ శాఖలో ఓఎస్డీగా పని చేస్తున్న అధికారిని టర్మినేట్ చేసేదాకా పరిస్థితులు వెళ్ళవు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ నార్ల సుమంత్ పై వచ్చిన ఆరోపణలు కూడా సామాన్యమైనవేమీ కావు. బెదిరింపులు, డబ్బుల వసూళ్ళు, గన్ పెట్టి డబ్బుల వసూళ్ళు, పీసీబీని అడ్డం పెట్టుకుని ఆడింది ఆట, పాడింది పాటగా సాగించుకున్నారు. ఇందులో హజూర్ నగర్ కు చెందిన డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధిని సీఎంకు సన్నిహితంగా ఉంటోన్న, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ఇంట్లోనే ఆయనతో కలిసి సుమంత్ పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టారంటే, వసూళ్ళు, బెదిరింపులు ఏ స్థాయిలో జరిగాయో అంచనా వేయవచ్చు. ఇవన్నీ సంబంధిత మంత్రికి తెలియకుండానే జరిగాయని అనుకోలేం. అలాగే సుమంత్ టెర్మినేషన్ మంత్రి సురేఖకు తెలిసే జరిగి ఉంటుంది. లేకపోతే ఆమె ఇంతగా ప్రిపేర్ అయి ఉండేవారు కాదేమో? బహుషా అందుకే ఆమె సీఎం వరంగల్ పర్యటనను కూడా బహిష్కరించారు. కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు.

ఒకవేళ సుమంత్ నీతిమంతుడైనా, ఆయన చేసిన దందాలకు కొండా సురేఖకు సంబంధం లేకపోతే, మంత్రి ఎందుకంత భయపడుతున్నట్లు? పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన, చేస్తున్న అనుభవం ఉన్న సురేఖకు, పోలీసులు వెదుకుతున్న ఓ నిందితుడిని తమ ఇంట్లో దాచి పెట్టి, ఆశ్రయం ఇచ్చి, పోలీసులే కళ్లెదుటే తన కారులో తప్పించడం నేరం కాదా? మంత్రిగా ఆలా చేయొచ్చా? ఇదంత ఆమెకు కూడా తెలియకుండానే జరిగందని, ఆమె చేశారని అనుకోవచ్చా?

మంత్రి కొండా సురేఖకు పార్టీలో, ప్రభుత్వంలో, సహచర మంత్రివర్గంలో, ఆమె జిల్లాలో, చివరకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎలాంటి స్పందనా, మద్దతు లభించలేదు. ఎందుకు? అందరినీ దూరం చేసుకున్నారా? లేక వారే దూరమయ్యారా? కనీసం వాళ్ళుచెప్పుకుంటున్న బీసీలు, సంఘాలు, నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదు. ఆలోచించాలి.

గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికైన నాటి నుంచి కొండా దంపతులు తాము గెలిచిన నియోజకవర్గంలోనూ వ్యతిరేకతనే మూటగట్టుకున్నారని కాంగ్రెస్ క్యాడరే చెబుతోంది.

ఈ దశలో కొండా సుస్మిత జోక్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. ఆమె ఏ అర్హతతో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు? ఓఎస్డీ అవినీతి, అరెస్టు విషయాల్లో జోక్యం చేసుకున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేగాక ఆమె వ్యాఖ్యలు కొండా కుటుంబాన్ని మరింత వివాదంలోకి నెట్టేశాయని అంటున్నారు. కొండా కుటుంబంలో మంత్రి సురేఖ, కొండా మురళి, సుస్మిత తలో తీరుగా మాట్లాడి సాధించిందేమీ లేకపోగా, మరిన్నికష్టాలు తెచ్చుకున్నారని అనుకుంటున్నారు.

‘తప్పు’టడుగులు?
తప్పుల మీద తప్పులు!

హైదరాబాద్, అక్టోబర్ 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కర్ణుడి చావుకు వంద కారణాలంటారు. అట్లే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఈ రెండు సామెతలు కొండా కుటుంబానికి సరిగ్గా సరిపోతాయి. రెండో సామెతను నిజం చేస్తూ, మొదటి సామెతకు దగ్గరగా చేరిన కొండా దంపతులు తమ రాజకీయ ప్రయాణంలో తప్పటడుగులే కాదు తప్పుటడుగులు కూడా వేస్తున్నారు. అందుకే అనేక విధాలుగా వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. బహుషా తెలంగాణ రాజకీయాల్లో ఇంతగా కొండంతగా వివాదమవుతున్న రాజకీయ నాయకులు కొండా దంపతుల తర్వాతనే అనడం అతిశయోక్తి కానే కాదు.
అయితే తమ ఓఎస్డీ నియామకం, నుంచి తొలగింపు దాకా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిలు చేసిన తప్పిదాలు అవే తప్పుటడులు చాలానే ఉన్నాయి.

1. సుమంత్ ను ఓఎస్డీగా పెట్టుకోవడం: సాధారణంగా ఓఎస్డీలు ప్రభుత్వ అధికారులే ఉంటారు. అందునా సీనియర్లను పెట్టుకుంటారు. కానీ మంత్రి కొండా సురేఖ, తన కూతురు క్లాస్ మేట్, ప్రభుత్వ అధికారి కాని, సుమంత్ ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఔట్ సోర్సింగ్ లో నియమించి, తమ దగ్గర డిప్యూటేషన్ వేయించుకున్నారు.

2. సుమంత్ ద్వారా దందాలు చేయడం: అధికారి కాని వ్యక్తిని ఓఎస్డీగా నియమించుకున్నప్పటికీ, అతని ద్వారా దందాలన్నీ జరిగాయి. చివరకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించే దాకా వెళ్ళింది. సీనియర్ మంత్రి చెప్పినా వినని స్థాయికి అవినీతి పెరిగిపోయింది. ఈ దందాలన్నీ మంత్రి సురేఖకు తెలియవనుకోలేం. తెలియకపోతే, సుమంత్ కి మంత్రి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి, కాపాడి, తన కారులోనే పోలీసుల కళ్ళ ముందే తప్పించి ఉండాల్సింది కాదు.

3. నిందితుడిని తమ ఇంట్లోనే దాచి పెట్టడం: ఒక మంత్రిగా ఉండీ, తన దగ్గరే పని చేసే వ్యక్తిని, ప్రభుత్వం తొలగించినప్పుడు, ప్రభుత్వంలో కీలక మంత్రిగా భాగస్వామి అయి ఉండీ సురేఖ, నిందితుడిని తమ ఇంట్లోనే దాచి పెట్టడం నేరమే అవుతుంది. పైగా అతడిని పోలీసుల కళ్ళెదుటే తప్పించడం మరో నేరం.

4. సుస్మిత పోలీసులను అడ్డగించడం: మంత్రి సురేఖ కూతురు సుస్మిత ఈ ఘటనలో పాలుపంచుకోవడం. పోలీసులను అడ్డగించడం, తమ తల్లిదండ్రులను వెనుకేసుకు రావడం, అరెస్ట్ వారెంటుందా? ఉంటేనే లోపలికి రావాలని నిలదీయడం, చివరకు సుమంత్ అక్కడి నుండి తప్పించుకున్నాక, సీఎం సహా, అతడి సోదరులు, మంత్రులు, అందరి మీదా దుమ్మెత్తి పోయడం తప్పిదమే. అంతేగాక ఒకవేళ జరిగి ఉంటే, బహిర్గత పరచకూడని అంశాలను ప్రస్థావించాల్సింది కాదు.

5. ఇష్టానుసార వ్యాఖ్యలు: సుస్మిత సీఎం మీద, మంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ తల్లిదండ్రుల మీద కుట్రలు పన్నుతున్నారని, సుమంత్ ని అరెస్టు చేసి, తెల్లకాగితం మీద సంతకాలు చేయించుకుని, తమ తల్లిని మంత్రి పదవి నుంచి తప్పించి, తండ్రికి ప్రాణ హాని కలిగిస్తారనేదాకా ఆరోపణలు చేశారు. తెల్లారి ఆ మాటల మీదే నిలబడతానని చెప్పడం తప్పదమే. సుమంత్ తప్పే చేయకపోతే, కొండా కుటుంబం తప్పే లేకపోతే నిజాయితీగా అరెస్టుకు, విచారణకు సహకరించాలి. ఏ తప్పూ లేకపోతే ఇంత భయమెందుకు? అన్ని ఆరోపణలు ఎందుకు?

6. మంత్రిగా ఉండీ నిందితుడిని తమ ఇంట్లో పెట్టుకోవడం, పైగా పోలీసుల ముందే తన కారులోనే తప్పించడం మంత్రిగా సురేఖ చేయకూడనిది. మంత్రే నిందితుడిని తప్పించడం కచ్చితంగా నేరమే అవుతుంది. తన ఓఎస్డీ ఏ తప్పూ చేయకపోతే దాచి, తప్పించాల్సిన అవసరమేంటి? పైగా ఆమె మంత్రిగా తానే అతడిని పోలీసులకు అప్పగించి ఉంటే ఎంతో హూందాగా ఉండేది. నిజాయితీ దక్కేది.

7. మంత్రుల చుట్టూ తిరగడం: మంత్రి సురేఖ, ఆ అర్థ రాత్రే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ఇళ్ళళ్ళకు పోవడం. మంత్రి ఉత్తమ్ కి ఫోన్లు చేయడం. ఆ సమయాన ఆమె ఆశ్రయించాల్సింది తోటి మంత్రులను కాదు.

8. సీఎం ని పూర్తిగా విస్మరించడం: సీఎం విశ్వాసం ఉంటేనే ఎవరైనా మంత్రి అవుతారు. సీఎం మీద విశ్వాసం కోల్పేతే ఎవరైనా మంత్రిగా దిగిపోతారు. ఈ కనీస సూత్రాన్ని విస్మరించి, ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటి వరకు సీఎంని కనీసం సంప్రదించలేదు. ఫోన్ కూడా చేయలేదు. పైగా ఆమె కూతురు సీఎం మీద నిందారోపణలు చేశారు. రేవంత్ ని సీఎం చేసిందే మేమన్నట్లు వరంగల్ లో కొండా మురళి మాట్లాడారు.

9. సీఎం వరంగల్ పర్యటనకు దూరంగా ఉండటం: సీఎం వరంగల్ పర్యటనకు బుధవారం వచ్చారు. తనకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి చనిపోతే, స్వయంగా పరామర్శించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి కొండా సురేఖ దంపతులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక రకంగా బహిష్కరించారు.

10. డీసీసీ మీటింగ్ కి హాజరు కాకపోడం: ఇక గురువారం హన్మకొండ పార్టీ ఆఫీసులో జరిగిన వరంగల్ జిల్లా డీసీసీ సమావేశానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా కొండా సురేఖ హాజరు కాలేదు. అయితే, ఆమె భర్త కొండా మురళి మధ్యాహ్నమే వరంగల్ లోని ఓ హోటల్ లో వేరే సమావేశం నిర్వహించారు. పార్టీలో పోటీ మీటింగుకి పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ హాజరవడం విచిత్రమే.

11. కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడం: మంత్రిగా ఉన్న కొండా సురేఖ, అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి హైదరాబాద్ లో ఉండి హాజరు కాలేదు. కేబినెట్ మంత్రిగా కేబినెట్ కు హాజరు కావడం ఆమె విధి. బాధ్యత. కానీ, ప్రతి దానికి బీసీ కార్డును వాడుకునే మంత్రి సురేఖ, ముఖ్యంగా సుప్రీం తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పై జరిగిన కేబినెట్ భేటీకి ఎందుకు హాజరు కాలేదు? అంటే ఆమె నిత్యం వాడుకునే బీసీల కంటే, ఆమెకు నిందారోపణలతో ప్రభుత్వం చే గెంటివేయబడ్డ తన ఓఎస్డీయే ముఖ్యమన్న మాట?

12. తల్లీ, కూతురు, తండ్రి వేర్వేరుగా మాట్లాడటం: తల్లి సురేఖ, కూతురు సుస్మిత, తండ్రి మురళిలు వేర్వేరుగా మాట్లాడారు. తల్లి సీఎంని, మంత్రులపై నిందారోపణలు చేస్తే, కూతురుని సమర్ధిస్తూ సురేఖ మాట్లాడారు. అసలు ఇదంతా ఏమీ తెలియనట్లుగా, సీఎంని సమర్ధిస్తూ మురళి మాట్లాడారు. పైగా రేవంత్ ని సీఎం చేయడం కోసం తాము పని చేశామన్నారు. తమకు సీఎంతో విభేదాలు లేవన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏ ఒక్కరో అందునా, మంత్రి సురేఖ మాత్రమే మాట్లాడితే బాగుండేది.

ఇంకా…: రెండు నెలల క్రితమే సుమంత్ తల్లి సుగుణాదేవిని భద్రకాళి దేవాలయం ట్రస్టు బోర్డు మెంబర్ గా నియమించారు. ఈ నియామకాన్ని స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో ఇద్దరి మధ్యా వివాదం కొనసాగుతోంది.

ఒక వేళ ఓఎస్డీ తప్పు చేసినా(తప్పు చేసినట్లు సుస్మిత చెప్పారు. తెల్లారి ఆ మాటమీదే ఉంటామని కూడా ఉద్ఘాటించారు.) చేయకపోయినా, ఆయన్ని పోలీసులకు అప్పగించి, తర్వాత విచారణను కొనసాగే విధంగా ప్రవర్తించాల్సింది. పైగా ముగ్గురు మూడు తీర్లుగా మాట్లాడి సమస్యని జటిలం చేసుకున్నారు. కోరి కష్టాలు తెచ్చుకున్నారు. సమస్యలను వాళ్ళే సృష్టించుకుని, వాళ్ళే పరిష్కరించుకునే విధంగా వ్యవహరించారు. ఇక మంత్రిగా అందరినీ కలుపుకుపోవాల్సిన కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సహా నేతలందరినీ దూరం పెట్టారు. ఎవరూ తమ కష్ట కాలంలో తమ వద్దకు రాకుండా, ఎవరినీ సంప్రదించలేని పరిస్థితిని వారే తెచ్చకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధంగా ఒంటరి కావడం వారికే చెల్లింది. ఇంత జరుగుతున్నా, పార్టీలోపలా, బయటా ఎవరి మద్దతు కూడగట్టుకోలేకపోవడం కూడా విచారకరమే.

అమ్మా, నాన్న.. ఓ కూతురు!?
నోరు తెరిస్తే మాసే! అంతా స్మాషే!!

హైదరాబాద్, అక్టోబర్ 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కొండా మురళి కుటుంబానికి సరిగ్గా సరిపోయే ఈ ట్యాగ్ లైన్ ను టైటిల్ గా కూడా తీసుకోవచ్చు. కొండా మురళి రాజకీయ జీవితం 1987లో వంచనగిరి సర్పంచ్ గా సాదాసీదానే మొదలైంది. ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. ఒక మనిషి జీవితంలో ఉండకూడని, ఉండాల్సిన అన్ని పార్శ్వాలు ఆయనలో కనిపిస్తాయి. వాటన్నింటినీ దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి చేరారు. మురళి, సురేఖను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సురేఖ రాజకీయ జీవితం 1995లో వంచనగిరి ఎంపీటీసీగా, గీసుకొండ ఎంపీపీగా ప్రారంభమైంది. 1999లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. పలు పర్యాయాలు గెలుస్తూ వస్తూ, మంత్రి అయ్యారు. అనేక పదవులు నిర్వహించారు. వారికి సుస్మిత అనే కూతురు కూడా ఉంది. అయితే వారిది అత్యంత అన్యోన్య కుటుంబం. ప్రజాజీవితం కొండా మురళి కంటే సురేఖ కే ఎక్కువ కలిసొచ్చింది. ఆ ఆసక్తి సుస్మితకు ఉంది. ఆమెను పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పం ఉత్సాహ పరుస్తున్నది.

ఆ కుటుంబ రాజకీయ వ్యవహారమంతా మంత్రి సురేఖ ఫేస్ వ్యాల్యూతో నడుస్తుంటుంది. తెర వెనుక అంతా కొండా మురళే ఉంటారు. నిర్ణయాలు, అమలు, ఆచరణ అంతా ఆయనదే. ఈ మధ్యే కూతురు సుస్మిత కూడా రాజకీయ తెరమీదకు వచ్చారు. ఆమె కోసం పరకాలను సిద్ధం చేసుకుంటున్న తరునంలో ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో వివాదాలు వచ్చాయి. అయితే తండ్రి ధైర్యం, తల్లి పంతం కలబోసుకుని పుట్టిన సంతానం అవడం వల్ల సుస్మితలో తల్లీ తండ్రీ, వేర్వేరుగా, అప్పుడప్పుడు కలగలిసి కనిపిస్తుంటారు. వావాదాస్పదమైన ‘కొండా’ సినిమా విషయంలోనూ, ఆతర్వాత జరిగిన పరిణామాల్లోనూ ప్రత్యేకంగా ఆమె కనిపిస్తూనే ఉన్నారు.

కొండా సురేఖ మరోసారి మంత్రి అయ్యాక, తల్లిదండ్రుల వారసత్వాన్ని ఆమె తీసుకుందని ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉంటారు. బాగా విస్తరించిన కొండా సామ్రాజ్యాన్ని ఇప్పడు మొత్తం సుస్మితే నిర్వహిస్తున్నారని వినికిడి. వరంగల్ లో ఓ కొండా బినామీ ద్వారా ఒక సామ్రాజ్యం నడుస్తోందట. ఇక తన తల్లి మంత్రిత్వశాఖ మంత్రాంగమంతా కూడా సుస్మితే నడిపిస్తోందని అంటూంటారు. అందుకే పదవి రాగానే ఆమె తన క్లాస్ మేట్ నార్ల సుమంత్ ని పీసీబీ లో ఔట్ సోర్సింగ్ ద్వారా సెక్రటేరియట్ లోకి పంపించారట. ఆయన దందా ప్రస్తుతం వెలుగు చూస్తున్న పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టే వరకు వెళ్ళిందట.

అయితే వీరి వ్యవహరాశైలి చాలా వెరైటీగా ఉంటుందని ప్రజలు చెప్పుకుంటుంటారు. సమస్యలు వాళ్ళే సృష్టించుకొని, వాళ్ళే వాటిని పరిష్కరించుకుంటారని మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే చెప్పుకుంటుంటారట. ఒకసారి నమ్మితే వదలరు. నమ్మకపోయినా వదలరనే నానుడి తూర్పులో వినిపిస్తుంటుంది.

సుమంత్ టర్మినేషన్ విషయం ఎలా ఉన్నా, ఎలా జరిగినా, కారణాలేవి ఉన్నా, నిందితుడిని రక్షించే విషయంలో తమ మంత్రి పదవిని కూడా మరచి, వారు చూపిన పట్టుదల, తెగువ అందరినీ ఆశ్చర్య పరుస్తోందట. అర్థరాత్రైనా అల్లరి చేయడం, ఒక మంత్రి అయి ఉండీ, నింతిడిని తమ ఇంట్లోనే దాచి పెట్టడం, పోలీసులకు తెలిశాక, వారి ముందు నుంచే తప్పించడం, ఆ అర్థ రాత్రి మంత్రుల ఇళ్ళకు పోవడం కొండా సురేఖ తీసుకున్న చొవరగా కనిపిస్తుంది. ఇక సుస్మిత పోలీసులతోనే నేరుగా వాగ్వాదానికి దిగడం, ఇష్టానుసారంగా మాట్లాడటం చూసి అంతా ఔరా! అనుకుంటున్నారట. బహుషా ఆవేశంలోనో ఆందోళనలోనో కానీ, సుమంత్ మీద ప్రభుత్వం పెట్టిన అభియోగాలను ఆమె ముందుగా మీడియాకు వెల్లడి చేసేశారు. అవన్నీ సుమంత్ చేశాడు అయితే తప్పేంటి? ఆ గన్ ఘటనలో ఉన్నవాళ్ళు సీఎం సన్నిహితులని కూడా చెప్పేశారు. పైగా ఆ గన్ సీఎం దగ్గర నుంచి తమ దగ్గరకు వచ్చేసిందనేశారు. సుమంత్ బెదిరింపుల దందాను క్షణాల్లో సీఎంకు చుట్టేసేశారు. మాట ఎంత దూరం వెళుతుందోననే ఆచి తూచి మాట్లాటం వాళ్ళెరుగరట. నోరు తెరిస్తే… మాసే, అంతా స్మాషే!

ఒకవైపు ఇది జరుగుతుండగానే, మంత్రి సురేఖ తన వాహనంలోనే పోలీసుల ఎదుటే నిందితుడైన సుమంత్ ని తీసుకెళ్ళారంటే వాళ్ళెంత ధైర్యవంతులో తెలుసుకోవచ్చు. అంత అర్థరాత్రి అసరమా? తెల్లారే మాట్లాడొచ్చు కదా? అనకండి. మంత్రిగారు అదే రాత్రి డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ లను కలిసేందుకు వెళ్ళారట. అంతెందుకు ఉత్తమ్ కి ఫోన్ చేసి మరీ, సుమంత్ పై ఫిర్యాదు క్లారిటీ తీసుకున్నారట. భట్టీ, ఉత్తమ్ పొంతన లేని సమాధానాలను సరిపోల్చుకుని మరీ ఇదంతా ఫలానా కులం వాళ్ళ కుట్రగా డిసైడ్ చేసేశారట. అయితే వరంగల్ లో కాంగ్రెస్ డీసీసీ ఎన్నిక కోసం సెపరేట్ మీటింగ్ పెట్టిన కొండా మురళి ఇదంతా తనకేమీ తెలియదన్నారు. పైగా రేవంత్ తో విభేదాలు లేవంటూనే, ఆయన్ని సీఎంగా చూడాలనుకున్నదే తామని ముక్తాయించారు. ఇంకోవైపు కూతురిని తల్లి వెనుకేసుకొచ్చారు.

ఆ రాత్రి సంగతి పక్కన పెడితే, పొద్దున మరోసారి మీడియాతో మాట్లాడిన సుస్మిత రాత్రి మాట్లాడిన మాటలకు కట్టుబడే ఉన్నాననడం వారి నిజాయితీకి నిదర్శనంగా చూడొచ్చు. ఇదంతా ఇట్లుంటే అధిష్టానం మాట్లాడొద్దన్నది కాబట్టి, మీడియాతో మాట్లామని ఇంత జరిగాక ఆగిపోవడం కొసమెరుపు. అయితే ప్రైవేట్ గా ఎవరి జీవితం వారి వారి సొంతం. పబ్లిక్ గా వచ్చినప్పుడే… అన్నట్లుండాలి. కాని వాళ్ళకు తెలిసే మాట్లాడుతారో? లేదో చెప్పలేం. కానీ, ప్రజల్లో మాత్రం తీవ్ర రచ్చలతో చర్చనీయాంశంగా మారుతున్నారు.

ఎవరీ సుమంత్!?
నేర చరితలో ఫ్యామిలీ ప్యాక్!
కొండాను ఆశ్రయించి కోట్లకు పడగలు

హైదరాబాద్, అక్టోబర్ 16 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
టర్మినేట్ అయిన మంత్రి సురేఖ ఓఎస్డీ నార్ల సుమంత్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? కొండాను ఆశ్రయించి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తిన ఆయన ప్రయాణమేంటి? అన్నది ఆసక్తిగా మారింది.

-కొండా సురేఖ కూతురు సుస్మిత క్లాస్ మేట్
-ఈ కారణంగానే, మంత్రి వద్ద ఓఎస్డీగా చేరాడు
-సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం. విద్యుత్ శాఖలో ఉద్యోగి. అవినీతి కారణంగా ఉద్యోగం ఉస్టింగ్
-సుమంత్ సోదరుడు మహంత్ కూడా నిందితుడే. ఆస్ట్రేలియాలో మహంత్ భార్య అనుమానస్పద స్థితిలో చనిపోయింది. మహంత్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
-సుమంత్ భార్య మనీషా కూడా బాధితురాలే. సుమంత్ కున్న వివాహేతర సంబంధాల కారణంగా హైటెక్ సిటీలో తన ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
-సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం కొండా మురళి కలిసి ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు.
-సుమంత్ కు కొంపల్లిలో అల్ట్రా మోడర్న్ హౌస్, ఆడి కారు ఉన్నాయి.
-హనుమకొండ జిల్లా కడిపికొండలో మూడు విల్లాలు. ఒక్కోటి ఐదు కోట్ల విలువ చేస్తాయి.
-లండన్ లో కొండ సుస్మిత ఉండే ఏరియాలో సుమంత్ ఒక ఇల్లు కొన్నాడు.
-సుమంత్ సోదరుడు మహంత్ లండన్ కు షిఫ్ట్ అయ్యాడు.
-సుమంత్ తల్లి సుగుణ దేవి భద్రకాళి ఆలయ బోర్డు మెంబర్
-సుమంత్ ఓఎస్డీగా ఉండి కొండ సురేఖతో ఒప్పించి ఆలయ ధర్మకర్త పదవి తీసుకున్నారు
-తాజాగా గన్ తో బెదిరింపులు, వసూళ్ళ దందా బయట పడింది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News