క్షణ క్షణం…నిరీక్షణం!
BC|బీసీలకు ఆత్మగౌరవం…|SELF RESPECT
PARTY|పార్టీకి ప్రాణసంకటం…
GOVERNMENT|ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
గంటగంటకూ సమీక్షణం
సంఘాలకు సామాజిక న్యాయం
మంత్రులు, పార్టీ నేతలతో సీఎం సమావేశం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై నేడు విచా‘రణం’
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై దాఖలైన వాయిజ్యంపై నేడు హై కోర్టులో విచారణ జరగనుంది. ఈ తీర్పు ఎలా వస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది బీసీలకు ఆత్మగౌరవంగా, కాంగ్రెస్ పార్టీకి ప్రాణసంకటంగా. మారింది. ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా, బీసీ సంఘాలకు సామాజిక న్యాయ పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గంటగంటకూ ఈ విచారణపై సమీక్ష చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టులో ఇదే కేసును వాదించిన అభిషేక్ సింఘ్వీని ప్రత్యేకంగా హై కోర్టులో వాదించడానికి రప్పిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై నేడు విచా‘రణం’ జరుగుతున్న సందర్భంగా కోర్టుకు కూడా పరీక్షగా, సవాల్ గా నిలిచింది.
హైదరాబాద్, అక్టోబర్ 7(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షి స్తున్నారు. బుధవారం హైకోర్టులో కేసు విచారణకు రానున్న సందర్భంగా మంత్రులు, న్యాయనిపుణలుతో చర్చించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ విూనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం సామాజిక సమతుల్యతకు సంబంధించిన కీలకమైన అంశమని ప్రభుత్వం భావిస్తోంది. కేసు పురోగతిని గంట గంటకు పర్యవేక్షిస్తూ, న్యాయపరంగా ఏ మార్పులు వచ్చినా తక్షణమే వ్యూహాన్ని సవరించుకునేలా ప్రత్యేక టీమ్ను సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు. న్యాయ పోరాటంతో పాటు రాజకీయ, సామాజిక వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా ప్రతి దశలోనూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగిస్తోంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింగ్వి, సిద్దార్థ దవే లు హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి లతో కూడిన బృందం ఢల్లీి వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క, మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి తో ఫోన్ లో మాట్లాడారు. బుధవారం హైకోర్టులో జరగనున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఢల్లీిలో సింగ్విని కలసి ఇదే విషయమై విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైనదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించాలని వారు కోరారు. హైకోర్టులో జరగనున్న విచారణకు ముందు, కేసు పురోగతిపై సమగ్ర సవిూక్ష జరపాలని సీఎం నిర్ణయించారు.
““““
బీసీ రిజర్వేషన్లపై అటో ఇటో!?
నేడు హైకోర్టులో విచారణ ఎటో?
హైదరాబాద్, అక్టోబర్ 7 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై బుధవారం తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం విచారించనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతోందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీవోను సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా అన్న ప్రశ్నపై అందరి దృష్టి నిలిచింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం విచారణకు తీసుకోనుంది. ఇంతకుముందు ప్రత్యేక బెంచ్ పిటిషనర్లకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. నేటి విచారణలో హైకోర్టు నిర్ణయం ఏంటి? అనేది ప్రభుత్వం, రాజకీయ వర్గాలు, బీసీ సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

