బడే భాయ్ కి చోటా భాయ్ అలాయ్ బలాయ్?
కమలానికి దూరమంటూనే కేంద్రానికి దగ్గర!
52సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!
KALESHWARAM|కాళేశ్వరం విచారణను CBI|సీబీఐకి అప్పగింతలో ఔచిత్యం?
BRS|బీఆర్ఎస్ పార్టీని రేవంత్, NARENDRA MODI|మోదీ కాళ్ళ దగ్గర పడేశారా?
గతంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానం ఇదే!
ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకరిస్తున్నది కూడా అదే?
‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్’ ఇవి ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తాను చదివిన విద్యా సంస్థల పట్ల ఏ విద్యార్థికైనా సహజంగానే ‘అభిమానం’ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న చోట ‘కట్టుబాటు’ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా తాము చదివిన విద్యా సంస్థల పట్ల ‘కమిట్ మెంట్’ ను కొనసాగిస్తూనే, ఉద్యోగాలను ‘కట్టుబాటు’తో చేస్తూంటారు. ఇప్పుడు పై వ్యాఖ్యలు చేసిన, రాజకీయ విద్యార్థి రేవంత్ రెడ్డికి అన్వయించి చూడండి. సరిగ్గా ప్రస్తుతం రేవంత్ రాజకీయ శైలి ఇలాగే అ(క)నిపిస్తుంది కదూ!
తనకు ప్రాథమిక రాజకీయ విద్యనందించిన బీజేపీ పట్ల ఉండాల్సిన తీరులోనే ‘కన్సర్న్’గా ఊంటూ, ప్రస్తుతం ప్రభావితంగా కనిపించని టీడీపీని పట్టించుకోకుండా, తనకు సీఎం ఉద్యోగాన్నిచ్చిన కాంగ్రెస్ తో ‘కమిట్ మెంట్’గా పని చేస్తున్నారు.
అయితే, పెద్దగా తేడాలేని జీవితం, రాజకీయం, ‘రాజీ’కీయాల్లో కన్సర్న్, కమిట్ మెంట్ లతోపాటు సమయానుకూలంగా వ్యవహారించగలిగే ‘కామన్ సెన్స్’ కూడా ముఖ్యం. ఆ నేర్పరి తనం కూడా అవసరం. లౌక్యమన్నా, మరేమన్నా, సరిగ్గా సీఎం ప్రస్తుత రాజకీయాల్లో ‘లౌక్యం’గా వ్యవహరిస్తున్న ‘నేర్పరి’గా మారారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాల్లో రాష్ట్ర సీఎం కేసీఆర్-బీజేపీ ల మధ్య ‘అవగాహన’ ఉందా? బడే భాయ్, చోటే భాయ్ లు అలాయ్ బలాయ్ తీసుకుంటున్నారా? పరస్పరం సహకరించుకుంటున్నారా? అవును పక్కా ప్లాన్ ప్రకారమే రేవంత్, కాంగ్రెస్ లు కలిసి బీఆర్ఎస్ ను తొక్కి పడేస్తున్నాయని ఆ పార్టీ నేతలు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒక్కటేనని పదే పదే విమర్శిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ అనుబంధాన్ని మరో రకంగా విడమరిచారు. బీఆర్ఎస్ లోనే బీ ‘ఆర్ ఎస్ ఎస్’ ఉందంటున్నారు. రెండు పార్టీలు కాంగ్రెస్ పై దండయాత్ర చేశాయంటున్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి స్నేహపూర్వక పోటీనిస్తూ, పూర్తిగా తమ ఓట్లను బీజేపీకే వేయించిందని ఆరోపించారు. దీన్ని ఆయన కొన్ని లెక్కలతో తేల్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం -37.5. అదే 2024 పార్లమెంటు ఎన్నికల్లో -16.5 శాతానికి పడిపోయింది, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13% ఓట్లు రాగా, లోకసభ ఎన్నికల్లో 35.5 శాతానికి పెరిగింది, ఇదెలా సాధ్యమని రేవంత్ విశ్లేషిస్తున్నారు.
తర్వాతి పరిణామాల్లో గతంలో అధికారంలో ఉండగా, బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుగానే రేవంత్ కూడా బీజేపీతో వ్యవహరిస్తున్నారు. దక్షిణాదిలో అంతగా పట్టు లేని బీజేపీ, కేంద్రంలో ఉన్న అధికారంతో మొత్తం దేశంలోనే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నది. దీంతో ఒక రాష్ట్రానికే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి అవగాహనతోనే, కుశాగ్ర బుద్ధితో వ్యవహరిస్తున్నారా? తన పరిధి, పరిమితిలోనే తనకు ‘స్కూల్ ఎడ్యుకేషన్’ ప్రాథమిక విద్యనందించిన బీజేపీతో బాగుంటూనే, ఇటు పదవిని కాపాడుకుంటూనే, అటు అధిష్టానాన్ని మెప్పిస్తూనే, బీఆర్ఎస్ ను కట్టడి చేస్తున్నారా? ఇంకో రకంగా చెప్పాలంటే, ‘మహా’నుభవాలతో బీజేపీతో కూడా బాగానే ఉంటున్నారా? ఆయన వ్యవహారల శైలి మాత్రం ఇందకనుగుణంగానే కనిపిస్తున్నది. ఈ టర్మ్ పదవిని పదిలం చేసుకున్నట్లుగా ఆయన ఇటీవలి మాటలే చెబుతున్నాయి. కేజ్రీవాల్ లాగా వచ్చే, ఆ మల్లొచ్చే టర్మ్ కోసమే సీఎం పదవిపై రేవంత్ యమ ‘క్రేజీ వాలా’లా మారినట్లు కనిపిస్తున్నది.
అందుకే గతంలో అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల వ్యవహరించిన తీరులాగే, అందుకు కొంత భిన్నంగా, కాంగ్రెస్ అధిష్ఠాన అభీష్టానికి విభిన్నంగా, ఒప్పిస్తూ, మెప్పిస్తూనే ఇప్పుడు రేవంత్ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును కలిగిన ఉన్న కాంగ్రెస్ ను మూడో స్థానానికి పరిమితం చేస్తూ, బీజేపీ పుంజుకునే విధంగా చూశారు. ఆసఖ్యత రాష్ట్రంలో తమకు ఇబ్బందీ లేని, రాని ఎంపీ సీట్లల్లో బీజేపీని గెలిపించేదాకా, కొన్ని అసెంబ్లీ సీట్లకు సర్దుబాటు వరకు వెళ్ళింది. రాష్ట్రంలో కేంద్రంతో మాత్రం కేసీఆర్ ‘ఇగో’కు పోయారు. కేసీఆర్ కు మించిన ‘ఇగోయిస్టు’ అయినప్పటికీ, రేవంత్ ఇప్పుడు ఆ ‘ఇగో’ని పక్కన పెట్టేశారు. పైగా ఆయనే చెప్పుకున్నట్లు, తనకు ‘ప్రాథమిక’ రాజకీయానుభవం నేర్పింది బీజేపీ కావడంతో ‘సర్దుకు పోదాంలే’ అనుకోవడానికి రేవంత్ కు పెద్దగా ఇబ్బందీ కావడంలేదు.
ఇక రేవంత్, బీజేపీ సఖ్యతతో బీఆర్ఎస్ ని కట్టడి చేస్తున్నారు. బీజేపీకి కూడా బీఆర్ఎస్ ‘అణగి మణగి’ ఉండటమే కావాలి. అలాగని అవసరాన్ని బట్టి రేవంత్ రెడ్డీ, బీఆర్ఎస్ లు కూడా తమ చెప్పుచేతల్లోనే ఉండాలి. అందుకే కాంగ్రెస్ తో వైరమున్నా, రేవంత్ రెడ్డిని చేరదీస్తూనే, బీఆర్ఎస్ ను కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగింప చేయడం ద్వారా కేసీఆర్ నే తమ కాళ్ళ దగ్గర పడేటట్లు చేసుకుంది బీజేపీ. ఇది బీజేపీ రాజకీయ చాణక్యం.
కాళేశ్వరం అవినీతికి కేసును సీబీఐకి అప్పగించడం ఇందులో భాగమే. గతంలో లిక్కర్ కేసులో కవిత అరెస్టు వ్యవహారంలో, కవితను విడుదల చేస్తే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామనేదాకా వెళ్ళింది. అలాగే కాళేశ్వరం కేసులో కూడా ముందుగా సీబీఐ వంతు, తర్వాత ఈడీలు కల్పించుకుంటుంది. తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ, పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒకవేళ అరెస్టులు ఆగినా, జరిగినా, ఫలితం మాత్రం ఇలాగే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి బీజేపీతో ఇలా వ్యవహరించడం కాంగ్రెస్ అధిష్టానానికి, అధి నాయకత్వానికి ఇష్టమున్నా, లేకపోయినా చేసేదేమీ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే రెండు మూడు రాష్ట్రాల్లో. మొండిగా వ్యవమరించి ఇది కూడా ఊడితే? అంతే సంగతులు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఏం జరిగిందో గుర్తుందిగా! నేషనల్ హెరాల్డ్ వంటి రకరకాల కేసులతో ‘ఆర్థిక దిగ్బంధనం’లో గాంధీల కుటుంబం ఉంది. పైగా జాతీయ స్థాయిలో పార్టీని నడిపే చోదక శక్తి ఎక్కడి నుండి వస్తుంది?
సీఎం రే‘వంతు’ వరకొస్తే, ఇదంతా ఈ ‘టర్మ్’ రాజకీయం. మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి ఎత్తుగడలు ఉంటాయి. అప్పటి దాకా వేచి చూడటం, సమయానుకూలంగా నడుస్తూ పోవడమే రాజకీయ పార్టీల పని. ఇంకా అప్పటి దాకా తమ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు తమను వీడి పోకుండా, గ్రాఫ్ పడి పోకుండా ఉండటానికే ఈ రాజకీయ ఎత్తుగడలు తప్పితే. ఇందులో నువ్వా? నేనా? అనే రాజకీయం లేదు. పోటా పోటీ పోరాటం కూడా లేదు. జస్ట్ మైండ్ గేమ్ అంతే!

