-
మాట్లాడుకోవడాలు అసలే లేవ్!
-
నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదు!?
-
తాజా, మాజీ సీఎంలు పోటీపడి ప్రకటనలెందుకు?
-
మావోయిస్టులు నేతలను చంపినప్పుడు ఎక్కడున్నరు?
-
దమ్ముంటే మావోయిస్టులపై నిషేధం ఎత్తేయగలరా!?
-
నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూడటం తప్పు
-
మావోయిస్టులు పోలీసులను చంపినప్పుడు ఈ సంఘాలెందుకు స్పందించలేదు?
-
గిరిజనుల సాకుతో చర్చల ప్రస్థావన మంచిది కాదు
-
చర్చలు జరిపే ప్రసక్తే లేదు
-
వాళ్లు తుపాకీ వీడాల్సిందే
-
పోలీసులకు లొంగిపోవాల్సిందే
కేంద్ర ప్రభుత్వం ఇక మావోయిస్టులతో శాంతి చర్చలు జరపబోదని తేలిపోయింది. ఆరు నూరైనా, నూరు ఆరైనా ‘ఆపరేషన్ కగార్’ ఆగదని అర్థమైంది. వామ పక్ష తీవ్రవాదం సామాజిక సమస్య కానేకాదని, ఉగ్రవాదంతో సమానమైన తీవ్రవాదమేనని రాజ్యం తన సహజ ధోరణిలో పునరుద్ఘాటించింది. గిరిజనుల సాకుతో చర్చలను ప్రస్థావించవద్దని, మావోలు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని హెచ్చరించింది. తుపాకులు పట్టుకున్న వారితో చర్చలేంటని ప్రశ్నించింది. నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదని భవిష్యత్ దర్శనం చేసింది. కర్రె గుట్టల్లో ఎర్రని రక్తం, పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు పారడం అనివార్యమని, ఆగిపోవడం కల్ల అన్న వాస్తవం మరోసారి ఆవిష్కారమైంది. పాకిస్తాన్ తో యుద్ధం మొదలైనా సరే, మావోయిస్టులతో అంతర యుద్ధం కొనసాగుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంది.
హైదరాబాద్, మే 5 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘ఇక తూటాలే! మాటల్లేవ్! మాట్లాడుకోవడాలు లేనే లేవ్’ అని తేల్చేశారు ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి బండి సజయ్. ‘ఆపరేషన్ కగార్’ తీవ్రతలో చేపట్టిన ‘శాంతి చర్చల’ ప్రస్థావన, ‘సేవ్ కర్రె గుట్టలు’ లేదా ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ చేపట్టిన కొద్ది రోజుల్లోనే ‘క్లోజ్’ అయినట్లేనా? కనీసం ‘చూద్దాం. ఆలోచిద్దాం.’ అన్న ధోరణిలో కాకుండా, ‘చర్చల ప్రసక్తే లేద’ని కరాఖండిగా తేల్చేశారాయన. పైగా ‘నిషేధిత సంస్థతో చర్చలు జరిపే ప్రసక్తే రాదం’టూ చర్చల నిగ్గు తేల్చారు. పోటీపడి ప్రకటనలిస్తున్న తాజా, మాజీ సీఎంలను నిలదీస్తూ, ‘దమ్ముంటే మావోయిస్టులపై నిషేధం ఎత్తేయగలరా!?’ అంటూ ప్రశ్నించి, వారిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ‘సామాజిక సమస్యగా నక్సలిజాన్ని చూడకూడద’ని, అది ‘ముమ్మాటికీ శాంతి భద్రతల సమస్యే’నని చెప్పారు. గిరిజనులపై హింస కోణాన్ని సైతం ఎండగట్టారు. ‘చర్చలు జరిపే ప్రసక్తే లేదు. వాళ్లు తుపాకీ వీడాల్సిందే’నని హెచ్చరించారు. ‘పోలీసులకు లొంగి పోవాల్సిందే’నని సూచించారు. మొత్తానికి శాంతి చర్చల ఆలోచనేదీ కేంద్రానికి లేదని తేలిపోయింది. ఇక నరమేథమే మిగిలింది.
కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో అన్న మాటలు ఆయన వ్యక్తిగతమైనా సరే, కచ్చితంగా ప్రభుత్వ అభిప్రాయంగా తీసుకోవాల్సిందే. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో అత్యంత పెద్ద సమస్యగా పరిణమించిన అంతర్గత వామపక్ష తీవ్రవాదాన్ని సామరస్యంగా పరిష్కరించడం కాకుండా, కనీసం సామాజిక సమస్యగా చూసే సానుభూతి కూడా లేకపోగా, దాన్ని శాంతి భద్రతల సమస్యగానే చూడటం ప్రభుత్వాలకు అలవాటైంది. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య అని, అధికారంలోకి రాగానే శాంతిభద్రతల సమస్య అని చూడటం వల్ల వామపక్ష తీవ్రవాదంపై ఓ ద్రుక్పథమే లేకుండా పోతోంది. ‘ఆపరేషన్ కగార్’, ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ కొనసాగుతున్న నేపథ్యంలో, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
‘ఆపరేషన్ కగార విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చూసిన మావోయిస్టుల చేతుల్లో తుపాకులుంటాయి. అయినా దాన్ని సామాజిక కోణంలో చూస్తున్నమంటున్నరు. ఇదెక్కడి పద్ధతి? వాళ్లు మందుపాతరలు పెట్టి పోలీసులను చంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. ఇవేవీ పట్టించుకోకుండా, నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తమని సీఎం చెప్పడం, మంత్రులు ఖండించడం. ఇది మంచి పద్ధతి కాదు. మావోయిస్టులపై నిషేధం తొలగించే దమ్ము మీకుందా మరి? ప్రజలు తిరగబడ్తరు. గిరిజనుల పేరుతోని నక్సలిజాన్ని చూడడం కరెక్ట్ కాదు. గిరిజనులెవరూ తుపాకులు పట్టరు. మందుపాతరలు పేల్చరు. పోలీసులను చంపరు. నక్సల్స్ హింసపై సంఘాలెప్పుడూ మాట్లాడవు. ఇయ్యాల చర్చలు జరపాలంటే ఎట్లా? ఆయుధాలు ధరించి, నిషేధానికి గురైన సంస్థలతో ప్రభుత్వం ఏవిధంగా చర్చలు జరపాలె? సీఎం, మాజీ సీఎంలు పోటీపడి మావోయిస్టులను సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహాముత్తారం మండలంలో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తో చంపేసిండ్లు. ఆరోజు ఆ ఎస్ఐ భార్య సీమంతం. ఓ కానిస్టేబుల్ ని చంపేసిండ్లు ఆరోజే.. ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్ డే.. మరి ఆరోజు ఈ కేసీఆర్ ఏమైండు? రేవంత్ రెడ్డి ఏడ బోయిండు? కవరేజ్ కోసం వెళ్ళిన ఓ రిపోర్టర్ ని చంపేసిండ్లు. మరి ఆరోజు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? వరంగల్ లో సామా జగన్మోహన్ రెడ్డి అనే మా కార్యకర్తను చంపేసిండ్రు.. అప్పుడెండుకు మాట్లాడలేదు వీళ్లు? రామన్న, గోపన్నను చంపేసిండ్లు.. అప్పుడెందుకు మాట్లాడలేదు వీళ్లు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసిండ్లు. అజాత శత్రవు శ్రీపాదరావును చంపేస్తే, కేసీఆర్ టీడీపీలో ఉన్నపుడు టీడీపీ నాయకులను చంపేసిండ్రూ. అప్పుడెందుకు మాట్లాడలే? ఇయ్యాల పోటీబడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ బెట్టి ఇదే ములుగు ఫారెస్టులో చంపడాన్ని వీళ్లు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తే లేదు..వాళ్లు తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవలసిందే. నిషేధిత సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు.’ అని బండి సంజయ్ తేల్చేశారు.
అంతేకాదు. ‘వచ్చే మార్చి నెలాఖరులోగా నక్సల్స్ రహిత దేశంగా మార్చడం ఖాయమని’ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పదే పదే చెబుతూ వస్తున్నారు.
‘మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని బస్తర్ వాసులే కోరుకోవడంలేదు. చర్చలు జరపాలని కోరడానికి వీళ్ళెవరు?’ అంటూ తెలంగాణా వ్యాప్తంగా పెరుగుతున్న శాంతి చర్చల గళాలను ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మలు నిలదీశారు.
శాంతి చర్చల ఊసు ఊపందుకున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మసర్థిస్తే, ఆ ఇద్దరికీ సమర్థనగా చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మల వ్యాఖ్యలున్నాయి. ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడమేగాక, దాన్ని సమర్థించుకుంటున్నదన్నమాట. ఇక పాకిస్తాన్ తో యుద్ధం మొదలైనా సరే, మావోయిస్టులతో అంతర్యుద్ధం ఆగదన్న విషయం అవగతమైతే అందరికీ మంచిదన్న హెచ్చరికలు కూడా అందులో కనిపిస్తున్నాయి.

