బరువెక్కిన గుండెతో… ఎరుపెక్కిన కడవెండి!
ఉద్యమాల పురిటిగడ్డపై ఆడబిడ్డకు అంతిమ వీడ్కోలు!
విప్లవ పాటలతో నివాళులర్పించిన కళాకారులు!
కామ్రెడ్ రేణుకకు రెడ్ సెల్యూట్ చేసిన ప్రజా సంఘాలు!
జగద్గిదంతాలు దద్దరిల్లేలా జోహార్లు అర్పించిన జనాలు
దశ దిశలా వేలాదిగా తరలివచ్చిన అభిమానులు!
ఆఖరు సంస్కారాలలో కదంతొక్కిన మహిళలు!
‘‘నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా! విప్లవమా, వర్ధిల్లని వీధి వీధి నినదిస్తా! భగత్సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా? సఫ్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా? ఆగదు మన రగల్జెండ పోరాటం…’’ అన్న పాటను అక్షరాలా నిజం చేస్తున్నట్లు… బరువెక్కిన గుండెతో… ఎరుపెక్కిన కడవెండి, అనంత శోకంతో… రేణుక అంతిమయాత్రను నిర్వహించింది. ఒక షేక్ బందగీని, ఒక దొడ్డి కొమురయ్యని, నల్ల నరసింహులుని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని, పైళ్ళ వెంకటరమణ, పెద్ది యాదగిరిలను తలచుకుంటూ, మీ ప్రాణ త్యాగం వ్రుథా పోదని నినదిస్తూ, ప్రజా సంఘాలు కామ్రెడ్ రేణుకకు రెడ్ సెల్యూట్ చేశాయి. పోరుబాటలో నేలకొరిగిన రేణుక త్యాగాలను స్మరిస్తూ కళాకారులు విప్లవ పాటలతో నివాళులర్పించారు. పేగు బంధం కాదు. ఏ బంధమూ లేదు. కులం కాదు. ఇలం కాదు పలం కాదు. ఇలాతలాన్ని కలిపేస్తూ తరలి వచ్చిన జనాలు, జగద్గిదంతాలు దద్దరిల్లేలా జోహార్లు అర్పించారు. కుటుంబ సభ్యులు కాలం చేస్తేనే దిక్కూ దెశా లేని ఈ కాలంలో… దశ దిశలా వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. సాటి మహిళ అన్న సానుభూతితో కాదు. సెల్యూట్ చేసి తీరాల్సిన వ్యక్తిత్వమన్న, త్యాగాల పోరాట తత్వమన్న తపనతో రేణుక ఆఖరు సంస్కారాలలో మహిళలు పదం పాడారు. కదంతొక్కారు. ఒక్క గొంతుక మూయిస్తే వేయి గొంతుకలై వచ్చినట్లుగానే, వేలాదిగా ప్రజలు వేల వేల గొంతులెత్తి కడవెండిలో జరిగిన రేణుక అంతిమయాత్రలో పాల్గొని విప్లవోద్యమాలపై తమ సహానుభూతిని చాటుకున్నారు.
ఉద్యమాల పురిటి గడ్డలో పురుడు పోసుకున్న గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ దమయంతి, అలియాస్ చైతే అలియాస్ మిడ్కో హతమైన ఘటన విప్లవోద్యమకారులనే కాదు, విప్లవాభిమానులను, కడవెండి ప్రజలను హతాషులను చేసింది. ఆమెను కన్న తల్లిదండ్రులు గుమ్మడవెల్లి సోమయ్య, జయమ్మలే కాదు వారి ఊరు కడవెండి సైతం మూగబోయింది. శోకతప్త హృదయాలు బరువెక్కాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గుమ్మడివెల్లి సోమయ్య, జయమ్మల రెండో సంతానంగా పుట్టిన రేణుక విప్లవోద్యమ అజ్ఞాతవాసంలో ఉంటూ, మార్చి 31న పవిత్ర రంజాన్ రోజున చత్తీస్ ఘడ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ లోని దంతెవాడ – బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో అశువులు బాశారు. ఈ ఘటన అనంతరం రేణుక శవాన్ని ఏప్రిల్ 1వ తేదీ అర్థరాత్రి దాటాక ఆమె మృత దేహాన్ని కడవెండికి తెచ్చారు. అప్పటిదాకా ఎదురు చూస్తున్న ఆ గ్రామం ఒక్కసారిగా బోరుమన్నది. ఆ రాత్రి మెలుకవతో ఉన్న గ్రామ ప్రజలంతా ఆమె శవాన్ని దర్శించి కంటతడి పెట్టుకున్నారు. ఆమెతో ఆ గ్రామానికి, తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. రేణుక శవాన్ని కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం పక్కనే గల ఆమె పురాతన ఇంటి ముందు ఉంచారు. ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఊసెండి అలియాస్ జీవీకే ప్రసాద్ అలియాస్ సుఖదేవ్, మరో సోదరుడు గుండెలవిసేలా దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. అక్కడే తెల్లార్లూ గ్రామమంతా మెలుకవతోనే ఆ శవం వద్దే ఉండిపోయారు. అదే చోట ప్రజల సందర్శనార్థం ఉంచిన రేణుక పార్థీవ దేహ సందర్శనార్థం 2వ తేదీ తెల్లవారుజాము నుంచే జనం తాకిడి మొదలైంది. దారులన్నీ కడవెండికే మళ్ళాయి. పోలీసు నిఘా, నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా, వేలాదిగా ప్రజలు తండోపతండాలుగా తరలి కడవెండికి చేరుకున్నారు. దశ దిశలా వేలాదిగా తరలివచ్చిన అభిమానులు రేణుక శవానికి పూలు చల్లి నివాళులర్పించారు.

విప్లవ పాటలతో నివాళులర్పించిన కళాకారులు!
మరోవైపు వివిధ కళాకారులు పాటలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. రేణుక శవం వద్దే డప్పు కొడుతూ, రేణుక త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడారు. ఆమె త్యాగం వృథా పోదంటూ నినదించారు. విప్లవోద్యమాల్లో ప్రాణార్పణలు చేసిన వారందిరినీ గుర్తు చేస్తూ పాడిన పాటలు ప్రజలను కంటతడి పెట్టించాయి.

కామ్రెడ్ రేణుకకు రెడ్ సెల్యూట్ చేసిన ప్రజా సంఘాలు!
విప్లవ రచయితల సంఘం సహా, బంధుమిత్రుల సంఘం, వివిధ కమ్యూనిస్టు పార్టీలు, పలు ప్రజా సంఘాలు రేణుక అంతిమ యాత్రకు హాజరయ్యాయి. ఆయా సంఘాల ప్రతినిధులు కామ్రెడ్ రేణుకకు రెడ్ సెల్యూట్ చేశాయి. ఆమె సేవలను కొనియాడాయి. ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలపై ప్రభుత్వాల దమనకాండను నిరసిస్తూ పలువురు ప్రజా సంఘాల నాయకులు ఉపన్యాసాలిచ్చారు. ఇక సామాన్య ప్రజలు సైతం జగద్గిదంతాలు దద్దరిల్లేలా జోహార్లు అర్పించారు. ఆఖరు సంస్కారాలలో అనేక మంది మహిళలు కదం తొక్కారు. ఏ అనుబంధం, పేగు బంధం లేని అనేక మంది రేణుక అంతిమ యాత్రలో పాల్గొని ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు.

కాగా, రేణుక అంతిమయాత్ర కడవెండిలోని ఆమె ఇంటి నుండి బయలు దేరి, గ్రామ వీధుల గుండా, అంతిమ సంస్కారాలు నిర్వహించిన వాగు వరకు సాగింది. మహత్తర పోరాట నేపథ్యం కలిగిన రేణుక అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కడవెండి దొడ్డి గుమ్మడి స్తూపం నుంచి మొదలుకొని ఊరు నలుమూలలో ఉన్న అమరుల స్మారక స్మృతులు గుర్తు చేసుకునేలా నాలుగు గంటల పాటు ఆట పాటలతో కన్నీటి వీడ్కోలు మధ్య కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగా ఆమె అంత్యక్రియలు ముగిసాయి. దారి పొడవునా వేలాదిగా ప్రజలతో కడవెండి ఎరుపెక్కింది. ఈ అంతిమ యాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది సందర్శకులతో గ్రామం నిండిపోగా, కడవెండి గ్రామస్థులు తమ ఇళ్ళపైకి ఎక్కి రేణుక అంతిమ యాత్రను వీక్షించారు.
రేణుక విప్లవోద్యమ ప్రస్థానం
షేక్ బందగీ, దొడ్డి కొమరయ్య నల్లా నరసింహులు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిల ఉద్యమాల, విప్లవోద్యమాల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సమ సమాజ స్థాపన కోసం గుమ్మడవెల్లి రేణుక పోరుబాట పట్టారు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మరెవ్వరికీ రాకూడదన్న సంకల్పంతోనే ఆమె లా చదివారు. అందులో గోల్డ్ మెడల్ సాధించారు. అనేక గ్రంథాలు చదివి, సాహిత్యాభిమానిగా మారి, రచయిత్రిగా, కవయిత్రిగా అనేక రచనలు చేశారు. ఇదే సమయంలో 1996లో పీపుల్స్ వార్ లో చేరారు. అప్పటి వార్ రాష్ట్ర కార్యదర్శి, కడవెండికే చెందిన ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డితో వివాహమైంది. 1999 డిసెంబర్ లో కొయ్యూరు ఎన్ కౌంటర్ లో ఆయన హతమయ్యారు. 2005లో వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావుని వివాహం చేసుకుంది. 2010లో నల్ల మలలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన కూడా చనిపోయారు. తర్వాత రేణుక పలు విభాగాల్లో పని చేసింది. మావోయిస్టుల తరపున పత్రికా ప్రకటనలు విడుదల చేయడంతో పాటు, పలు పార్టీ పత్రికలకు ఎడిటర్ గా పని చేసింది. మావోయిస్టుల్లో కీలకంగా పని చేసిన జీవీకే ప్రసాద్ అలియాస్ సుఖదేవ్ అలియాస్ ఉసెండి రేణుక సోదరుడు, ఈయన 2014లో లొంగిపోయాడు. కాగా, మారిన నిర్బంధ కాండను ఎదుర్కొనే క్రమంలో చత్తీస్గఢ్, ఒడిస్సా ప్రాంతాల్లో మహిళల చైతన్యం కోసం రెండు దశాబ్దాలపాటు రేణుక సాగించిన సాహిత్య ఉద్యమం చిరస్థాయిగా నిలుస్తుంది.
బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురు?
రేణుక అంత్యక్రియలు ప్రారంభం అయ్యే సమయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృత దేహం వద్దకు చేరుకున్నారు. మృత దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వారిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని నినదించారు. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, మీరు కూడా ఇలాంటి బూటకపు ఎన్ కౌంటర్లే చేశారని, విప్లవోద్యమాలను పాశవికంగా అణిచివేశారని ప్రశ్నించారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ కు కూడా ఈ పాపంలో పాత్ర ఉన్నట్లేనని అన్నారు. ప్రస్తుతం బీజేపీ మోడీ సర్కార్ చేసే ‘ఆపరేషన్ కగార్’ పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీంతో తాము ‘ఆపరేషన్ కగార్’ కు వ్యతిరేకమని చెప్పారు. అయితే ఈ విషయాన్ని మీ పార్టీ నేతలు కెసిఆర్, కేటిఆర్ లు ప్రకటించాలని, లేదంటే మీరు బీజేపీకి మద్దతును ఉప సంహరించుకోవాలని గొడవకు దిగారు. దీంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
అంతిమయాత్రలో పాల్గొన్న ప్రముఖులు
ఈ అంతిమయాత్రలో నివాళులర్పించి పాల్గొన్న అమరవీరుల బందు మిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మ కుమారి, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, శాంతక్క, విప్లవ రచయితల సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు పాణి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు రవి చందర్, బి రమాదేవి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, ఉస్మానియా విద్యార్థి నాయకులు పృథ్వి, స్టాలిన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు సుదర్శన్, ఇప్ప రాంరెడ్డి, మా భూమి సంధ్య, వేముల పుష్ప, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పల్స నిర్మల, ప్రజా కళామండలి నుండి రాజ నర్సింహ, జర్నలిస్టు నాయకులు ఎంవీ రమణ, స్నేహలత, వనజ, మలుపు బాల్ రెడ్డి, గద్దర్ కొడుకు సూర్యం, వరవరరావు కూతుర్లు అనల, సహజ, పవన, కటకం సతీష్, సింగరేణి కార్మిక సంఘం నాయకుడు హుస్సేన్, తెలంగాణ యూత్ ఫెడరేషన్ నాయకుడు పనికెర మోహన్ రాజు, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ ఉద్యమకారుడు సిఎల్ యాదగిరి, బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు వీరస్వామి రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ సభ్యులు లక్ష్మణ్ గౌడ్ కాదే ఇన్నయ్య, కోడం కుమారస్వామి, వెన్నెల గద్దర్, సూర్యం గద్దర్, సురేష్ మహాజన్, సురేష్ దొంతి, రాజేష్, జనగామ జిల్లా కార్యదర్శి ఎం డి కాసిం, సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య సిపిఐ మాజీ ఎమ్మెల్యే జనగామ మాజీ ఎమ్మె తదితరులు పాల్గొన్నారు.

హిందూయిజం పేరుతో బీజేపీ రాజ్యహింస
ప్రశ్నించే గొంతులపై పాశవిక దాడులు
ప్రతిపక్షాలు స్పందించాలి
-రేణుక అంతిమయాత్రలో ప్రజా సంఘాలు డిమాండ్
బిజెపి ప్రభుత్వం రాజ్యహింసను కొనసాగిస్తున్నది. హిందూయిజం పేరుతో మానవత్వ ద్రుక్పథంలేని, అమానవీయ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. మనుషుల మధ్య మంటలు పెడుతున్నది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలపై ఎలాంటి వాస్తవిక అధ్యయనం చేయకుండా నిరంకుశంగా, పాశవికంగా అణచివేతకు, ఉద్యమ కారుల అంతానికి పంతంతో పని చేస్తున్నది. చత్తీస్ ఘడ్ దండకారణ్యంలోని సహజ, ఖనిజ వనరుల దోపిడీ కోసం ఆదివాసీ బిడ్డలను అతి కిరాతకంగా బూటకపు ఎన్ కౌంటర్లలో చంపేస్తున్నది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాల్వాజుడుం మీద దాడులు చేస్తే, బీజేపీ ఆపరేషన్ కగార్ పేరిట మానవ హననాన్ని, నక్సల్స్ ఏరివేత పేరుతో నరహంతకంగా నర మేధాన్ని కొనసాగిస్తున్నది.
ఇంత జరుగుతున్నప్పటికీ మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందించడం లేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలు మిగలవు.
గన్ డౌన్ కు మేం సిద్ధం!?
-శాంతి చర్చలపై మావోయిస్టుల సంచలన లేఖ!
గత కొద్దిరోజులుగా కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. కూబింగ్ పేరుతో మొత్తం ఐదు రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో జల్లెడ పడుతూ వారిపై విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగ్గా.. వందల మంది మావోయిస్టులు అశువులు బాశారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చల పై మావోయిస్టులు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. అయితే, ఆ లేఖలో శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఛత్తీస గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతోన్న హత్యాకాండను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించాలని పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం, ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్లకే పరిమితం చేయాలని కోరారు. సాయుధ బలగాల కొత్త క్యాంపులు ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు వేలాది మందిని అరెస్టులు చేసి అక్రమ కేసులు మోపి జైలు పాలు చేస్తున్నాయని లేఖలో అభయ్ ప్రస్తావించారు.

