World Mental Health Day: 10 October 2025
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: 10 అక్టోబర్ 2025
విపత్తులు సంభవించినప్పుడు ప్రభావిత సమూహాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. మూడింట ఒక వంతు బాధిత ప్రజలు తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉన్నది. 2020లో 10 కోట్ల ప్రజ విపత్తుల మూలంగా మానసిక రుగ్మతలకు గురైనట్లు తెలుస్తోంది. నేడు 6 కోట్ల 70 లక్షల మంది విపత్తు, సంక్షోభం, విస్థాపన పరిస్థితులలో మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు అంచనా. భౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్య అవసరాలూ అంతకంటే ముఖ్యం. అంటూ…
హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం ఎడిటోరియల్
ప్రతి ఏటా అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జరుపుకొంటున్నాము. అందరికీ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించటానికి, మనోవ్యాధులు ఉన్నవారు, వారి కుటుంబాలు, సమాజాల పట్ల వివక్షను తొలగించటానికి ఇది ఒక సందర్భం. ఈ దినోత్సవం కోసం ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూ ఎఫ్ ఎం ఎచ్) ఏటా ఒక నినాదాన్ని ఎంపిక చేస్తుంది. మారుతున్న సంక్షోభాల కాలంలో మానసిక ఆరోగ్య అవసరాలూ మారుతున్నాయి. 2025 సంవత్సరానికి “యాక్సెస్ టు సర్వీసెస్ – మెంటల్ హెల్త్ ఇన్ కటాస్ట్రోఫ్స్ అండ్ ఎమర్జెన్సీస్” అనే థీమ్ ను ఎంపిక చేసింది.
విపత్తులు సంభవించినప్పుడు ప్రభావిత సమూహాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. సుమారు మూడింట ఒక వంతు బాధిత ప్రజలు తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉన్నది. 2020 లో సుమారు 10 కోట్ల ప్రజ విపత్తుల మూలంగా మానసిక రుగ్మతలకు గురైనట్లు తెలుస్తోంది. నేడు 6 కోట్ల 70 లక్షల మంది విపత్తు, సంక్షోభం, విస్థాపన పరిస్థితులలో మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు అంచనా.
కొన్ని విపత్తులు ప్రకృతి ప్రకోపాలు అయితే, మరికొన్ని మానవ జనితాలు. కొన్నింటిని ముందే పసికట్ట వచ్చు. కొన్ని మన చేతిలో లేక పోవచ్చు. నివారణ మన చేతిలో లేక పోయినా, సంసిద్ధత, ప్రణాళిక, సమన్వయంతో కూడిన నష్ట నివారణ చర్యలు, సహాయక చర్యలు బాధితులను కుదుట పడేలా చేస్తాయి. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలలో 2024 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సభ్యదేశాలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఒక మైలురాయి. ఈ తీర్మానం మెంటల్ హెల్త్ అండ్ సైకో సోషియల్ సపోర్ట్ (ఎం ఎచ్ పి ఎస్ ఎస్) ను విపత్తు, ఆత్యయిక సేవల సంసిద్ధత, స్పందన, పునస్థాపనలో అంతర్భాగం చేసింది. ఎం ఎచ్ పి ఎస్ ఎస్ అనేది ఘటన జరిగిన తరువాత చేపట్టే పని కాదు. ఆత్యయిక పరిస్థితిలో ఆదుకొనే అన్ని చర్యలలో కలిసి చేసేది ఇది. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలన్నీ ఈ విషయంలో సమష్టిగా కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 సంవత్సరంలో 21 లక్షల అవసరార్థులకు మానసిక రుగ్మతలకు పనిచేసే ఔషధాలను అందచేసింది. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ చోట్లలోని 40 ఆత్యయిక పరిస్థితులలో ఇతర సంస్థల సమన్వయంతో ఎం ఎచ్ పి ఎస్ ఎస్ సేవలు అందిస్తున్నది. ఆస్తి నష్టాలను పూడ్చవచ్చు. శారీరక గాయాలు కొంత కాలానికి మానవచ్చు. మానసిక గాయాల ప్రభావం జీవిత కాలం ఉండవచ్చు.
భారతదేశం విపత్తు నిర్వహణ కోసం వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేసింది. మానసిక సమస్యల పరిష్కారం కోసం 2022 లో టెలి మానస్ అనే 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 14416 ను అందుబాటు లోనికి తెచ్చింది. విపత్తు నిర్వహణలో భాగం అయ్యేందుకు గత ఏడాది బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నింహాన్స్) లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైకో సోషియల్ సపోర్ట్ ను ప్రారంభించింది. ఈ డిపార్ట్మెంట్ ప్రత్యక్ష భాగస్వామ్యంతో పాటు, మానసిక ఆరోగ్య నిపుణులు, సంఘ సేవకులు, అధికారులకు శిక్షణ ఇస్తున్నది. భౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్య అవసరాలూ అంతే ముఖ్యం.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211
(వ్యాసకర్త హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)

