ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం ఒక చారిత్రక అవసరం కాగా, ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకుల నిర్ణయాలు భిన్నంగా ఉండటం వల్ల, అవి ప్రజాభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత ఐదేళ్ల పరిపాలనలో రాజధాని చుట్టూ జరిగిన పరిణామాలు రాజకీయ దిశ, నాయకత్వ స్థిరత్వం, ప్రజల నమ్మకం వంటి అంశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
పాలకులకు రాజధానిపై స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అప్పటివరకు అమలులో ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి నమూనాను పూర్తిగా మారుస్తూ, “మూడు రాజధానుల” సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. విశాఖపట్నం (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ నిర్ణయం అధికార, పరిపాలన వికేంద్రీకరణను ప్రస్థావించినప్పటికీ, అమలు విధానం, ఆర్థిక వెసులుబాటు, చట్టపరమైన సవాళ్లపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయి.
అమరావతి రైతుల సమస్యలు సవాల్ గా మారాయి. 29వేల మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో, వారి ఆశలు, ఆకాంక్షలు, పరిహారాలు, అంచనాలు అమలు కాలేదనే భావన బలపడింది. ఆ ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి గణనీయమైన పురోగతి కనిపించకపోవడం, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోవడం వంటివి ప్రభుత్వంపై విమర్శలకు దారితీశాయి. రైతులు నిరసనలకు దిగడం, దీర్ఘకాలిక ఆందోళనలు కొనసాగడం ఈ అసంతృప్తిని మరింత బలపరిచాయి.
విధానాలలో స్థిరత్వం లేకపోవడం కూడా ఒక ప్రధాన విమర్శగా మారింది. మొదట మూడు రాజధానులు అన్న ప్రభుత్వం, తర్వాత వివిధ సందర్భాల్లో విభిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) వంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ముందుకు తేవడం ద్వారా రాజకీయ సందిగ్ధత మరింత పెరిగింది. ఒక రాష్ట్రానికి రాజధాని అనే అంశం దీర్ఘకాలిక ప్రణాళిక, భారీ పెట్టుబడులు, చట్టబద్ధత వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో తరచూ మారే ప్రకటనలు పాలనలో అనిశ్చితిని ప్రతిబింబిస్తాయి.
ఆర్థిక నిర్వహణపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర అప్పులు ఐదేళ్లలో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా ఖర్చు చేయడం ఒకవైపు ఉంటే, మూలధన వ్యయాలు తగ్గడం, మరోవైపు ఆర్థిక సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. దీని ప్రభావం మౌలిక వసతుల అభివృద్ధిపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిపాలన కేంద్రీకరణ, నిర్ణయాలలో పారదర్శకత లోపం కూడా చర్చకు వచ్చింది. కీలక నిర్ణయాలు కనీస, విస్తృత చర్చ లేకుండా తీసుకోవడం, పైగా ఈ విమర్శలను సహించకపోవడం వంటి ఆరోపణలు ప్రతిపక్షం తరఫున తరచూ వినిపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉండాలి అనే సూత్రం నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
అయితే, గత ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, విశాఖపట్నంలాంటి నగరాలను పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక అవకాశాలను పెంచవచ్చని వాదించింది. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చామని కూడా పేర్కొంది. ఈ వాదనలపై కొన్ని వర్గాల్లో మద్దతు లభించినప్పటికీ, మిగతా వర్గాలు వ్యతిరేకించాయి.
రాజధాని కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక కేంద్రంగా చూడాలి. దీని కోసం దీర్ఘకాలిక దృష్టి, విధానాలలో స్థిరత్వం, చట్టబద్ధత, ప్రజల నమ్మకం అవసరం. తరచూ మారే నిర్ణయాలు, అస్పష్ట ప్రకటనలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయి.
అందువల్ల, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమగ్ర అభివృద్ధి దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, పారదర్శకంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా సాధ్యమైన మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే స్థిరమైన పరిష్కారానికి దారితీస్తుంది.

