పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై, యుద్ధాలకు నిలయాలై, మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నాయి. ప్రపంచ శాంతికే పెను సవాల్ గా నిలిచిన యుద్ధ పిపాసి అమెరికాను, లేదా ట్రంప్ను నిలువరించగల శక్తి లేదా?! ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?
పశ్చిమాసియాలో పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ గాజా, గల్ఫ్ దేశాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరస్పర దాడులు, ప్రతిదాడులు యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇరాన్పై అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కు దీటుగా భారీ సైనిక సమీకరణకు దిగుతున్నది. బసిజ్ దళాలు, రివల్యూషనరీ గార్డ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే 10 లక్షలాది మంది యోధులను రంగంలోకి దింపగలమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య మరో కీలక అంశం చమురు రవాణా మార్గాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి సహా ఇతర అన్ని మార్గాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్ వంటి వ్యూహాత్మక మార్గం ప్రాధాన్యం అపారమైనది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాన్ని అనుసంధానించే ఈ మార్గం గుండా రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10%–12% చమురు సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. ఏటా లక్షల కోట్ల రూపాయల విలువైన సరుకు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా రవాణా తీవ్రంగా దెబ్బతినడం ఖాయం.
ఇప్పటికే యెమెన్లోని హూతీ దళాలు, ఇరాన్ మద్దతుతో, దాడులు చేపడుతున్నాయి. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రధాన నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ దూరం పెరగడం, ఖర్చులు అధికమవడం, చివరకు వినియోగదారులపై ధరల భారం పడటం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఈ నేపథ్యంలో మరింత తీవ్రంగా కనిపిస్తోంది.
అయితే, ఈ సంక్షోభానికి మూలం కేవలం ప్రాంతీయ ఘర్షణలు మాత్రమే కాదు. ప్రపంచ శక్తి సామ్యంలో వస్తోన్న మార్పులు కూడా కీలకం. చైనా, ఇండియా వంటి దేశాలు ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ, అమెరికా సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని నేరుగా సవాలు చేసే స్థితిలో లేవు. అంతర్జాతీయ వేదికలపై ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు, పెద్ద దేశాల నిర్ణయాలను పూర్తిగా అడ్డుకునే స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా విధానాలు, ట్రంప్ నిర్ణయాలు మరింత పెట్రేగిపోతున్నాయి. సుంకాల పెంపు, మిత్ర దేశాలపైనా ఒత్తిడి, సైనిక ఉనికిని విస్తరించడం అమెరికా దుందుడుకు దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఈ దూకుడు ప్రపంచానికి ఎంతవరకు మేలు చేస్తుంది? లేక మరింత అస్థిరతకు దారి తీస్తుందా?
ఇక ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. సైనిక లోటు, నిరంతర యుద్ధ పరిస్థితులు ఆ దేశ రక్షణ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అదే సమయంలో గాజా సంక్షోభం అంతర్జాతీయ విమర్శలకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది.
అయితే, మూడో ప్రపంచ యుద్ధం ముప్పు తలుపుతడుతోందా? చరిత్ర చెబుతున్నదాన్ని బట్టి, పెద్ద దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి వెనుకంజ వేస్తాయి. అణ్వాయుధాల భయం, ఆర్థిక నష్టం వంటి భయాలు, ముందుచూపు వాటిని నియంత్రిస్తాయి. అందుకే ప్రత్యక్ష యుద్ధం కంటే ప్రాక్సీ యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ట్రంప్ను లేదా అమెరికాను నిలువరించేది ఒక వ్యవస్థో, ఒకే దేశమో కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, పరస్పర ఆర్థిక అవసరాలు, ఆధారాలు ఒక అనివార్యతను సృష్టిస్తాయి. అదే ప్రపంచాన్ని పూర్తిస్థాయి యుద్ధం నుంచి దూరంగా ఉంచ గలిగే ప్రధాన అంశం కావచ్చు.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దౌత్య చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే చిన్న ఘర్షణలే మహా వినాశనాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

