హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాద్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్ట్ వేర్, ఫార్మా, విద్య, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో కూడా భాగ్యనగరంగా ప్రఖ్యాతి గాంచింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్ సాగర్ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాద్ కు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మధ్యలో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్ర మట్టం నుండి 541 మీ. -1776 అడుగుల- ఎత్తులో ఉంది. నగర వైశాల్యం 260 చ.కి.మీ. అంటే 00 చ.మైళ్ళు. జన సాంద్రత చ.కి.మీ. కి 10,477గా ఉంది. రాష్ట్ర జనాభాలో 4వ వంతు జనాభా ఇక్కడే ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా, ప్రస్తుతం కోటి దాటిన జనాభా, 2031 నాటికి అది 1 కోటి 84 లక్షలకు పెరుగుతుందనే అంచనా.
హెచ్ఎండిఎ 2031 కి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను అదిగమించి 2050పై దృష్టి సారించింది, ఇది వికేంద్రీకృత పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. హెచ్ఎండిఎ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిగి ఉంది. కొత్త మాస్టర్ ప్లాన్ కింద, హైదరాబాద్లో రూ.17,212 కోట్ల వ్యయంతో 7,034 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి నెట్వర్క్ను నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్లో R1, R2 వంటి వివిధ జోన్లు ఉన్నాయి,
ఈ మాస్టర్ ప్లాన్ లు ఎలా ఉన్నప్పటికీ, అమలవడానికి మరికొంత సమయం కూడా పట్టవచ్చు. కానీ, ప్రస్తుతం చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్లు వరదలను తలపిస్తున్నాయి. మురుగునీటి కాలువలు జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద రద్దీ నరకానికి నకలుగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందీగా మారుతోంది. వర్షం వస్తే నరకం కనిపిస్తోంది. తక్షణ సమస్యలపై కూడా ద్రుష్టి సారిచాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ విస్తరిస్తున్నా అందుకు తగ్గట్లుగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు వింటి కనీస మౌలిక వసతులు అందుబాటులో లేవు. రోడ్ల మీద పడిన వర్షపు నీరు నిరాటంకంగా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వేలకోట్ల ఆదాయం వస్తున్నా నగరం అభివృద్ది విషయంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదు. హుస్సేన్ సాగర్ను కొబ్బరినీళ్లలా తయారు చేస్తానని ప్రగల్భాలు పలికిన వాళ్ళు పత్తా లేకుండా పోయారు.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. హైదరాబాద్ సమగ్రాభివృద్దికి ప్రణాళికలు అమలు కావాలి. ప్రధానంగా మురుగునీరు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ట్రాఫిక్ సమస్యలు ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపై వెలసిన ఆలయాలు, దర్గాలు, ఇతర కట్టడాల తొలగేంచేయాలి. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి. హైడ్రా పనితీరు బాగుంది. ప్రజలను కూడా ఇందులో బాధ్యులను, భాగస్వాములను చేయాలి. శివారు ప్రాంతాలు విస్తరించి, నగరంలో కలిసి పోవడంతో, సిటీ ప్లానింగ్, పట్టణీకరణ భవిష్యత్ ఆధారంగా చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ.ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం జరగాలి. ఎయిర్ పోర్ట్ వరకూ, పాత నగరానికి మెట్రో విస్తరణ సాకారం కావాలి. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ వంటివన్నీ కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసేవే.
ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు అందించాలి. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున, జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాల పరిరక్షించడం, అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో ప్రధాన భూమికను పోషించనుంది. విపత్తుల నిర్వహణలోనూ అది కీలకం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి కలిగించాలి. ప్రధాన రహదారుల పక్కన ఫుట్పాత్లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించాలి. వరద నిర్వహణకు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేయాలి. నిర్దిష్టమైన బృహత్ లక్ష్యాలతో సాగితేనే హైదరాబాద్ మంచి నగరంగా రాణించగలదు. పైగా హైదరాబాద్ కి ప్రపంచంలోనే అత్యంత సెఫ్టీ నగరంగా పేరుంది. అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉన్న ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అందుకుతగ్గ చిత్తశుద్ధి పాలకులకు ఉండాలి. అప్పుడే తన పూర్వ పేరుకు తగ్గట్లుగా భాగ్యనరం అవుతుంది. అందరికీ సౌభాగాన్ని అందిస్తుంది.

