ఏదో ఒక ఎజెండాని ఫిక్స్ చేసి, ఆ ఎజెండా చుట్టూనే రాజకీయాలను నడిపి, ఆ ఎజెండాపైనే ఎన్నికలకు వెళ్ళడం రాజకీయ పార్టీలకు, నాయకులకు పరిపాటిగా మారింది. ఒకప్పుడు దేశభక్తి, జాతీయోద్యమం, ప్రత్యేక ప్రాంతీయ, రాష్ట్రోద్యమాలు, ప్రజల సెంటిమెంట్లు, ప్రధాన సమస్యలు, సందర్భోచిత సమస్యలు, ఎమర్జెన్సీ, ఈ మధ్య సరిహద్దులు, దాడులు, యుద్ధాలు ఇలా ఓట్లు రాలేదేదైనా సరే, రాజకీయ పార్టీలకు అనుకూలాంశమే. తాజాగా బీసీల రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రతిపక్షాల కంటే పై చేయి సాధించినట్లుగా కనిపిస్తున్నది. బీసీల ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఒక ఆయుధంగా మలచుకునే ప్రయత్నం చేస్తుండగానే, అనూహ్యంగా కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానించి, ఆర్డినెన్స్ తెచ్చైనా అమలు చేయడానికి కేబినెట్ ఆమోదించింది. అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండీ ఆ ఊసే ఎత్తని ఆ పార్టీ ఆ నినాదాన్ని ఎత్తుకోగానే కాంగ్రెస్ వేసిన ఎత్తుగడకు బీఆర్ఎస్ సహా బీజేపీ సైతం చిత్తయ్యాయి. మొత్తంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పేటెంట్ను కాంగ్రెస్ దక్కించుకుంది. బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా అడుగులు వేస్తోంది. విపక్షాలకు సవాళ్లు విసురుతోంది. అయితే స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల అమలు అంత సులువు కాకపోవచ్చు. బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రం సహకరించకపోయినా, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలకపోయినా, బీజేపీ బద్నాం అవడం ఖాయం. పైగా బీసీలకు వ్యతిరకమనే అపప్రదను మోయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ఒకటి రెండు సామాజిక వర్గాల పార్టీగా పడిన ముద్ర నుండి బయట పడలేకపోతోంది. ఆల్రెడీ పాలుపోక బీఆర్ఎస్ గోల్ గోల్ అవుతున్నది. మరోవైపు సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలులో వేగం పెంచింది. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తోంది. సన్నబియ్యం, రైతు భరోసా పూర్తి చేసింది. ఈ వరసలోనే కేబినెట్ నిర్ణయంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది.
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర కాగా, పరిషత్ల గడువు ముగిసి ఏడాది పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చేస్తున్నారు. స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటం తో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశానుసారం నిర్ణీత గడువులోగానే ఎన్నికలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తిరుమలగిరి సభలో సీఎం ప్రకటించారు. పంచాయతీలకంటే ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారన్నద తేలిపోయిది. ఇప్పటికే ఈఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి, ప్రింటింగ్, అధికారులకు శిక్షణ, నియామకం వంటివన్నీ పూర్తి చేసి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఇసి ఉంది.
ఇక బీసీ రిజర్వేషన్ల అమలులో తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని సీఎం సవాల్ విసిరారు. రిజర్వేషన్ల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చామన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తామని, అలాంటి వాళ్లని సామాజిక బహిష్కరణ చేయాలని బీసీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ రిజర్వేషన్లపై కాంగ్రెస్తోపాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని, అన్ని రాష్ట్రాల్లూ ఈ రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లే ఎజెండాగా 2029 ఎన్నికలు జరుగుతాయని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణననుసరించి దేశంలో బీజేపీ జనగణనతోపాటే, కుట గణనను చేపట్టింది. ఇదే దేశవ్యాప్తంగా అమలయ్యేలా కాంగ్రెస్ స్కెచ్ వేసిందన్నది సుస్పష్టం. అదే జరిగితే దేశానికి తెలంగాణ ఆదర్శమన్న మాట అక్షర సత్యం కానున్నట్లే.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కులగణన, రిజర్వేషన్లు లేవని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని మిగతా భారాన్ని బీజేపీ పైకి నెట్టశారు. కేంద్రంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్యలు ఒత్తిడి పెంచి ఈ రిజర్వేషన్లను సాధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ స్థానంలో రాహుల్ గాంధీ ఉండి ఉంటే, 48 గంటల్లోనే తాను రిజర్వేషన్ల ను సాధించే వాళ్ళమని ప్రజలకు ఓ హింటిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని పంచాయతీరాజ్ చట్టం చేసిందని కూడా ఆపార్టీని టార్గెట్ చేశారు. కవిత ఆనాడు ఎందుకు ఉద్యమించలేదని నిలదీస్తున్నారు. ఆ చట్ట సవరణ చేస్తున్నామని చెప్పారు. వందేళ్ళ బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందంటున్నారు. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని, కులగణనపై ఎన్నో అవాంతరాలను అధిగమించామని, ఏడాది లో పూర్తి పారదర్శకంగా, పక్కాగా కులగణన పూర్తి చేశామని ప్రకటించారు. ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని, అసెంబ్లీ సహా, అన్ని వర్గాలతో చర్చించి, అందరి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పడం ద్వారా ఈ రిజర్వేషన్లకు అందరి ఆమోదం ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. వివరించారు. స్వయంగా ప్రజలే ప్రకటించిన డేటాను 100 శాతం డిజిటలైజేషన్ చేసి, భవిష్యత్తులో ఎవరూ చాలెంజ్ చేయడానికి వీలు లేకుండా డేటాను భద్రపరిచారు. దేశంలోనే తెలంగాణ కులగణన ఒక బెస్ట్ మోడల్గా తీర్చిదిద్దారు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మరి బీఆర్ఎస్, బీజేపీల ఎత్తుగడలేంటి? కాంగ్రెస్ ను ఎలా ఢీ కొంటారన్నది చూడాలి.
…..

