మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ప్రజలే పాలకులు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి తరపున పరిపాలకులు. మన పాలకులు మనకు జవాబుదారులు. మరి ఆచరణలో ఇది జరుగుతుందా? మనం తరచూ వినే.. పాలనలో పారదర్శకత, ప్రజల పట్ల నిబద్ధత, పథకాల అమలులో నిజాయితీ, అవినీతి రహిత అభివృద్ధి, అకౌంటబిలిటీ వంటివి ప్రభుత్వాల్లో ఉంటున్నాయా? అసలు మన పాలకులు ప్రజల పట్ల నిజాయితీగానే ఉంటున్నారా? మన పాలకులకు తరతరాలకు తరగని ఆస్తులు పెరిగి, ప్రభుత్వాలు ఎందుకు అప్పుల్లో కూరుకుపోతున్నాయి? ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకు ఎవరు బాధ్యులు? ఎవరు బాధితులు? చిన్న చిన్న తప్పులకో, పొరపాట్లలో ఏళ్ళతరబడి జైలు జీవితాలు అనుభవిస్తున్న వారికి, వీరికి ఏంటి తేడా? కోట్లు కొల్లగొట్టి, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన వారు చేసే ఆర్థిక నేరాలకు శిక్షలుండవా? ఎంతో సామాజిక బాధ్యతతో నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి, వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతూ, ప్రభుత్వాలను లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసి, ప్రజల నెత్తిన ఆ భారాన్ని మోపుతున్న పాలకులకు శిక్షలు ఎందుకు ఉండటం లేదు? ప్రజాతీర్పునకు మించింది లేకపోయినా, మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవుల్లోకి వస్తూపోతూ ఉంటే ప్రజల సంగతేం కావాలి?
2025, మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 5, 62, 557 కోట్లు కాగా, తెలంగాణపై రూ.4, 42, 298 కోట్ల భారం ఉందని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ప్రకటించింది. ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 34.7 శాతంగా ఉండగా.. తెలంగాణ అప్పులో జీఎస్డీపీ 26. 2శాతంగా నమోదు అయింది. రాష్ట్రాల వారీగా తమిళనాడు అప్పు రూ.9,55,691 కోట్లతో ఆగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరస స్థానాల్లో రూ. 8, 57, 844 కోట్లతో ఉత్తరప్రదేశ్, రూ.8,12, 068 కోట్లతో మహారాష్ట్ర, రూ.7, 25, 456 కోట్లతో కర్ణాటక, రూ.7,14,196 కోట్లతో పశ్చిమబెంగాల్ ఉన్నాయి. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 2025, మార్చి 31వ తేదీ నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అప్పు రూ. 2, 67, 35, 462 కోట్లుగా ఉంటుందని కేంద్రం వివరించింది. అయితే మన దేశంలో యూపీఏ హయాంలో అప్పులు రూ. 60 లక్షల కోట్లు. ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వంలో అదనంగా చేసిన రూ.100 లక్షల కోట్ల అప్పుతో కలిపితే, ప్రస్తుతం రూ.160 లక్షల కోట్లుకు చేరుకుంది. ఏపీ, తెలంగాణాల్లో గత ప్రభుత్వాలపై ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతున్న లెక్క వేరుగా ఉంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 14.70 లక్షల కోట్లు అప్పు చేయగా, తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపిస్తున్నాయి.
ఇక పాత రుణాలపై వడ్డీ చెల్లింపులు 23శాతం పెరిగితే, పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడానికయ్యే ఖర్చు 35శాతం, రాష్ట్రాలకు పెన్షన్ చెల్లింపుల వ్యయం 23శాతం చొప్పున పెరిగాయి. కొవిడ్ వచ్చినా రాకున్నా రుణాలపై వడ్డీ చెల్లింపుల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడవడం ఎలా? అప్పులు తేవడం అనుత్పాదక రంగాల్లో ఖర్చు చేయడం, ఆ అప్పులపై వడ్డీ కట్టడానికి మరిన్ని అప్పులు చేయడం… ఇలా అప్పులు చేస్తూ పోతే, తర్వాత ముంచుకొచ్చే ఉపద్రవాలకు బాధ్యత ఎవరు వహిస్తారు?
గత, ప్రస్తుత పాలకుల వైఫల్యాలు, ధోరణుల కారణంగానే రాష్ట్రాలు, దేశం అప్పులకుప్పగా మారుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వరకు తీసుకుంటే, విభజన వల్ల జరిగిందేంటి? ఒకటి రెండు కుటుంబాలు బాగు పడ్డాయి తప్పితే రాష్ట్రాలు, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయాయి. అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన గత సీఎంలు కేసీఆర్, జగన్ లిద్దరూ రాష్టాల్రను దివాళా తీయించారు. పైగా అప్పులు చేశాం, ఆస్తులు పెంచామని దబాయిస్తున్నారు. వారు పెంచిన ఆస్తులేవీ? భూములను తనఖా పెట్టి కట్టిన భవనాలా? అక్కరకు రాని ప్రాజెక్టులా? ఈ వైపరీత్యాలకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఓ కారణం. రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతుంటే చోద్యం చూస్తోందా? మనది సమాఖ్య పద్ధతిలోని ప్రజాస్వామ్యం. రాష్ట్రాలు వేరైనా, దేశం ఒక్కటే కదా? రాష్ట్రాలు కలిస్తేనే దేశం కదా? దేశంలోని ప్రభుత్వం రాష్ట్రాల అప్పులపై కూడా నిర్ణీత ఆంక్షలు పెట్టవచ్చు కదా? పైగా స్వయంగా అప్పులు చేస్తూ, అప్పులు చేయకుండా రాష్ట్రాలను కట్టడి చేయడంలోనూ పూర్తిగా విఫలం అయ్యారు.
ఇలా పాలకులు ఇష్టానుసారం అప్పులు చేసే పద్ధతిని ఆపేయాలి. జీతాలు సకాలంలో ఇవ్వలేక, అభివృద్ధి పనులు చేపట్టలేక, ఉన్నది ఉచితంగా దోచిపెడుతూ తామేదో ఘనకార్యం చేస్తున్నామని గొప్పలు చెప్పే వాళ్ళ తప్పులకు శిక్షలు పడాలి. ఇకముందు రాజకీయ పార్టీలు, నేతలు ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించకుండా కట్టడి చేయాలి. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు ఇకనుంచి పోవాలి. దుబారాను, దుబారా పథకాలను సమీక్షించాలి. ఇవ్వాళ పాలకులు చేసే తప్పిదాలు, అప్పులకు ప్రజలు కూడా బాధ్యులే, రేపటి బాధితులు కూడా. అందుకే సరైన పాలకులను ఎన్నుకోవాలి. సరైన పాలనను పొందాలి. తప్పు చేసే ప్రతి వారిని నిలదీయాలి. శిక్షించాలి.

