పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్ని కలవర పెడుతున్నాయి. ఒకవైపు పరిశ్రమలకు అపార నష్టం జరుగుతోంది. ఆ నష్టాలను బీమాతో పరిశ్రమలు పూడ్చుకోగలుగుతున్నాయి. కానీ, కార్మికుల మరణాలు అత్యంత దయనీయంగా ఉంటున్నాయి. కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అసలు అనేక ప్రమాదాలు వెలుగు చూడటమే తక్కువ. ప్రమాదాలు సంభవించినప్పుడు పరిశ్రమల యాజమాన్యాలు, కార్మిక సంఘాలు కలిసి లోలోన సెటిల్ మెంట్లు చేసేస్తుంటాయి. ఏదో కొద్దిపాటి పరిహారం కార్మికుల కుటుంబాలకు ఇస్తే చాలు. ఆ కార్మిక కుటుంబాలు తమ నష్టాన్ని ఖర్మకు వదిలేసి, తిరిగి అవే పరిశ్రమల్లో పని చేస్తూ, ఏవేవో పాట్లు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణలకు సంబంధించిన ప్రభుత్వ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, వాటిని పరిశ్రమలు పాటిస్తున్నాయా? పాటించే విధంగా చేయడమెలా? అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది? ప్రమాదాలు సంభవించినప్పుడే నానా హంగామా చేసేసి, కేసుల మీద మరో నాలుగు కేసులు పెట్టేసి, చేతులు తడుపుకుని, ఆతర్వాత చేతులు ముడుచుకు, చేష్టలుడిగి కూర్చోవడం వల్లే పరిశ్రమల్లో కార్మిక భద్రత, పని గంటలు, పని భద్రత వంటివన్నీ గాలికి పోతున్నాయి. పరిశ్రమలు లాభాలే తప్ప, కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవడం ఏనాడో మానేశాయి.
పాశమైలారం కార్మికుల పట్ల యమపాశమైంది. ఇవ్వాళ ఒక్క పాశమైలారంలోనే కాదు. దేశమంతా ఇదే దుస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు, అధికారులు, సమస్య సద్దుమణిగాక పట్టించుకోవడం లేదు. సధారణంగా పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో ఎంతమంది మరణించారో కూడా లెక్కలు తెలియని అయోమయం ఉంది. భారీ పరిశ్రమలలో రెగ్యులర్గా సేప్టీ ఆడిట్ అనేది జరగడం లేదు. పని పరిస్థితులను మెరుగుపరచే చర్యలు లేవు. పారిశ్రామిక వాడల్లో వంద పడకల బర్న్స్ వార్డులతో కూడిన హాస్పిటల్స్ ఉండాలి. అవి ఎక్కడా లేవు. ప్రతి నెలా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి.
తెలంగాణ చరిత్రలో అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదంగా సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండిస్ట్రీస్ లిమిటెడ్ దుర్ఘటన నిలిచిపోయింది. ఇప్పటికి 40 కి పైగా మంది కార్మికులు మరణించగా, మరో 37 మంది తీవ్రంగా గాయపడినట్టు గుర్తించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న 147 మందిలో మిగిలిన వారి కోసం రెండు రోజులుగా గాలింపు కొనసాగుతూనే ఉంది. కొందరి గుర్తింపు భారంగా మారింది. డిఎన్ఎ టెస్టులు కూడా కష్టంగానే మారాయి. బూడిదకుప్పల నుంచి డిఎన్ఎ టెస్టు చేయడం సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వాల, అధికారుల, పరిశ్రమ యాజమాన్యాల నిర్లక్ష్య నిర్వాక ఫలితమే హైదరాబాద్ శివారు ఔషధ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనం. హైదరాబాద్ శివారులోని పరిశ్రమల్లోనే గత రెండు మూడు నెలల్లో నాలుగైదు ప్రమాదాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. విశాఖలో 2020 నాటి ఎల్జి పాలిమర్స్ ప్రమాదం 12 మంది కార్మికులను బలిగొంటే, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ విషతుల్యంగా మార్చి, వందలమందిని హాస్పిటల్స్ పాలు చేసింది. ఆ తరువాత అచ్యుతాపురం సెజ్లో 2022 జూన్, ఆగస్టులో 500 మందికిపైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రమాదంపై నివేదిక అమలు మాట అటుంచి వెలుగు చూసిన పాపానే పోలేదు. గత ఏడాది అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మాలోనే 17 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే అనకాపల్లి జిల్లాలో జరిగిన 11 ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా, ఎనిమిదిమంది తీవ్ర గాయాలతో మంచంపట్టారు. పరవాడ ఫార్మాసిటీలో గత ఏడాది విషవాయువుల లీకేజీ సహా పలు ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి ప్రాణాంతక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలవకుండా, లాభం కోసం భద్రతను గాలికొదిలేసి ప్రాణాలను బలిగొంటున్న పరిశ్రమల అధిపతుల పక్షాన కేంద్ర, రాష్ట్ర పాలకులు నిలవడం మరింత విషాదం.
దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రమాదాల్లో రోజూ కనీసం ముగ్గురు కార్మికులు మరణిస్తున్నారు. తనిఖీలను తగ్గించి, స్వీయ ధ్రువీకరణలను అనుమతించడం ద్వారా భద్రతాపరమైన నియంత్రణలను బలహీనపరచడమే భారీ ప్రమాదాలకు కారణమన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరికలను ఇప్పటికైనా గుర్తించి, కఠిన చర్యలకు ఉపక్రమించాలి.
ఇక పారిశ్రామిక యాజమాన్యాలు అత్యాశతో రసాయన, ఔషధ పరిశ్రమలు సహా వివిధ పరిశ్రమల్లో అత్యంత కీలకమైన స్థానాల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేసే తగిన నైపుణ్యం, విద్యార్హత లేని వారిని, ఇతర రాష్టాల్ర వారిని కాంట్రాక్ట్, డైలీవేజ్ ప్రాతిపదికన నియమిస్తున్నాయి. కాలం చెల్లిన రియాక్టర్లు, యంత్రాలను వినియోగించడం తోపాటు వాటికి దగ్గరగా వెల్డింగ్, షోల్డరింగ్ చేయడం, యంత్రాలు, వాల్వులపై పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందికి భద్రతాపరమైన పరికరాలు, తగిన శిక్షణ ఇవ్వకపోవడం, భద్రతా తనిఖీలు జరగకపోవడం పలు రసాయనాలను దగ్గరగా నిల్వచేయడం తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలు నివేదికలు ఘోషిస్తు న్నాయి. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి, తమకు జరిగిన అన్యాయాన్ని, యాజమాన్యాల దుర్మార్గాన్ని ప్రశ్నించలేని స్థితికి కార్మికులను నెట్టేసిన తీరు పాలకుల నిరంకుశ విధానాలకు నిదర్శనం. కార్పొరేట్లకు కొమ్ముకాయడం మాని, సేప్టీ వర్క్ లాంటి కార్మిక అనుకూల నినాదాలను తీసుకోవడం తక్షణ అవసరం. కార్మికుల సంక్షేమం ద్వారానే సంస్థలు బలపడాలి తప్ప, కార్మికులను పొట్టన పెట్టుకుని ముందుకు సాగాలన్న విధానాలకు పాతరేయాలి. ముందుగా తెలంగాణ, ఎపిల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఎమర్జెన్సీ సేఫ్టీ ఆడిటింగ్ చేపట్టాలి. ఆయా పరిశ్రమల్లో నాణ్యతాపరమైన, భద్రతాపరమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్నది విశ్లేషించాలి. అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలం.
……

