దేశ చరిత్రలో EMERGENCY| ఎమర్జెన్సీని చీకటి రోజులుగా అభివర్ణిస్తారు. దేశానికి అంతర్గతంగా, బహిర్గతంగా ముప్పు ఉందని, వాటి నుంచి GOVERNMENT| ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ఆనాడు అత్యవసర పరిస్థితిని విధించారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చి 1977 మార్చి 21న ముగిసింది. ఈ ఉత్తర్వు PRIME MINISTER| ప్రధానమంత్రికి డిక్రీ ద్వారా పాలించే అధికారాన్ని ఇచ్చింది. ELECTIONS| ఎన్నికలు రద్దు చేయడానికి, పౌర స్వేచ్ఛలను నిలిపివేయడానికి వీలు కల్పించింది. ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులలో లక్ష మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైలులో పెట్టారు. పత్రికలను సెన్సార్ చేశారు. నాటి పరిస్థితులను నేటికీ గుర్తు చేసుకుంటున్నాం. కానీ, ఆనాడు ఆ చీకటి రోజులను కేవలం 21 నెలలపాటు అనుభవించారు. కానీ, నేటి ప్రభుత్వాల పాలన ఆసాంతం ఎమర్జెన్సీని మరిపిస్తున్నది. అప్రకటిత ఎమర్జెన్సీని మనమంతా నిత్యం అనుభవిస్తున్నాం. చట్ట సభల్లో బుల్డోజింగ్, సమస్యలపై చర్చ ఉండదు. ప్రభుత్వాల నిర్ణయాలే ఫైనల్. భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగంలో భద్రంగా ఉంటుంది. కానీ, ఏ భావాలను ప్రకటించే స్వేచ్ఛ ప్రజలకు ఉండదు. రాజ్యమే రక్త పిపాసిలా ఇష్టానుసారంగా కరాళ కర్కష నిరంకుశాన్ని నడిపిస్తుంది. తుపాకీ రాజ్యం నడుస్తోంది. విచిత్రంగా విమర్శలను తట్టుకునే స్థితిలో పాలకులు లేరు. విపక్షాలు కూడా ప్రజలను విస్మరించి, పవరే పరమావధిగా పనిచేస్తున్నాయి. ధరలు తగ్గించాలని అడగవద్దు, ఉద్యోగాలు కావాలని రోడ్డెక్కవద్దు. చదువులు కావాలని కోరుకోవద్దు. మంచి ఆరోగ్యం కావాలని డిమాండ్ చేయవద్దు. జీఎస్టీ తగ్గించాలని ఎలుగెత్తకూడదు. వారి దయా దాక్షిణ్యాల మేరకు బతకాల్సిన దుస్థితిలో భారత ప్రజాస్వామ్యం నడుస్తుండటం అత్యంత విషాదం.
ఎమర్జెన్సీని సమర్ధించడం కాదు కానీ, నిందిస్తూ మనం సాధించిన ప్రగతి ఏంటి? పేరుకే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడే, బతికే పరిస్థితే లేదు. ప్రభుత్వాలను విమర్శించే అవకాశం కాదుకదా వేదిక కూడా లేకుండా పోయింది. పత్రికలు ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు బాకాలుగా మారాయి. ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో ఇందిరను మించి పోయారు. కేవలం తన పదవిని కాపాడు కునేందుకు ఇందిర ఎమర్జెన్సీ అస్త్రాన్ని ఉపయోగించింది. అయితే ఆనాడు మనమంతా గుర్తించని మరోకోణం కూడా ఉంది. ఎమర్జెన్సీ లో ఢిల్లీ నుండి గల్లీ దాకా వ్యవస్థలన్నీ పక్కాగా నడిచాయి. ఉద్యోగులు సక్రమంగా పనిచేశారు. లంచం పుచ్చుకోవాలంటే వణికిపోయారు. కల్తీల బెడద తొలగింది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటీర్ల భరతం పట్టారు. వేళకు బస్సులు, ట్రైన్లు నడిచాయి. ఈరోజు అలాంటి పరిస్థితి ఎందకు లేదు?
నిజంగానే ఇందిర తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. జయప్రకాశ్ నారాయణ్ జనతా పార్టీకి ప్రాణం పోశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టారు. మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ప్రధాని పదవికి పోటీపడిన వారంతా జనతాపార్టీని విచ్చిన్నం చేశారు. తరవాత ఎన్టీఆర్ హయాంలోనూ ఇలాగే జరిగింది. మనదేశంలో ప్రజాస్వామ్యం వల్ల రాజకీయ నేతలు బాగుపడ్డారే తప్ప ప్రజలు బాగుపడలేదని 78 స్వాతంత్య్రం చరిత్ర తేటతెల్లం చేస్తోంది. కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు బాగుపడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ నాయకులను గెలిపించి, ప్రజలు ఓడిపోతున్నారు. వారసత్వ రాజకీయాలు, మళ్లీ మళ్లీ తామే గెలవాలన్న కుటిల వ్యూహాలు, పథకాలు, ప్రయత్నాలు దేశ పురోగతికి కాకుండా, అధోగతికి దారితీస్తున్నాయి. దేశాన్ని మొఘలులు, ఖల్జీలు, నిజాంలు, బ్రిటీషర్లు దోచుకున్నారు. స్వాతంత్రం తర్వాత దోపిడీ కొత్త రూపంలో ప్రవేశించింది. నాడు రాజులు మాత్రమే అయతే, నేడు కొన్ని కుటుంబాలు రాజ్యమేలుతున్నాయి.
నేటి దేశ పాలకులు ప్రజలకు విద్య, వైద్యం వంటి కనీస వసతులు కల్పించడం లేదు. పైగా ప్రైవేట్ పరం చేసి, కాంట్రాక్టర్ల కాళ్ళ మీద సాగిలపాడుతున్నారు. ఉచిత పథకాలతో సోమరులను చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా, ఇంకా ఉచిత పథకాలనే అమలు చేస్తున్నారంటే దేశం పురోగమించినట్లా, తిరోగమించినట్లా? పాలకులు ప్రజలకు బొచ్చె చేతికిచ్చి బిచ్చగాళ్ళను చేస్తున్నారు. ప్రజలు చైతన్యం కావడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ప్రజలు ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ నేతలు రాజ్యమేలు తున్నారు. యాభై సంవత్సరాల క్రితం మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కదిలించిన అత్యయిక స్థితి నేటి తరానికి చరిత్ర. దీని గురించి తెలుసుకోవాల్సిందే. నేడు జరుగుతున్న పాలనా తీరును కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆనాడు జనతా పార్టీ విజయం అత్యయిక స్థితికి ముగింపు పలికింది. ప్రజాస్వామ్య విలువలు గెలిచాయి.
ఆ చీకటి కాలం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను, గుణపాఠాలు, అనుభవాల నేపథ్యోం భారతదేశ ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ఇక ఇది మన రాజకీయ నాయకుల వల్ల కాదని తేలి పోయింది. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటానికి, పౌర స్వేచ్ఛను రక్షించడానికి, అధికార సమతౌల్యం ఉండేలా పటిష్ఠమైన వ్యవస్థ మనగలగడానికి ప్రజలు గట్టిగా నిలబడాలి. అప్పుడే మనమంతా స్వేచ్ఛగా బతకగలం. పాలకులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయగలరు. ఎమర్జీన్సీని వ్యతిరేకిస్తూనే, రాజకీయ నేతల అప్రకటిత ఎమెర్జెన్సీ కార్యక్రమాలను నిదీయాలి. అప్పుడే దేశానికి మంచిరోజులు వస్తాయి.

