ఒక సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘మొకాళ్ళు బాగా వాచి ఉన్నాయి ఎందుకు?’ అంటే ‘వాడు బాగా ఆలోచిస్తుంటాడు.’ అని వెటకారమాడుతాడు. అంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా తీసిపారేయడం కాదు కానీ, ఇంకా బ్రిటీష్ కాలం నాటి వలస సామ్రాజ్యవాద మెకాలే విద్యా విధానమే అమలవుతుండటం సిగ్గుచేటు కాక మరేమిటి? దేశ, రాష్ట్రాల బడ్జెట్లలో అత్యల్ప కేటాయింపులు ఉండేది కూడా విద్యాశాఖే! అసలు చదువుకు ఉద్యోగాలకు సంబంధమే ఉండదు? ఇది ఆందోళన కరమే. విద్య మీద అంతా మాట్లాడుతారు. కానీ, మన విద్యా విధానమే సరైన విధంగా ఉందా? మనం మన భావి భాతర పౌరులను తరగతి గదుల్లో భావి భారతావనికి సరైన పద్ధతిలోనే తీర్చిదిద్దుతున్నామా? ప్రాథమిక స్థాయిలో సరైన పునాది పడుతోందా? ఉన్నత విద్య మన పిల్లల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోతోందా? డబ్బులు సంపాదించే సాధనంగా మాత్రమే మాత్రమే ఉందా? మళ్ళీ మరోసారి స్కూల్స్ ప్రారంభమవుతున్న ఈ వేళ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆనాడు బ్రిటిష్ కాలనీలకు ఇంగ్లీష్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రవేశ పెట్టినవాడు మెకాలె. మెకాలె విద్యా విధానం అనే ఈ పదం బ్రిటిష్ రాజకీయ నాయకుడు థామస్ బాబింగ్టన్ మెకాలే (1800–1859) పేరు నుండి ఉద్భవించింది. అతను గవర్నర్ జనరల్ కౌన్సిల్లో పనిచేశాడు. భారతదేశంలో ఉన్నత విద్యకు ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు . అతనికి ఇంగ్లీష్ మినహా మిగతా భాషలంటే చాలా చులకన. ఒక సందర్భంలో ‘ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని ఒక షెల్ఫ్ భారతదేశం, అరేబియా దేశాల మొత్తం స్థానిక సాహిత్యానికంటే కూడా విలువైనది’ అని అన్యభాషలపై తన అక్కసును వెళ్ళగక్కాడట. మన దేశంలో అతడి కారణంగా మన స్థానిక భాషలపై, మన మాత్రు భాషలపై మనకే చులకన భావం కలిగేంతగా, మన నిత్యం మాట్లాడే మన భాషకంటే ఇంగ్లీష్ నే ప్రేమించే ఒక కుహనా సంస్కారంలోకి నెట్టబడ్డాం. అలాగని ఇవ్వాళ ప్రపంచ భాషగా మారిన ఇంగ్లీష్ ని చదవడం, నేర్చుకోవడం చేయరాదని కాదు. మన భాషలను గౌరవించడం నేర్చుకుంటేనే ఆ భాష కూడా బాగా వస్తుంది.
నిజానికి మన ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం కారణంగానే విద్యారంగం దిగజారిపోతోంది. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. విద్యలో వెనకబడడానికి సరైన దృక్పథం, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన పిల్లలకు డొక్కశుద్ధి లేకుండా పోతోంది. సదుపాయాల లేమి నుంచి, ఉపాధ్యాయుల కొరత, రేషలైజేషన్ లేకపోవడం, ప్రైవేటీకరణ, ప్రభుత్వ స్కూల్స్ పై నమ్మకం పోవడం, ఇలా తెనె తుట్టెలాంటి సమస్యలను కదల్చడం, వాటితో కుట్టించుకోవడం ఎవరికీ ఇష్టం లేకపోవడం.. ఎవరెక్కడపోయినా, మనం బాగుంటే చాలని భావించడం అనేక కారణాలు. మనం పిల్లల్ని చదివించి తెలివైన వారిగా తీర్చిదిద్దడం మీదకంటే కూడా డబ్బులు సంపాదించే వారిగా పెంచడం మీదే ద్రుష్టి పెడుతున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, విధానాలు మారడం కూడా ఒక లోపం. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండోల్లో దడ పట్టుకుంటుంది. పిల్లకు స్కూళ్లు తెరిచేనాటికి ఫీజులు, పుస్తకాలు ఇలా రకరకాల ఖర్చులు తడిసిమోపెడు అవుతుంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో భరోసా లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు అప్పుల చేసి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. ఇప్పటికే ప్రయివేటు పాఠశాలలు తెరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లను చేసేస్తున్నారు. పుస్తకాలు వచ్చాయని, వెంటనే తీసుకోవాలంటూ తల్లిదండ్రులకు ఫోన్లువిూద ఫోన్లు చేస్తున్నారు. ముందస్తు ఫీజులు, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.
ఏపీలో ఇంగ్లీషు మాధ్యమంతో ముందుకు పోదామని గత ప్రభుత్వం ప్రయత్నించి విఫలమయ్యింది. అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది. ఏదీ లేకుండా పోయింది. నిజానికి ఇంగ్లీషు మాధ్యమాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయొద్దనే అడుగుతున్నారు. మాధ్యమాల గొడవను పక్కన పెట్టి పిల్లలందరికి విద్యను చేరువ చేసే కార్యక్రమం జరగాలి. ఏ ఒక్క పిల్లవాడు బడిబయట ఉండకుండా చూడాలి.
మాతృభాష ద్వారానే జాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయనేది ఒక స్థిర అభిప్రాయం. నిపుణులు మాతృభాషా బోధనే మేలంటున్నారు. ఇంగ్లీష్ నేర్పడం వేరు. బోధన వేరని అభిప్రాయంగా ఉంది. అతి చిన్న దేశాలు మొదలు అతి పెద్ద జనాభాగల చైనా వరకు అన్ని దేశాలూ వారి మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఉన్నత విద్యను కూడా మాతృభాషలోనే జరుపుతున్నాయి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాష మాధ్యమంలోనే నడుస్తున్నాయి. చిన్న దేశమైన క్యూబా మాతృభాష లోనే వైద్యంలో అద్భుతాలు సాధించింది. మన దేశంలో అన్ని రాష్టాల్రు వారి భాషా మాధ్యమంలో విద్యను కొనసాగిస్తు న్నాయి. విద్యలో దేశంలోనే కేరళ ముందున్నది. అది కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందిస్తున్నది. కేరళ ప్రజలే ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంగ్లీషు నేర్చు కోవడంలో తప్పులేదు. మాతృభాషలో బోధన చేస్తూనే ఇంగ్లీష్, హిందీ భాషలు నేర్పితే సరిపోతుంది. తెలుగే అర్థం కాక వారి తెగల భాషలో వాలంటీర్లు అనువాదం చేస్తే తప్ప గిరిజన పిల్లలు స్కూలుకు రాని పరిస్థితి వుంది. కాబట్టి అందరికీ బడి, చదువు అందుబాటులో ఉండేలా చూడాలి.

