చట్ట సభలను చులకన చేయొద్దు!
చట్టసభలకు ఎన్నికైన వారు..సభకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలి. సభలో ప్రజల పక్షాన నిలబడాలి. హోదాతో సంబంధం లేకుండా నడుచుకునేలా చూసుకోవాలి. అయితే తెలుగు రాష్టాల్ల్రో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ సభలకు వెళ్ళడం లేదు. ప్రతిపక్షహోదా కలిగిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చట్టసభలకు రావడం లేదు. సభలో ప్రజాసమస్యలపై చర్చించడం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా యాన సభకు రాకుండా మొహం చాటేస్తున్నారు. పదేళ్లపాటు సిఎంగా పని చేసిన కెసిఆర్ విపక్షానికి పరిమితం కావడంతో ఇక ప్రజలతో పనేం!? అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేయడం లేదని, ఇక అంతు తేలుస్తానని బయటనుంచి మాట్లాడుతున్నారు. కానీ సభకు వచ్చి సమస్యలను ప్రస్తావించడం, తన ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి చెడులను చర్చించడం లేదు. ఇది ఓ రకంగా ప్రజలను అవమానించడమే! అలాంటప్పడు జీతభత్యాలు తీసుకోరాదు. నిజానికి ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు, పెన్షన్లపై చర్చించాలి. వారికి కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన అవసరమేముందో తేల్చాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో వారు సుఖాలు అనుభవిస్తున్నారు.
ఎ.పి అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అంశం మీద ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షహోదా ఇస్తే తప్ప సభకు రానని మూర్ఖంగా వాదించడం జగన్కే చెల్లింది. ప్రతిపక్ష హోదాకు సభా సంప్రదాయాలు, నియమాలు ఉన్నాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, గతంలో ఎంపిగా పనిచేసిన జగన్ చట్టాల గురించి తెలుసుకోకుండా సభకు రానని చెప్పడం ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే!
ప్రతిపక్షహోదా ఉన్న కెసిఆర్ రావడం లేదు..విపక్ష హోదా లేదు కనుక రాను పో అని జగన్ అంటున్నారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే ప్రజలు నట్టేట మునగడం ఖాయం. జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది రాజకీయ నిర్ణయం కాదు. ఈ విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో పరిశీలించాలి. పార్లమెంటులో లేదా, అసెంబ్లీలో రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందితే, ఆ పార్టీ పార్లమెంటు లేదా అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని వసతులు పొందడానికి వీలుంటుంది. ఇటువంటి గుర్తింపు సభాపతి నుంచి వస్తుంది. ఎన్నికల సంఘం దగ్గర రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాయి రాజకీయ పార్టీలు. అటువంటి పార్టీలకు చట్టసభలో ఒక సీట్ వున్నా అవి పార్లమెంటులో రాజకీయ పార్టీలుగానే కొనసాగుతాయిగానీ సభాధ్యక్షుడి గుర్తింపు వుండదు. సభాధ్యక్షుడి గుర్తింపు పొందితేనే సభా ప్రాంగణంలో కార్యాలయానికి గది కేటాయింపు వంటి వసతుల కల్పనకు అవకాశం ఉంటుంది. స్పీకర్ ఆధ్వర్యంలో పనిచేసే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలకు పిలుపు వస్తుంది. వసతుల కల్పనకు నిబంధనలు వేరుగా ఉంటాయి. దీనికి సంబంధించి పార్లమెంటులో మూడు నిబంధనలు పొందుపరిచారు. వాటినే అసెంబ్లీల్లో పాటిస్తున్నారు. కనీసం పదిశాతం సీట్లు పొందిన వారికే విపక్షపార్టీగా గుర్తింపు దక్కుతుంది.
గత పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి విపక్షహోదా దక్కలేదు. అది కావాలని ఆ పార్టీ పట్టుబట్టలేదు. ఫలితంగా పది సంవత్సరాలు లోక్సభలో ప్రతిపక్ష నేత అన్న వ్యవస్థ లేకుండా గడిచింది. 2014లోనూ, 2019 లోనూ కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ దానికి పదో వంతు సంఖ్యా బలం లేదు. పదో వంతు సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష గ్రూప్గా గుర్తిస్తారుగాని ప్రతిపక్ష పార్టీగా గుర్తించక పోవటం గతంలో కూడా జరిగింది. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో లోక్సభలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఏ జాతీయ పార్టీ నిలువలేదు. ప్రాతీయ పార్టీ అయిన తెలుగు దేశానికి ప్రతిపక్ష గ్రూప్ అన్న గుర్తింపు దక్కింది. అయితే చట్టంలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలంటే పదో వంతు సభ్యులుండాలన్న నిబంధన అన్నది సంప్రదాయంగా వస్తున్న నిబంధన మాత్రమే. 1977లో మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అనే వ్యవస్థ ఏర్పడింది. 1977లో అప్పటి జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపునకు కనీస సభ్యుల సంఖ్యను సూచించలేదు. సభలో అధికారపార్టీని వ్యతిరేకించే పార్టీలలో ఎక్కువమంది సభ్యులుండే పార్టీనేతను ప్రతిపక్ష నేతగా సభాధ్యక్షులు గుర్తిస్తారని పేర్కొన్నది. సభలో అధికార పక్షాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సమాన సంఖ్యా బలం కలిగి వుంటే ఏ పార్టీ నేతను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలనేది ఆ యా పార్టీల స్థితిగతుల ఆధారంగా సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఆ విధంగా సభాధ్యక్షుడి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. సభ లోపల వెలుపలా కూడా. జీత భత్యాలు, వాహనం, సహాయ సిబ్బంది, అధికారిక నివాసం మొదలైనవి వస్తాయి.. ప్రతిపక్ష నేతకు కాబినెట్ మంత్రి హోదా కల్పించటం ఒక సంప్రదాయంగా వస్తున్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక పార్టీకి చట్టసభలో గుర్తింపు పొందటానికి అవసరమైన సభ్యులే లేకపోతే, అలాంటి పార్టీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదనేది 2014లో నాటి లోక్సభ స్పీకర్ తేల్చేశారు. ఇది రాజకీయపరమైన నిర్ణయం. ఈ వాదన 2014లో తెర విూదకు వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదో వంతు సభ్యులు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ దానివిూద ఏవిూ రాద్ధాంతం చేయలేదు. సభా కార్యకలాపాలకు దూరంగానూ లేదు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించవలసిన ప్రతి సందర్భంలోను అప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని ప్రభుత్వం సంప్రదించింది. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నియామకాలు చేసే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా సభ్యుడు. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నియామకం. అటువంటి నియామకాలప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధీర్ రంజన్ చౌదరిని సంప్రదించింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతిపక్షనేత హోదా కావాలని జగన్ పట్టుబట్టడం అసమంజసం. తనకు దక్కదని తెలిసి కూడా ఆ హోదా కోసం ఆరాటపడటం హుందాతనం అనిపించు కోదు. సభలో మాట్లాడటానికి కేటాయించే సమయం రాజకీయ పక్ష సభ్యుల సంఖ్యాబలం విూద ఆధారపడి ఉంటుంది. మాట్లాడే హక్కు ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఎంతసేపు అనేది సభాపతి నిర్ణయం. ప్రతిపక్షనేత గనుక కచ్చితంగా ఇంత సమయం కేటాయించాలి అన్న నిబంధన ఏవిూ లేదు. తనకు 40 శాతం ఓట్లు వేసిన ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయంలో హోదా ఇవ్వలేదనే వంకతో అసెంబ్లీకి రాకపోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది కెసిఆర్, జగన్ ఇద్దరికీ వర్తిస్తుంది. సభకు ఎన్నికయ్యాక సమావేవాలకు హాజరు కావాల్సిందే. ప్రజల పక్షాన నిలబడాల్సిందే. అంతే తప్ప తమ మూర్ఖ వాదనలతో ప్రజలను చులకన చేయడం సరికాదు.

