తెలంగాణ సామాజిక–సాంస్కృతిక జీవనంలో జాతరలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి గ్రామానికీ, ప్రతి ప్రాంతానికీ ఒక స్థానిక దేవత, ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొమురవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రస్వామి, కొండపోచమ్మ వంటి జాతరలు ప్రజల విశ్వాసాలకు కేంద్రబిందువులుగా నిలిచాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, మేడారం మహా జాతర మరో ఎత్తు. సంఖ్యలో, సంప్రదాయంలో, భావోద్వేగంలో మేడారం ఒక విశిష్ట అనుభవం.
మేడారం జాతర మిగతా భారతీయ విశ్వాసాలకు, సంప్రదాయాలకు, జాతరలకు భిన్నమైనది. దేవతల చరిత్ర, కొలుపుల్లో విభిన్నమైనది. ఇది దేవాలయ కేంద్రంగా ఉన్న ఆచారం కాదు. గర్భగుడి లేదు, అర్చక వ్యవస్థ లేదు, శాస్త్రీయ పూజావిధానాలు లేవు. అయినా కోటానుకోట్ల మందిని ఆకర్షించే అపూర్వ శక్తి ఈ జాతరకు ఉంది. విశ్వాసానికి నిర్మాణాలు, విగ్రహాలు అవసరం లేదని నిరూపించే జాతర. అడవిలో, ప్రకృతి ఒడిలో, గిరిజన సంప్రదాయాల మధ్య జరిగే ఈ జాతర నేడు సర్వజనీన ఆమోదాన్ని పొందింది.
సమ్మక్క–సారలమ్మలు కేవలం గిరిజన దేవతలు మాత్రమే కాదు. అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన చరిత్రకు ప్రతీకలు. రాజ్య విస్తరణ కోసం పోరాడిన వారు చక్రవర్తులైతే, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మేడరాజులు దేవతలయ్యారు. కాకతీయుల కాలంలో ఇది చరిత్ర ఇచ్చిన గొప్ప సందేశం. అయితే, నేటికీ భక్తులు ఆ చరిత్రను వినడం, విశ్లేషించడంతోపాటుగా, అమ్మల దయను నమ్మి మొక్కులు చెల్లించడానికి మేడారానికి వస్తారు. విశ్వాసం ఇక్కడ చరిత్రకన్నా గొప్పది. నమ్మకమైనది.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అసలీ భక్త జన తాకిడిని తట్టుకోలేకే రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్నారు. గిరిజనులు, గిరిజనేతరులు, పట్టణ, గ్రామీణ భేదం లేకుండా జనసందోహం వెల్లువలా తరలివస్తుంది. నాలుగు రోజుల జాతరలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. చిన్న వ్యాపారులు, కూలీలు, స్థానికులు తమ జీవనాధారాన్ని ఈ జాతర ద్వారా మెరుగుపరుకుంటారు. మేడారం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఒక ప్రత్యామ్నాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా.
అయితే ఈ మహాజాతర నిర్వహణ రాష్ట్ర, జిల్లా పాలనా యంత్రాంగానికి పెద్ద సవాల్. అటవీ ప్రాంతం, పరిమిత మౌలిక వసతులు, విపరీతమైన జనసాంద్రత ఈ మూడింటి మధ్య సమన్వయం సాధించడం అంత సులభం కాదు. అయినా ప్రతి సారి ప్రభుత్వం, అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాగునీరు, వైద్యం, రవాణా, భద్రత వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు మెరుగుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి పేరుతో గిరిజన సంస్కృతిపై దాడి జరగకుండా జాగ్రత్త పాటించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
మేడారం జాతర మరో ముఖ్యమైన కోణం, సామాజిక సమానత్వం. ఇక్కడ మత, కుల, ప్రాంతీయ భేదాలు కరిగిపోతాయి. చెట్ల కింద అందరూ సమానంగా బస చేస్తారు. ఒకే వంటకాన్ని పంచుకుంటారు. సంపంగివాగులో పుణ్యస్నానాలు చేస్తూ కుంభమేళాను తలపిస్తారు. శబరిమలను గుర్తు చేసే జనసందోహం, తిరుమలలో కనిపించే మొక్కుల సంప్రదాయం వంటివన్నీ మేడారంలో ఒకేచోట కనిపిస్తాయి. అయినా ఈ జాతర తన మూల స్వరూపాన్ని కోల్పోలేదు. అదే దాని గొప్పతనం.
నేడు ప్రపంచీకరణ ప్రభావంతో అనేక స్థానిక సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. కానీ మేడారం మాత్రం కాలానికి ఎదురొడ్డి నిలుస్తోంది. ఇది గిరిజన సంస్కృతికి ఉన్న బలాన్ని, ప్రజల విశ్వాసానికి ఉన్న గాఢతను చాటిచెబుతోంది. సమ్మక్క–సారలమ్మలపై ఉన్న నమ్మకం భక్తులను మళ్లీ మళ్లీ మేడారానికి తీసుకొస్తోంది. “అమ్మ దర్శనం చేసుకుంటే కష్టాలు తీరతాయి” అన్న విశ్వాసమే ఈ మహాజాతరకు ప్రాణం.
మేడారం మహా జాతర ఒక పండగ మాత్రమే కాదు. ఒక భావజాలం. అది గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రజా విశ్వాసానికి అద్దం, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి గుర్తు. ఈ విశిష్టతను కాపాడుకుంటూనే, భవిష్యత్తుకు మరింత సుస్థిరంగా తీసుకెళ్లడం మనందరి బాధ్యత. మేడారం అంటే కేవలం ఒక ప్రాంతం, చరిత్ర, త్యాగం, విశ్వాసం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి, ఒక నమ్మకం, ఒక జీవన తత్వం.

