మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవల రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ భేటీ మరోసారి బహిర్గతం చేసింది. రాష్ట్రాలు తమ అభివృద్ధి అవసరాల కోసం కేంద్రాన్ని దేబిరించాల్సిన పరిస్థితి. రాజకీయ భేదాభిప్రాయాల ఆధారంగా నిధుల కేటాయింపులు జరుగుతుండటం దేశ ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశాలు.
ప్రీ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ నుంచి పయ్యావుల కేశవ్ హాజరై తమ రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలను కేంద్రం ముందు ఉంచారు. అయితే ఈ వినతులు కొత్తవేమీ కావు. ఏటా ఇదే విధంగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో నిధుల కేటాయింపులు, రాష్ట్రాలు ఆశించిన విధంగా లేవు. ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారో, ఏ రాష్ట్రానికి ఎంత న్యాయం జరిగిందో తెలిపే పారదర్శక వ్యవస్థ కనిపించడం లేదు.
బడ్జెట్ కేవలం లెక్కల పుస్తకం కాదు. అది దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధాన పత్రం. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే దృక్పథం అందులో ప్రతిఫలించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకు ఒక రకంగా, భిన్న రాజకీయ వైఖరులు గల రాష్ట్రాలకు మరో రకంగా నిధుల పంపిణీ జరుగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఈసారి ప్రీ–బడ్జెట్ సమావేశంలో కేంద్రంలో ఎన్డిఎ కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలు కూడా నిధుల కోసం గళం విప్పాయి. జీఎస్టీ పరిహారం కొనసాగించాలని, పెరిగిన ఆర్థిక భారం దృష్ట్యా అదనపు గ్రాంట్లు ఇవ్వాలని బీహార్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కోరడం పరిస్థితి తీవ్రతను అర్థం చేస్తున్నాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటాను తగ్గించడం, గ్రాంట్లను ఆలస్యం చేయడం, అప్పుల పరిమితులను కఠినతరం చేయడం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు.
కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల్లో కేరళ ముందుంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో దాదాపు రూ.57 వేల కోట్ల మేర నిధులకు కోత పెట్టడమే కాకుండా, పన్నుల వాటాను 3.89 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఒక్క 2024–25 ఆర్థిక ఏడాదిలో కేరళ ప్రజలు సుమారు రూ.27 వేల కోట్లలు నష్టపోయారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా మరో రూ.9 వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఈ ఆర్థిక దిగ్బంధానికి నిరసనగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సత్యాగ్రహానికి దిగాల్సి రావడం పరిస్థితి ఎంత తీవ్రమో సూచిస్తోంది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానాలపై కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ మౌనం పాటించడం దారుణం. సమాఖ్య హక్కుల పరిరక్షణలో ప్రతిపక్షాలు ఏకోన్ముఖంగా పోరాడకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి మరింత బలాన్నిస్తోంది. బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది.
తెలంగాణ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, నవోదయ విద్యాలయాలు, రోడ్ల విస్తరణ, ఎస్సీఆర్ఎస్పీకి జాతీయ హోదా, ట్రిపుల్ ఆర్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం నిధులు కోరింది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణానికి కొనసాగింపు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహాయం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖపట్నం–రాయలసీమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు కేటాయింపులు కోరింది. ఇవన్నీ ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లే. తెలంగాణ, ఏపీ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఇవే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం కనిపించడం లేదు.
నిధుల కేటాయింపుల్లో సమానత, పారదర్శకత, రాజకీయ భేదాలకు అతీతమైన దృక్పథం అత్యవసరం. బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రాన్ని నిర్మిస్తాయి. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిస్తే దేశ ప్రగతి కుంటుపడుతుంది. సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఏకపక్ష వైఖరిని విడనాడి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో, ఈ ఆర్థిక, అభివృద్ధి అసమానతలు, అసంతృప్తులకు దారితీస్తాయి. ఆవేదనలు, నిరసనలు, ఆందోళనలుగా మారి దేశవ్యాప్తంగా అంతర్గత సమస్యలు పెరుగే ప్రమాదం లేకపోలేదు. ఈ లోగా కేంద్రం మేల్కొంటే మంచిది.

