భారతీయ, తెలుగు సంస్కృతిలో పండుగలు ఆనందోత్సాహాలకు ప్రతీక. మన పండుగలు కాలానుగుణ మార్పులను, ప్రకృతి ధర్మాలను, మానవ జీవన తత్వాన్ని సూచించే సంప్రదాయాలు. పండుగలలో సంక్రాంతికి విశిష్ట స్థానం ఉంది. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ సంక్రాంతి మహాపండుగలో తొలి రోజు భోగి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి జరిగే సూర్య గమనానికి సూచికగా నిలుస్తుంది. ఈ పండుగను ప్రకృతిలో జరిగే మార్పునే కాకుండా, మనిషి జీవితంలో ఆశ, ఆనందం, నూతనోత్తేజాలకు సంకేతంగా భావిస్తారు.
సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి క్రమంగా దూరమవడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియ గరిష్ట స్థాయికి చేరే సమయమే భోగి. చలిని తట్టుకోవడానికి ప్రజలు మంటలు వేయడం ఆనవాయితీగా మారింది. కాలక్రమేణా ఈ చలి మంటలే భోగి మంటలుగా రూపాంతరం చెందాయి. అయితే భోగి మంటల వెనుక ఉన్న అర్థం కేవలం చలి నివారణ మాత్రమే కాదు. దక్షిణాయనంలో ఎదురైన కష్టాలను అగ్నికి అర్పించి, ఉత్తరాయణంలో సుఖసంతోషాలను కోరుకునే ఒక సామూహిక సంకల్పం కూడా దాగి ఉంది.
శాస్త్రీయ దృష్టితో చూస్తే భోగి మంటలు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ధనుర్మాసంలో ఇళ్ల ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా తయారు చేసి, రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల కలపతో పాటు ఆవు నెయ్యిని మంటల్లో వేయడం ద్వారా గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశించి, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఆధునిక కాలంలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, భోగి మంటల ఆరోగ్య ప్రయోజనాలు మరింత ప్రాధాన్యంగా మారుతున్నాయి.

భోగి అనే పదం సంస్కృతంలోని “భుజ్” లేదా “భోగ” అనే ధాతువుల నుంచి వచ్చినదిగా పండితులు వివరిస్తారు. భోగం అంటే అనుభవం, ఆనందం. కానీ ఇక్కడ చెప్పే భోగం భౌతిక సుఖాల పరిమితిలోది కాదు. ఏదైనా పొందిన తర్వాత ఇంకేదీ కావాలని అనిపించదో, అదే నిజమైన భోగం. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, అలాంటి పరిపూర్ణ ఆనందం పరమాత్మ సాన్నిధ్యంలోనే లభిస్తుంది. ఈ భావననే భక్తి సంప్రదాయాలు భోగి పండుగతో అనుసంధానించాయి.
పురాణ కథనాల ప్రకారం, భోగి రోజునే అమ్మ గోదాదేవి శ్రీ రంగనాథునిలో లీనమై పరమాత్మ ప్రాప్తి అనే దివ్య భోగాన్ని పొందిందని విశ్వాసం. ధనుర్మాస వ్రతం ఈ రోజుతో పూర్తవడం, ఆ ఫలితంగా అమ్మవారు స్వామి అనుగ్రహాన్ని పొందడం భోగి పండుగకు ఆధ్యాత్మికతను ఇస్తుంది. అదే విధంగా వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన రోజు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అణిచిన రోజు, నందిని భూమికి పంపిన పవిత్ర దినంగా కూడా భోగి ప్రస్తావన వస్తుంది. ఇవన్నీ భోగిని ధర్మం, వినయం, కృతజ్ఞతలకు ప్రతీకగా నిలబెడతాయి.
సామాజిక కోణంలో చూస్తే, భోగి పండుగ గ్రామీణ జీవన విధానానికి ప్రాణం పోసే పండుగ. కులమతాలకు అతీతంగా గ్రామంలోని వారందరూ ఒకేచోట చేరి భోగి మంటల చుట్టూ కూర్చుని ఆనందాన్ని పంచుకుంటారు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. రైతులు తమ సాగుభూముల్లో భోగి పులక వేయడం ద్వారా ఒక పంట ముగిసి, మరో పంటకు సిద్ధమవుతున్న ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఇది వ్యవసాయ జీవన చక్రానికి సూచిక.
భోగి రోజున పిల్లలపై భోగి పళ్ళు పోయడం కూడా ప్రత్యేక సంప్రదాయం. రేగు పండ్లు, పూలు, శనగలు కలిపి చిన్నారులపై పోసి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆశీర్వదించడం వెనుక మానవత భావన దాగి ఉంది. దేవతలు బదరీ వనంలో శ్రీహరిని బాలుడిగా చేసి రేగు పళ్లతో అభిషేకం చేశారన్న కథనం ఈ సంప్రదాయానికి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది.
భోగి అంటే కేవలం పాత వస్తువులను కాల్చే పండుగ కాదు. పాత అలవాట్లు, నెగటివ్ ఆలోచనలు, నిరాశను విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగమనే సందేశాన్ని ఇచ్చే పర్వదినం. ప్రకృతి మార్పును గౌరవిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతూ, సమాజాన్ని ఐక్యపరుస్తూ, ఆధ్యాత్మిక ఆనందాన్ని గుర్తు చేసేదే భోగి పండుగ.

