తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. సమస్య పరిష్కారానికి బదులు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. జీవాధారమైన జలాన్ని కూడా రాజకీయం చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అందుకు పూనుకున్న పార్టీల దివాలాకోరుతనం.
నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. సాగు, తాగునీరే ఉద్యమానికి ఇంధనంగా పని చేశాయి. సాధారణంగా నీటి అంశంపై రెండు రాష్ట్రాల ప్రజలు అత్యంత సున్నితంగా స్పందిస్తారు. కరువు కాటకాల రాయలసీమ కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. వాస్తవాలను పక్కనపెట్టి, రాజకీయ పార్టీలు సామరస్యతకు పాతరేసి, పరస్పర విద్వేషాల్ని పెంచేలా వ్యవహరిస్తున్నాయి.
పవర్ లో ఉంటే పట్టించుకోకుండా, ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం పార్టీలకు అలవాటుగా మారింది. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్, జలవివాదాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేశారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయమంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఇరు పార్టీల సొంత మీడియా, ఏపీ సీఎం చంద్రబాబును “ఆంధ్రప్రదేశ్ ద్రోహి”గా, “నీటి దొంగ”గా, తెలంగాణ సీఎం రేవంత్ ను “తెలంగాణ ద్రోహి”గా చిత్రీకరిస్తున్నది. వాస్తవాలు ఎలా ఉన్నా, ఈ ప్రచారం ప్రజల్లో పరస్పర విద్వేషాల్ని పెంచుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఇప్పటికే సున్నితగా ఉన్న భావోద్వేగాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇది కొన్ని రాజకీయ పార్టీలకేమో గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేయదు.
వాస్తవానికి పాలకులు ఎవరైనా తమ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేరు. అదే సమయంలో పొరుగు రాష్ట్ర హక్కులను కాలరాయడం కూడా అంత సులువుగా సాధ్యం కాదు. నదీజలాలు కేవలం రాష్ట్రాలకు చెందినవే కాదు. అవి జాతీయ వనరులు కూడా. జలవివాదాలను పరస్పర చర్చలు, సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించాలనే రాజ్యాంగం సూచిస్తోంది. కోర్టుల చుట్టూ తిరగడం శాశ్వత పరిష్కారం కాదని, గత అనుభవాలే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకంటే, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేసిన “జలజగడాలకన్నా పరిష్కారాలే ముఖ్యం” అన్న వారి వ్యాఖ్యలు హుందాగా కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. వివాదం కొనసాగితే లాభపడేది రాజకీయ పార్టీలే తప్ప రైతులు, ప్రజలు కాదు.
పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ విషయంలోనూ భావోద్వేగాలకన్నా వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలి. గోదావరి నది చివరి ప్రవాహ రాష్ట్రం ఏపీ. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను వినియోగించుకోవడం సూత్రప్రాయంగా తప్పు కాదు. అయితే అది ఇతర తెలంగాణ వంటి పైరాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా, వాటి సమ్మతితో చట్ట, న్యాయబద్ధమైన అనుమతులతో జరగాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. టెండర్లు ముందస్తు సన్నాహక చర్యలేనని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెబుతోంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా సహజ పరిణామమే. కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు, ఇరు రాష్ట్రాలూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ప్రజల్లో ఉద్రేకాన్ని పెంచే ప్రకటనలు, ప్రచారాలు ఆపాలి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి అంశాలు మరింత తీవ్రంగా రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదు. ఇరు రాష్ట్రాల జలవివాదాలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా పరిష్కార మార్గాలు సూచించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
జలవివాదాలు రాజకీయ యుద్ధంగా మారితే నష్టపోయేది ప్రజలే. నీరును రాజేసి, నిప్పును పుట్టిద్దామని చూసే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. సంయమనం, చర్చలు, పరస్పర గౌరవం ఇవే జలవివాదాలకు శాశ్వత పరిష్కారం.

