గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్, గ్యాస్ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి. 30ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్ గానీ, తాజా ఇసుమండ బ్లోఅవుట్ గానీ, నేర్పుతున్న పాఠం ఒక్కటే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్, అభివృద్ధి ఏదైనా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. దేశ ఇంధన అవసరాల కోసం ఓఎన్జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్, గ్యాస్ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి.
1995 జనవరి 8న పాశర్లపూడిలో సంభవించిన బ్లోఅవుట్ ఈ ప్రాంత చరిత్రలో చెరగని విషాద ఘట్టం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్గా నమోదైన ఈ ఘటనను అదుపు చేయడానికి 65 రోజులు పట్టింది. ఆరు వేల కుటుంబాలు శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. పంటలు నాశనమై, పర్యావరణానికి తీరని నష్టం జరిగింది. ఆ మంటల వేడి, ఆకాశాన్ని చీల్చిన శబ్దం ఇప్పటికీ కోనసీమ వాసుల జ్ఞాపకాలలో భయానకంగా నిలిచిపోయాయి.
పాశర్లపూడి బ్లోఅవుట్ ఒక్కసారిగా జరిగిన ప్రమాదమేమీ కాదు. 1993లో కొమరాడ, 1997లో దేవరపల్లి, 2020లో ఉప్పూడి, ఇలా బ్లోఅవుట్లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2014లో మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ పైప్లైన్ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన పైప్లైన్లు, నిర్వహణ లోపాలు, ప్రైవేటు సంస్థల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా మలికిపురం మండలం ఇసుమండలో ఓఎన్జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్ కోనసీమను మరోసారి కలవరపాటుకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, మూడు రోజులైనా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది కొబ్బరి చెట్లు, వరి నారుమళ్లు, పంటలు నాశనం కావడం ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. బ్లోఅవుట్ భయంతో మూడు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పాఠాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? 1993లో డ్రిల్లింగ్ చేసిన బావిని, అధిక పీడనం ఉందని అప్పట్లోనే నిలిపివేసిన ప్రాంతాన్ని, మళ్లీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి పడటం కాదు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే చమురు సంస్థలు, నిర్వాహకులు, ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్జీసీ వంటి సంస్థలు ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలం చెల్లిన పరికరాలు తొలగించడం, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, ప్రైవేటు సంస్థలపై కఠిన నియంత్రణ పెట్టడం అత్యవసరం. బాధితులకు తక్షణమే సముచిత నష్టపరిహారం చెల్లించడం ఇంకా అవసరం.
పాశర్లపూడి బ్లోఅవుట్ జరిగి మూడు దశాబ్దాలు గడిచాయి. కానీ కోనసీమ ప్రజల భయాలు ఏమాత్రం తగ్గలేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవ నిర్లక్ష్యం ఉంటే ప్రమాదాలు తప్పవు. పాశర్లపూడి నుంచి నేటిదాకా కోనసీమ నేర్పుతున్న పాఠం ఇదే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్ గ్యాస్ అయినా, అభివృద్ధి అయినా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

