పోలవరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పోలవరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.
గంగవరం పోర్టు కోసం త్యాగం చేసిన మత్స్యకారులు ఉపాధి కోల్పోయి నిండా మునిగారు. అదే పోర్టును దక్కించుకున్న ఆదానీ మాత్రం ఒడ్డున పడ్డారు. ఇదే నమూనా తెలంగాణలోనూ పునరావృతమైంది. కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూములు, గ్రామాలు త్యాగం చేసిన రైతులు, ప్రజలు ఆగమయ్యారు. కానీ పాలకులూ, వారి అనుచరుల భూములు మాత్రం నీటితో పచ్చగా కళకళలాడతున్నాయి.
అమరావతి రాజధాని పేరుతో లక్ష ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది. రైతులు ఇచ్చిన త్యాగాలకు తగిన పరిహారం లభించిందా? ప్లాట్లు సక్రమంగా అందాయా? అంటే సమాధానం లేదు. బహిరంగంగా ప్రశంసలు కురిపించడం తప్ప రైతులకు వాస్తవ లబ్ధి చేకూరలేదు. ఇంకా ప్లాట్ల కోసం రైతులు పాట్లు పడుతూనే ఉన్నారు. అయినా పాలకుల భూదాహం తీరలేదు. ఇప్పుడు రెండో దఫా భూసేకరణ మొదలైంది. ఈ అభివృద్ధి ఎవరి కోసం అన్న ప్రశ్నకు పాలకులు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇది.
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి మరింత విషాదకరం. దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం నిర్వాసితులు నేటికీ దుర్భర జీవితం గడుపుతున్నారు. 1.20 లక్షల కుటుంబాలు ముంపు ముప్పులో ఉండగా, వారికి న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాసం ఇప్పటికీ అందలేదు. భూమికి భూమి లేదు. ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు కాలేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో వర్షం పడితే ఇళ్లు నీళ్ళల్లో తేలుతున్నాయి. నిలువునా కారుతున్నాయి. శ్మశానాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు వంటి కనీస సదుపాయాలే లేవు.
1986, 2022 వరదల అనుభవం ముంపు ప్రాంతాల స్థితిగతులను కళ్ళకు కట్టినా, పాలకులు వాస్తవాన్ని గ్రహించడం లేదు. కాంటూరు సర్వేలు, లైడార్ సర్వేలు వాస్తవాలను ప్రతిబింబించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. అయినా తాజా పరిహారం 2017కు ముందు అంచనాల ఆధారంగానే చెల్లిస్తున్నారు. డ్యామ్ అంచనాలు రెండుసార్లు పెరిగినా, నిర్వాసితుల ప్యాకేజీ మాత్రం పెరగలేదు. పెళ్లయిన యువతులకు పునరావాస హక్కులు నిరాకరించడం, మహిళలకు పురుషులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయం.
గతంలో ఏపీ సీఎం జగన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినా, అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయినా తాజా ధరలకు అనుగుణంగా ప్యాకేజీ సవరించి అమలు చేస్తుందేమోనని నిర్వాసితులు ఆశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. డ్యామ్ పనులను పరిశీలించిన సీఎం, ముంపు ప్రాంతాలు, పునరావాస కాలనీలను సందర్శించి ఉంటే సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండేది.
మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం చేస్తామని లక్ష్యాలు ప్రకటిస్తున్నారు. కానీ నిర్వాసితులకు న్యాయం జరగకుండానే ప్రాజెక్టు పూర్తయితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? డ్యామ్ను దశలవారీగా కాకుండా పూర్తి ఎత్తు వరకూ ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యాకనే నిర్మించాలన్న నిర్వాసితుల డిమాండ్ న్యాయమైనదే. డయాఫ్రం వాల్ నాణ్యత లోపాల వల్ల దెబ్బతిన్న విషయం విదేశీ నిపుణులే నిర్ధారించారు. అయినా నివేదికను బహిరంగపర్చలేదు. అదనంగా రూ.900 కోట్లు వెచ్చించారు. కానీ, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. అవకతవకలపై పారదర్శక విచారణ జరగాలి.
అభివృద్ధి అంటే ప్రజలను ముంచి నిర్మించే కాంక్రీట్ నిర్మాణాలు కాదు. ప్రజల జీవన భద్రత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణే నిజమైన అభివృద్ధి. హెలికాప్టర్ పర్యటనలు, తీయని మాటలు తగ్గించి, నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వాల తొలి కర్తవ్యం కావాలి. మరి ప్రభుత్వాలు, పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా? నిర్వాసితులకు నిజంగా సాయంగా నిలబడతారా? ప్రజల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతోన్న ప్రాజెక్టుల ఫలాలను వారికే దక్కనిస్తారా?

