‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటీష్ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది.
అమెరికా ఇతర దేశాల మీద దాడులు చేస్తే, అందుకు కారణాలు ఉంటాయి. అదే ఇతర దేశాలు ఏ దేశం మీద దాడి చేసినా అందుకు కారణాలుండ కూడదన్నది అమెరికా సిద్ధాంతంగా మారింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక టెంపరితనం, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష విపరీతంగా పెరిగింది. తన కనుసన్నల్లోనే దేశాలన్నీ నడవాలన్న నిరంకుశత్వం కనిపిస్తోంది. ట్రంప్ రెండు రకాలుగా ప్రపంచాన్ని గిప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకటి టారిఫ్ ల బాదుడు. రెండు సైనిక దాడులు. చైనా,భారత్ వంటి దేశాలపైనా పన్నులతో విరుచుకుపడుతున్నారు. కాని పక్షంలో ‘బడిత ఉన్నోడిదే బర్రె’ అనే సామెతలా వెనెజువెలా లాంటి దేశాలపై సైనిక దాడికి దిగుతున్నాడు. ఇప్పటికే ఇరాన్, ఖతార్, సిరియాలపై విరుచుకుపడి బాంబులు వేశారు. ఇప్పుడు వెనెజువెలాను తామే పాలిస్తామని చెబుతున్నాడు.
ప్రపంచంలో సైనిక శక్తి ఉంటే ఏ దేశం మీదైనా దాడి చేయవచ్చా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలా అయితే మన దేశం నుంచి విడిపోయిన పాక్, బంగ్లా దేశ్లపై మనం కూడా దాడి చేసి భారత్లో కలిపేసుకుని, అఖండ భారత్ కలను సాకారం చేసుకోవచ్చా? భారత్లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్కు బుద్థి చెప్పేందుకు దాడి చేస్తే అడ్డుకోవాలని ట్రంప్ చూశారు. తానే పాక్, భారత్ యుద్దాన్ని ఆపానని అంటాడు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దం వద్దని మధ్యవర్తిత్వం వహిస్తాడు. తానే అనేక యుద్ధాలను ఆపానని ప్రగల్బాలు పలుకుతాడు. వెనెజువెలాపై దాడి చేస్తాడు. అధ్యక్షుడిని, అతడి సతీమణిని అపహరిస్తాడు. ఇలా ట్రంప్ తన తల తిక్కి అహంకారంతో వ్యవహరి స్తున్నాడు. నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టింది. తాను వెనెజువెలా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు. తదుపరి ఏం జరుగుతుందో తెలియని అయోమయం. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్ ఆమెను కూడా బెదిరించాడు.
అయితే వెనెజువెలాలోని చమురు నిక్షేపాలను ఆక్రమించుకోవడం అమెరికా ఎత్తుగడగా ఉంది. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. దాని జోక్యం మరింత అవసరం. రెండో ప్రపంచ యుద్దానికి ముందు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా యూదుల మారణకాండకు పాల్పడ్డాడు. నరమేధం సృష్టించాడు. గ్యాస్ ఛాంబర్లు పెట్టి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అనేక దేశాలను ఆక్రమించుకుంటూ పోయినా ప్రజాస్వామిక ముసుగు వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు. అప్పట్లో అమెరికా ఆయుధాలు కూడా అందించింది. అయితే రష్యా అధినేత స్టాలిన్ నాయకత్వంలో ప్రతిఘటించిన తరవాతనే హిట్లర్ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.
ఇండియాలో కూడా బ్రిటిషర్లు ఇలాగే వ్యవహరించారు. అంతకు ముందు మొగలులు కూడా దాడులు చేసి హిందూ ఆలయాలను ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశారు. మత మార్పిళ్లు చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ రజాకార్లు కూడా ప్రజలను ఊచకోత కోశారు. కాశ్మీర్లో మారణహోమం చూశాం. మతమార్పిళ్లు చూశాం. ఊచకోతలు చూశాం. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మారంది. ఆధునిక ప్రపంచంలో ఇటీవల ఉక్రెయిన్పై రష్యా దాడిని, ఇప్పుడు వెనిజువెలాపై అమెరికా దాడిని చూస్తున్నాం. ఇది తమ దారికి రాని వారికి ఏ గతి పడుతుందో తెలిపే ఆరంభం మాత్రమే అని, మదురో అపహరణ తరువాత ట్రంప్ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు చూడాల్సి వస్తుందో? ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో అన్నది ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ రూపంలో ఉన్న అమెరికన్ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరనేదే కాలమే చెప్పాలి.
తమ తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్ చెప్పాడు. ట్రంప్ సామ్రాజ్య విస్తరణ కాంక్షను వెనెజువెలా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్ స్వయంపాలిత గ్రీన్లాండ్ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. అది కూడా త్వరలోనే స్వాధీనం చేసుకునేదాకా వదిలేట్టుగా లేడు. కెనడాను కూడా ఇలాగే బెదిరించాడు. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటిష్ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

