తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నదీ జలాలు ఎజెండాగా కొనసాగనున్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్ విధి విధానాలు, కేంద్రం వైఖరిపై కంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ ల తీరుతెన్నులపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది ప్రతిపక్షం వ్యూహం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగిన జల అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తలపోస్తోంది. అసెంబ్లీ వేదికగా మరోసారి ‘నీటి మంటలు’ చెలరేగే పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో నదీజలాలను సమర్థంగా వినియోగించుకుంటాయన్న ఆశలు నెరవేరలేదు. పైగా జలవివాదాలు మరింత ముదిరాయి. వృథా అవుతున్న నీటిని నిల్వ చేసుకోవడం, సమగ్ర జలవిధానాలు రూపొందించుకోవడం వంటి అంశాలను పాలకులు విస్మరించారు. దూరదృష్టి లేని నిర్ణయాలు, రాజకీయ లాభాలకే పరిమితమైన ప్రాజెక్టులు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారాయి.
ఏపీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం పదేళ్లు గడిచినా పూర్తికాలేదు. జగన్ పాలనలో బటన్ నొక్కుడు కార్యక్రమాలు, మాఫియాల ఆరోపణలు, రాజధాని గందరగోళం మధ్య పోలవరం వెనుకబడింది. ఇప్పుడు చంద్రబాబు కూడా వైఖరిలోనూ పోలవరం పూర్తి చేయడంపై కంటే బనకచర్ల, ఇతర లింక్ ప్రాజెక్టుల పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణకు వరంగా ప్రచారం జరిగినా, నిర్మాణ లోపాలు, నిర్వహణ వైఫల్యాలు బయటపడ్డాయి. బ్యారేజీల కుంగుబాటు, లక్షల కోట్ల ప్రజా ధనం వృథా అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇతర మధ్యతరహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా జల భద్రత కంటే రాజకీయ ప్రతిష్ఠే ప్రధానంగా మారింది.
ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం పోలవరం–నల్లమల (పీఎన్ లింక్) ప్రాజెక్టు. ఈ లింక్ ద్వారా కేవలం గోదావరి మిగులు జలాలే కాకుండా కృష్ణా జలాలను కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నది బీఆర్ఎస్ వాదన. ఏపీ ప్రభుత్వం పీఎన్ లింక్ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని తరలించాలన్న ప్రతిపాదనలతో డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ లింక్లో భాగంగా పోలవరం కుడికాలువ నుంచి ప్రకాశం బరాజ్, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో నాగార్జునసాగర్ కుడి కాలువను దాటాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ అనుసంధానాలను ఉపయోగించి సాగర్ నుంచే కృష్ణా జలాలను బొల్లాపల్లికి మళ్లించే అవకాశముందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం 173 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న బొల్లాపల్లి రిజర్వాయర్ను భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు విస్తరించవచ్చన్న వాదన ఈ భయాలను మరింత పెంచుతోంది.
ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వినియోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నుంచే జలదోపిడీ జరుగుతుండగా, సాగర్ నుంచీ అదే ప్రక్రియ మొదలైతే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చెన్నై తాగునీటి కోసం కృష్ణా బేసిన్ రాష్ట్రాలు 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఒప్పందం కూడా కాలక్రమేణా జలదోపిడీకి మారిందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం, ప్రభుత్వాలకు నీటి వనరుల నిర్వహణపై సమగ్ర దృక్పథం లేకపోవడం. వృథా, మిగులు జలాలను నిల్వ చేసుకునే ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య విశ్వాసంతో కూడిన ఒప్పందాలు, పారదర్శక సంఖ్యా వివరాలు, పంపకం వంటివేవీ రాజకీయ ప్రాధాన్యత పొందడం లేదు. ఫలితంగా, నీరు అత్యంత ఆవశ్యమైన వనరుగా కాకుండా, ఒక రాజకీయ ఆయుధంగా మారింది.
అసెంబ్లీలో ఈ అంశాలపై తీవ్ర వాగ్వాదం అనివార్యంగా మారింది. అయితే ఈ చర్చలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, శాస్త్రీయంగా, సాంకేతిక సంఖ్యల ఆధారంగా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా సాగితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే, గతంలాగే నదీజలాలు రాజకీయ మంటల్లో కాలిపోతూనే ఉంటాయి.

