వ్యక్తిగత విలువలే లుప్తమైన ఈ రోజుల్లో, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మట్లాడటం గొంగట్లో కూర్చుని బొచ్చేరుకోవడమే! విలువల్ని గౌరవించడం అటుంచి, పాటించడం అసంభవంగా మారింది. అబద్ధం, అవినీతి, అరాచకమే రాజకీయమై, అధికారమే పరమా‘వధి’ అయి, అందలానికై ఎంతకైనా తెగించడమే నీతైపోయింది. రాజ్యాంగం రాసుకున్నదే కానీ, ఆచరించడానికి కాదన్నట్లుగా రాజకీయ నేతలు చేతలుంటున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి చర్చించడమంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే! ఇందుకు పార్టీ ఫిరాయింపులు అతీతమేమీ కాదు.
ప్రజాస్వామ్యం, రాజ్యంగం, ఫిరాయింపుల చట్టం వంటివన్నీ ఫిరాయింపులు అనైతికమని ఘోషిస్తున్నా, రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపు అనైతికమంటే, నీవు చూపిన దారే కదా నీరజాక్షా? అంటున్నారు. నైతికత వ్యక్తిగతం, సంస్థాగతం సామాజికం. దాన్ని చట్టం చేసి, చాటింపు వేసినా సరే, తాము ఆడిందే ఆట, తాము పాడిందే పాట అంటున్నారు రాజకీయ నాయకులు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా పెద్దగా అడ్డంకులు లేకుండా వ్యవహారం ముగుస్తున్న తరుణంలో, దీనికోసం కోర్టులు, వాదపోవాదనలు, ఆరోపణలు, విచారణలు అవసరమా? డబ్బు, సమయం సహా అంతా వ్రుథాయే కదా?
నిజానికి పార్టీ ఫిరాయింపులకు ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. ఆయారాం, గయారాంల చరిత్ర ఈనాటిదేమీ కాదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివ్రుద్ధి, పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణం పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను నిర్లజ్జగా తమ పార్టీలో చేర్చుకున్నది చూశాం. ఇద్దరు ఎమ్మెల్యేలను కారణం లేకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించడం తెలుసు. ఏకంగా టీడీఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకున్న వైనం తెలంగాణ అసెంబ్లీ రికార్డుల్లో, రాజకీయ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది. జర్మనీ పౌరసత్వం ఉన్న చెన్నమనేని రమేశ్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగించడం వంటి దురంతాలు అప్పట్లో పెద్దగా నైతిక చర్చకు వచ్చినా, ఎవరూ లెక్క చేయలేదు. బలమైన అధికార పక్షం, బలహీనమైన ప్రతిపక్షాలు సర్దుకుపోయాయి. అవన్నీ అనైతికమేనని అంగీకరిస్తే, ఇప్పుడు పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులూ అనైతికమే. లేదంటే అవసరార్థపు రాజకీయాల్లో అది చెల్లితే ఇదీ చెల్లినట్లే అనుకోవాలా? అధికారంలోకి వస్తే చాలు, దాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏమైనా చెల్లుతుందా?
తాజా పరిణామాల్లో సుప్రీంకోర్టు సూచనల తర్వాత తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు, రాజకీయాల్లో ఎలాంటి మౌలిక మార్పు రాలేదన్న నగ్న సత్యాన్ని వెల్లడిస్తోంది. నైతికతకు చోటులేని రాజకీయ వ్యవస్థలో తీర్పులు సాంకేతికత చుట్టూనే తిరుగుతాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా, ఫిరాయింపులపై చివరకు తేలిందిదే. ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం, వారు పార్టీ మారినట్లు నిరూపణలేవీ లేవని స్పీకర్ నమ్మి, నిర్ధారించడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో నైతికతను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్, ఇప్పుడు అదే పశ్నను ఎదుర్కొంటోంది. అప్పుడు తాము చేసిందానికి ఇప్పుడు జరుగుతోంది చెల్లుకు చెల్లని వదిలేయడమా? లేక న్యాయం కోసం నిటారుగా నిలబడి నిలదీయడమా? ఇంకా ఈ పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువాలు కప్పి, పార్టీ కార్యక్రమాలకు పిలిస్తే వారి అసలు రంగు ప్రజల ముందే తేలిపోతుంది. వారు వస్తే బీఆర్ఎస్లోనే కొనసాగుతారు, రాకపోతే వారి రాజకీయ రంకు తేలిపోతుంది.
అలాగే, హర్యానాలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం భిన్నంగా మాట్లాడటం ద్వంద్వ వైఖరినే సూచిస్తుంది. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ఫొటోలకు పోజులివ్వడం కన్నా, దేశమంతా ఒకే విధమైన నైతిక ప్రమాణాన్ని పాటించడమే అసలైన రాజ్యాంగ పరిరక్షణ అవుతుంది.
ప్రజాజీవితంలో నైతిక విలువలు పూర్తిగా అడుగంటిన ఈ తరుణంలో, ఫిరాయింపులపై వచ్చిన ఈ తీర్పు అన్ని రాజకీయ పార్టీలకూ ఒక కనువిప్పుగా మారాలి. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరోలా కాకుండా, ఎప్పుడూ ఒకే ప్రమాణంతో వ్యవహరించగలిగినప్పుడే రాజకీయాలకు కొంతైనా విశ్వసనీయత మిగులుతుంది. ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.

