‘ఓట్ చోరీ’తో ఇండియా కూటమికి సంబంధం లేదని ఆ కూటమిలో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలనం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ బహిరంగసభ నిర్వహించిన తెల్లారే ఆయన స్పందించిడం గమనార్హం. ‘ప్రతి పార్టీకి తన సొంత ఎజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఓట్ చోరీ, సర్ లను తమ ప్రధాన పోరాటంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏం చేయలో మనం వాళ్ళకు చెప్పలేం కదా?’ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లుందని కూడా వ్యాఖ్యానించారు. ఒమర్ వ్యాఖ్యలను బట్టి, ఓట్ చోరీ జరుగుతోందా? జరిగితే ఎవరా ఓట్ చోర్ లు? పార్టీలా? ప్రజలా?
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలుఆశలకు, ఆశయాలకు సంకేతాంగా నిలుస్తుంది. అయితే, భారత రాజకీయాల్లో తరచూ వినిపించే మాట.‘ఓట్ల దొంగతనం’, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘అధికార పార్టీయే ఓట్ల దొంగ’. ఈ ఆరోపణలు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపైనా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఓట్ల దొంగ ఎవరు?
‘ఓట్ చోరీ’ అంటే కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కాదు. డబ్బు, మద్యం, కులం, మతం, అధికార దుర్వినియోగం, మీడియా ప్రభావం, అలవికాని హామీలన్నీ ఓటు స్వేచ్ఛను దెబ్బతీసే పద్ధతులే. ఓట్ చోరీ సాంకేతిక సమస్య మాత్రమే కాక, నైతిక వైఫల్యం కూడా.
దేశంలో కాంగ్రెస్ దీర్ఘకాలంగా అధికారంలో ఉంది. అది వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేయడం, అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం వంటి విమర్శలు కాంగ్రెస్పై బలంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు, కుటుంబ పాలన, స్థానిక నాయకుల అక్రమాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి పరోక్ష “ఓట్ చోర్” పద్ధతులే.
బీజేపీపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు, జాతీయత పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మీడియా మీద ప్రభావం, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను తగ్గించడం వంటి అంశాలు బీజేపీని విమర్శలకు గురిచేశాయి. ప్రతిపక్ష పార్టీలను, నేతలను విచారణ సంస్థల ద్వారా భయపెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యలు. ఇవన్నీ ప్రత్యక్ష ఓట్ చోరీ కాకపోయినా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాలని ప్రభావితం చేసే పద్ధతులే.
ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జాబితాలేకే వస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, సమాజ్వాది, బీఎస్పీ వంటి పార్టీలు కూడా డబ్బు, కులం, మతం, ప్రాంతీయ, ప్రలోభాల భావోద్వేగాలపై రాజకీయాలను నెరుపుతున్నవే. “మనోడే గెలవాలి” అనే భావన ప్రజాస్వామ్యాన్ని కుటుంబ లేదా కుల రాజకీయం వైపు నడిపింది. ఇక్కడ ఓటు ప్రజల స్వేచ్ఛా అభిప్రాయానికి కాకుండా సామాజిక రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.
ప్రత్యక్ష, పరోక్ష ‘ఓట్ చోరీ’లో రాజకీయ పార్టీలతో పాటు ఓటరు పాత్రను విస్మరించలేం. డబ్బు తీసుకుని ఓటేయడం, కులం లేదా మతం పేరుతో ఓటేయడం, భవిష్యత్ అభివృద్ధి కంటే తక్షణ స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రలోభాలకు లోనవడం ద్వారా ఓటరే తన ఓటును తానే అమ్ముకుంటున్నాడు.
మీడియా కూడా ఈ పాపంలో భాగమే. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ ఉండటం, ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీని నిరంతరం దూషించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కనిపించని ఓట్ చోరీ. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, అసత్యాలు ప్రచారమై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఓట్ చోరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థీక్రుతంగా విస్తరించిన విషం. పార్టీలను, ప్రజలను కూడా దోషులుగా పరగణించాల్సందే. ఇది మన రాజకీయ సంస్కృతిలో ఉన్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు, ప్రతి పౌరుడిది కూడా. ఓటరు చైతన్యం, స్వతంత్ర సంస్థల బలోపేతం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ, బాధ్యతాయుత మీడియా కలిసి పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

