తెలంగాణ పంచాయతీ ఎన్నకల్లో తొలి దశ పూర్తవగా, రెండో–మూడో దశలు ముందున్నాయి. మొదటి దశ ఫలితాలు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకముంచారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. అంతేగాక, మిగతా ఫలితాలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండే అవకాశాలూ ఉన్నాయి. అయితే గత రెండేళ్లుగా గ్రామాల్లో కనీస పరిపాలన అచేతనంగా మారింది. అభివృద్ధి చక్రం కుంటుపడింది. ఈ సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయక విజయాలు సాధించడమంటే, ప్రజలు ఇంకా జరగాల్సిన అభివృద్ధి కోసం ప్రభుత్వంపై నమ్మకముంచారని అర్థం. గుర్తులు లేకుండా జరిగిన పోరులో కూడా 2,383 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోవడం పెరుగుతున్న ప్రజాభిమానాన్ని ప్రతిఫలిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ 1,146 పంచాయతీల్లో గెలవడం, బీజేపీ కూడా కొన్ని చోట్ల సత్తా చాటడం, స్వతంత్రులు 455 పంచాయతీలను గెలుచుకోవడం రాజకీయ వైవిధ్యాన్ని చూపుతున్నప్పటికీ, గ్రామ అభివృద్ధి విషయంలో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేసే సమయం వచ్చింది.
గ్రామాలను బలోపేతం చేయకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం వంటి అంశాలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. వీటితో పాటు పారిశ్రామిక, ప్లాస్టిక్ కాలుష్యం నిశ్శబ్దంగా భూమినే మింగేస్తోంది. “నా గ్రామం – నా బాధ్యత’’ అనే భావనను ప్రజల్లో కల్పించాలి. సర్పంచ్లు గ్రామానికి నాయకులుగా కాక, అభివృద్ధి ప్రేరకులుగా మారాలి. అనవసర పథకాలపై చేసే ఖర్చును గ్రామాల పునర్నిర్మాణానికి మళ్లిస్తే పూర్వ వైభవం వస్తుంది.
ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆధిక్యం ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై ఉంచిన నమ్మకానికి సంకేతం. ప్రజలు ప్రభుత్వాన్ని అభివృద్ధి ఒక అవకాశంగా చూస్తున్నారు. గ్రామాల్లో మంచినీరు, విద్యా, వైద్యం, రవాణా, ప్రయాణ మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయి. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తే నిరుద్యోగం తగ్గించడం నుండి చిన్న పరిశ్రమల ప్రోత్సాహం వరకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే యువత నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంగా భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా దేశ అభివృద్ధిలో కీలక కేంద్రంగా ఎదిగింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ భౌగోళిక, వాతావరణం, వ్యూహాత్మక స్థానం, ఐటీ, పారిశ్రామిక వృద్ధి ప్రత్యేకం. తాజాగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ వైపు మళ్లడం చరిత్రాత్మకం. అయితే ఈ విజయాలు పల్లెలకు చేరకపోతే అభివృద్ధి అసమతౌల్యంలో దెబ్బతింటుంది. పెట్టుబడుల్లో కనీసం పది శాతం గ్రామాభివృద్ధి వైపు మళ్లిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో 10శాతం తెలంగాణ వాటాను కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఈ లక్ష్యం సాధించాలంటే సేవలు, పారిశ్రామిక రంగాలు మాత్రమే కాదు, వ్యవసాయం–అనుబంధ రంగాలను కూడా ఆధునీకరించాలి. గ్రామాల్లో చిన్న పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, స్టార్టప్లు స్థాపించేందుకు ప్రత్యేక విధానాలు రావాలి. రైతును కేవలం ఉత్పత్తిదారుడిగానే కాక, వ్యవసాయ పారిశ్రామిక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దే సమయం ఆసన్నమైంది.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను కార్యాచరణ ప్రణాళికలకు కేంద్ర బిందువుగా మార్చాలి. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అభివృద్ధి నమూనా రూపొందిస్తే వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుంది. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తేనే తెలంగాణ అసలైన ‘రైజింగ్’ సాకారం అవుతుంది.

