ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇప్పటి వరకూ గంజాయి రవాణా, పట్టుబడటం, తప్పించుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు మాఫియా నేరుగా హత్యలకు తెగబడటం చూస్తున్నాం. పెంచలయ్య హత్య వెనుక ఉన్న నిజమైన డాన్లు, రాజకీయ అండదండలు బయటపడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని మాదకద్రవ్యాల మాఫియాపై సమగ్ర యుద్ధం ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా చాపకింద నీరులా సాగుతోంది. ఏపీ పక్క రాష్ట్రం ఒడిశా సరిహద్దు సహా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా పండుతోంది. ఒడిశా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మార్గాలుగా జగ్గంపేటకు, అక్కడి నుంచి పలు జిల్లాలకు భారీ ఎత్తున రవాణా జరుగుతోంది.
అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ ఏడాది 93 ఎకరాలకు సాగు తగ్గింది. డ్రోన్లు, శాటిలైట్ ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నారు. వేలాది ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్ళిస్తున్నారు. ‘గత ఏడాది ఒక్క ఏపీలోనే 867 గంజాయి కేసులను నమోదు చేసి 20,467 మందిని అరెస్టు చేశారు. 65 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 500 వాహనాలను సీజ్ చేశారు. సంకల్పం పేరిట గంజాయికు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు, యువత, మహిళా సంఘాలకు అవగాహన కల్పించామని పోలీసులు వివరిస్తున్నారు. అయినప్పటికీ గత వంద రోజుల్లో 93 కేసులు నమోదు చేసి 6,782 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 247 మందిని అరెస్ట్ చేశాశారు. ఎంత అదుపు చేసినా, మళ్లీ మళ్లీ అదే నేరం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా ఉంది.
తెలంగాణలో కూడా ఈగిల్ టీమ్ తరచుగా దాడులు చేస్తున్నా, పట్టుబడేది మొత్తం రవాణాలో అతి తక్కువ శాతం మాత్రమే. మిగతావన్నీ గుట్టుచప్పుడు కాకుండా నగరాలు, పట్టణాలకు చేరుతున్నాయి. హైదరాబాద్ లో గంజాయి డాన్ నీతూబాయి ఏడాదిగా పరారీలోనే ఉంది. అయినా గంజాయి స్మగ్లింగ్ మాత్రం ఆగడంలేదు. ప్రతినిత్యం ఏదో ఓ ప్రాంతం నుంచి గంజాయి పట్టుపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
యూత్ ను, ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు లక్ష్యంగా గంజాయిని చిన్నపొట్లాలు, లిక్విడ్, చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నారు. నగరాల్లో యువత, విద్యార్థులు ప్రధాన టార్గెట్ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
పోలీసులు నిఘా కట్టు దిట్టం చేసినా రవాణా ఆగట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ నేతల అండదండలతో మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పెంచలయ్యను కక్షపూరితంగా హత్య చేయడం దీనికి నిదర్శనం. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ప్రధాన నిందితుడు జేమ్స్ కుటుంబం గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారానికి యువకులను ప్రోత్సహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. కామాక్షి అనే మహిళ కాలనీలో అక్రమాలు ఎక్కువ చేస్తున్నందుకు స్థానికులు ఆమెను బహిష్కరించగా, కక్షతో పెంచలయ్యను హత్య చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్రమైన ఆగ్రహం ఉప్పొంగి జేమ్స్ ఇంటిని దహనం చేశారు.
ప్రభుత్వాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు, ఉచిత బియ్యం పంపిణీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మాఫియాలను అరికట్టేందుకు నిధులు, బలగాలు వినియోగించాల్సి ఉంది. హెలికాప్టర్లల్లో తిరగడానికి వందల కోట్లు ఖర్చు చేయడం కంటే, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఏజెన్సీల్లో పండుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేయాలి. రవాణా మార్గాలపై కఠిన నిఘా పెట్టాలి. ఈగిల్ టీమ్లకు మరింత బలగాలు, సాంకేతిక వనరులు అందించాలి. యువతను విషం చేస్తున్న మాదకద్రవ్యాలను తక్షణమే అరికట్టకపోతే సమాజం దారి తప్పిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పెంచలయ్య హత్య మాఫియాల దుశ్చర్యలకు నిదర్శనం మాత్రమే కాదు, ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్నదనే హెచ్చరిక!

