బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు, దాని భాగస్వామ్య హాగఠ్ బంధన్ కూటమికి అనూహ్యం కావచ్చు. కానీ, బీజేపీకి, నితీశ్ కి మాత్రం వ్యూహాత్మకమే. ఎన్నికలను ఎత్తుగడగా సాగించి, ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బిహార్ ఎన్నికలు నితీశ్, మోదీ, అమిత్ షాల వ్యూహంలోనే నడిచాయి. నితీశ్ను ముందు బెట్టి బీజేపీ ఎన్నికల యుద్ధం చేసి, గెలిచింది. బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజార్టీని సాధించే అవకాశం ఉన్నా, నితీశ్ను కాంగ్రెస్ కు వదులు కోరాదన్న వ్యూహంతోనే ముందుకు సాగింది. అన్నింటికీ మించి ‘సర్’ తో ఓటర్ల సమీక్ష అనే ఎన్నికల సంఘం నిర్ణయం కూడా బీజేపీదే.
బిహార్ ఫలితాలు రాహుల్, తేజస్విల కళ్ళు తెరిపిస్తాయా? బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయా? వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ వ్యూహాలేవీ తన సొంత రాష్ట్ర బిహార్ ప్రజల ముందు పని చేయలేదు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం కాదు, వాటిని అమలు చేయడంలో ఆరితేరితేనే అధికారం అందివస్తుంది. ఈ ఫలితాలు బీజేపీయేతర అన్ని పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్కు, ఆర్జేడీకి గుణపాఠం కావాలి.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు, దాని భాగస్వామ్య పక్షాల మహాగఠ్ బంధన్ కూటమికి అనూహ్యం కావచ్చు. కానీ, బీజేపీకి, నితీశ్ కి మాత్రం వ్యూహాత్మకమే. ఎన్నికలను ఎత్తుగడగా సాగించి, ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బిహార్ ఎన్నికలు నితీశ్, మోదీ, అమిత్ షాల వ్యూహంలోనే నడిచాయి. నితీశ్ను ముందు బెట్టి బీజేపీ ఎన్నికల యుద్ధం చేసి, గెలిచింది. బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజార్టీని సాధించే అవకాశం ఉన్నా, నితీశ్ను కాంగ్రెస్ కు వదులు కోరాదన్న వ్యూహంతోనే ముందుకు సాగింది. అన్నింటికీ మించి ‘సర్’ తో ఓటర్ల సమీక్ష అనే ఎన్నికల సంఘం నిర్ణయం కూడా బీజేపీదే. బిహార్లో చొరబాటుదారులు ఓటర్లుగా మారి శాసించే స్థాయికి చేరారు. ఇది బెంగాల్, బిహార్ల్లోనే ఎక్కువ శాతంగా ఉంది. దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులను ఓటర్ల జాబితాలోంచి తొలగించే ప్రణాళికను సాహసోపేతంగా చేపట్టారు. రాహుల్ దీన్ని స్వాగతించి ఉంటే ఆయన ప్రతిష్ట పెరిగేది. పైగా ‘ఓట్ చోరీ’ పేరుతో ఆయన వ్యతిరించడంతో రాహుల్ పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పక్క ఇంట్లోనే దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసినా, ఏమీ చేయలేని ప్రజలు ఎన్నికల సంఘం వాటిని తొలగిస్తే స్వాగతించారు. అలాగే ఆ తొలగింపును వ్యతిరేకించిన రాహుల్ను తిరస్కరించారు.
అధికార జేడీ(యూ), బీజేపీల ఎన్డీఏ కూటమిని దించి ఈసారి ఎలాగైనా అధికారం చేపడదామని కలలు కన్న కాంగ్రెస్, ఆర్జేడీకి బిహార్ ఓటర్లు గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హైడ్రోజన్ బాంబు బీహార్లో తస్సుమంది. బిహార్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ జరిపిన ‘ఓట్ అధికార్ యాత్ర’ పెద్దగా ప్రభావం చూపలేదు. బిహారీలు మళ్లీ ఎన్డీఏకే జై కొట్టారు. ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 202 స్థానాల్లో గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. బీజేపీ 89 సీట్లు, నితీశ్ జెడీయూ 85సీట్లు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లు గెలిచాయి. గెలుపు తమదేనన్న మహాగఠ్బంధన్, హాఫ్ సెంచరీని కూడా చేరుకోలేక పోయింది. 2020 ఎన్నికల్లో ఇదే ప్రతిపక్షం 114 స్థానాలు గెలిచింది. ఈ ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేక పోయింది.
చోరీ ఓట్ల గురించి సుప్రీంలో కేసు వేశారు. కానీ సుప్రీం చెప్పిన విధంగా అఫిడవిట్ దాఖలు చేయలేకపోయారు. ఆ విధంగా చూస్తే తొలగించిన ఓట్లలో చనిపోయినవారు, బిహార్ను వదిలి వెళ్లిన వారు లేదా దొంగతనంగా ఓటర్లుగా చేరిన వారని తేలిపోయింది. అందుకే రాహుల్ ఓట్ చోరీ ప్రచారం పనిచేయలేదు. రాహుల్తో మహా ఘఠ్ బంధన్లో తేజస్వీ యాదవ్ సహా వెంట ఉన్న పార్టీలను దెబ్బ కొట్టింది.
ఆపరేషన్ సిందూర్, సర్జికల్ స్ట్రైక్స్, ఓటర్ల సవరణ వంటి కీలక అంశాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకంచింది లేదా తిరస్కరించింది. బిహార్ రెండోదశ పోలింగ్ కు ముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనను కాంగ్రెస్, నిఘా వైఫల్యంగా విమర్శించింది. అంతకుముందే భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ప్రస్తుతించలేకపోయారు. ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా నిఘా నిరంతరం కొనసాగుతుంది. ఇది కూడా ప్రజాగ్రహానికి కారణమైంది. అందుకే బీహార్లో మహాగఠ్బంధన్కు ఘోర పరాభవం ఎదురైంది.
దేశంలో కొత్తనీరు వస్తోంది. వారంతా దేశం ఏ దిశగా పయనిస్తుందో చూస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలుస్తున్నారు. మోదీతో రాహుల్ను పోల్చుకున్నప్పుడు వారు మోదీవైపు మొగ్గుతున్నట్లుగా ఉన్నారు. అలాగే లాలూ, నితీశ్ ల పరిపాలనను గమనిస్తూ, పోలుస్తున్నారు. బిహార్లో గత రెండు దశాబ్దాలుగా నితీశ్ కుమార్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి స్థానంలో నితీశే కొనసాగుతున్నారు. 2014-2015లో మినహా బిహార్కు నితీశే సీఎం. అయితే ఈసారి నితీశ్ గెలుపు కష్టమని అంతా అంచనా వేశారు. వయసై పోయిందన్నారు. అయినా నితీశ్ మాత్రం ఎన్డీఏ ఛత్రం కింద అయితేనే విజయం సాధ్యమని నమ్ముకున్నారు. ఎన్నో కులమత రాజీలతో నిండిన బిహార్ రాజకీయాల్లో నితీశ్ తిరుగులేని నేతగా నిలిచారు. సాధారణ కుర్మీ కుటుంబంలో పుట్టిన నితీశ్, చిన్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1970 చివర్లో జేపీ ఉద్యమంతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టిన నితీశ్ రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది.
నితీశ్ ఎదుగుదల ఒక్కరోజులో జరిగిందేమీకాదు. ప్రశాంతత, పట్టుదల, కష్టపడి పనిచేయడం, అన్నింటికీ మించి రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేడం వంటివన్నీ ఆయన్ని రాటు దేలిన నేతగా మలిచాయి. ఎప్పటికప్పుడు కొత్త కూటములు కట్టడంలో దిట్ట. అవసరాన్ని మారిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నితీశ్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. బిహార్ ప్రజల జీవితాలను మెరుగు పరిచిన నాయకుడిగా నితీశ్ మన్ననలు అందుకున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలను బాగా మెరుగు పరిచారని పేరు సంపాదించారు.
లాలూ హయాంలో మొత్తం కుటుంబపాలన సాగింది. లాలూ లేదంటే రబ్రీ కాదంటే ఇప్పుడు తేజస్వీ వచ్చారు. కాంగ్రెస్లో కూడా అదే కనిపిస్తోంది. ఇవన్నీ నితీశ్ పంచన చేరిన బీజేపీ బాగా అధ్యయనం చేసి, ప్రచారం చేసింది. తగిన వ్యూహం పన్నింది. అందుకే గతం కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది.
బిహార్ ఫలితాలు రాహుల్, తేజస్విల కళ్ళు తెరిపిస్తాయా? బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయా? చూడాలి. వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ వ్యూహాలేవీ తన సొంత రాష్ట్ర బిహార్ ప్రజల ముందు పని చేయలేదు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం కాదు, వాటిని అమలు చేయడంలో ఆరితేరితేనే అధికారం అందివస్తుంది. ఈ ఫలితాలు బీజేపీయేతర అన్ని పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్కు, ఆర్జేడీకి గుణపాఠం కావాలి.

