మొన్నటి కేబినెట్ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు క్లాస్ పీకారన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల, పరిపాలనా వైఖరులను తేట తెల్లం చేస్తోంది. మంత్రుల శాఖల నిర్వహణ తీరు, మంత్రులు, వారి శాఖల మధ్య సమన్వయం లోపం, సఖ్యతలేకపోవడం, ఒకరి శాఖల్లో మరొకరు వేలు పెట్టడం, కాంట్రాక్టులపై కక్కుర్తి, బహిరంగంగా విమర్శలకు దిగడం, నేరుగా సీఎంను, ఆయన సామాజికవర్గాన్ని టార్టెట్ చేయడం, రేవంత్ ని ఫెల్యూర్ సీఎంగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టకపోవడం…అనేక అంశాల నేపథ్యంలోనే సీఎం మంత్రులపై అసహనం వ్యక్తం చేసి ఉంటారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయం కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనా తీరు చూస్తున్న ప్రజలు కేసీఆరే నయమన్న భావనకు వస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మారకుంటే, ఆపార్టీ ప్రభుత్వాన్ని మార్చే పనిలో తెలంగాణ ప్రజలు పడే ప్రమాదం పొంచి ఉంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
మొన్నటి కేబినెట్ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు క్లాస్ పీకారన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల, పరిపాలనా వైఖరులను తేట తెల్లం చేస్తోంది. మంత్రులపై సీఎం అసహనం వెనుక అనేక కారణాలు ఉండి ఉంటాయి. మంత్రుల శాఖల నిర్వహణ తీరు, మంత్రులు, వారి శాఖల మధ్య సమన్వయం లోపం, మంత్రుల మధ్య సఖ్యతలేకపోవడం, ఒకరి శాఖల్లో మరొకరు వేలు పెట్టడం, కాంట్రాక్టులపై కక్కుర్తి, బహిరంగంగా విమర్శలకు దిగడం, నేరుగా సీఎంను, ఆయన సామాజికవర్గాన్ని టార్టెట్ చేయడం, రేవంత్ రెడ్డిని ఫెల్యూర్ సీఎంగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టకపోవడం… ఇలా అనేక అంశాల నేపథ్యంలోనే సీఎం మంత్రులపై అసహనం వ్యక్తం చేసి ఉంటారు. సీనియర్లన్న గౌరవ మర్యాదలు పాటించకపోవడమే కాదు, అంతా సీఎంలమే అన్నట్లుగా, ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తుండటం బహుషా సీఎం కోపానికి కారణాలై ఉంటాయి. పైరవీలు, పర్సెంటేజీలు లెక్కలేనన్ని లోపాల వల్లే సీఎం తాపాలు వ్యక్తం చేసి ఉంటారు.
నిజానికి కేసీఆర్ కుటుంబ పాలనను సహించలేక బీఆర్ఎస్పై విసుగుతో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ హామీలకు మాత్రమే ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేయలేదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఎదగాల్సింది. అటు బీజేపీ అధిష్టానం, ఇటు బీఆర్ఎస్ లాబీయింగ్ లో రాష్ట్ర బీజేపీ కుదేలైంది. ఇక అధికారానికి ముందు, తర్వాత బీఆర్ఎస్ పాపాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు, తాము కూడా అదేపనిలో ఉన్నారు. అందివచ్చిన కాడికల్లా దోచుకోవడంలో బిజీగా మారారు. ఆరు గ్యారెంటీలు, అప్పులు తప్ప చేసిన నిర్ణయాత్మక కార్యక్రమాలు పెద్దగా కనిపించడంలేదు.
ఉమ్మడి ఏపీలో వైఎస్, కాంగ్రెస్ మార్కు రాజకీయాలను మరచిపోయేలా చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. కాంగ్రెస్లో అసంతృప్త స్వరాలు, పాత జమానా తాలూకు వ్యవహారాలు కనిపించకుండా పోయాయి. ప్రభుత్వం, పాలనపై వైఎస్ తనదైన ముద్ర వేయగలిగారు.
ప్రాంతీయ పార్టీల కల్చర్, వ్యక్తి భక్తికి, భజనకు అలవాటుపడిన ప్రజలకు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిణామాలు జీర్ణం కావడం లేదు. ప్రభుత్వంలో, పార్టీలో దశ దిశా లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో స్థిరపడుతోంది. క్షేత్రస్థాయిలో పనులు కావడం కాదుగదా, అసలు పనులే లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారు.
ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ సీఎం రేవంత్రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికలకు ముందు రేవంత్ మాటతీరు, హామీల తీరు చూసి కొత్తగా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలతో పాలన సాగాలని ఆశించారు. అయితే, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. మంత్రి సురేఖ ఎపిసోడ్ తీసుకుంటే, ఆకుటుంబపై ప్రజల్లో ముందు నుంచీ సదభిప్రాయం లేదు. తాజా వ్యవహారంలో ఆమెపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను బర్తరఫ్ చేసి ఉండాలి. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ తీసుకొని కొండా సురేఖను సీఎం వద్దకు తీసుకెళ్లారు. నిజంగానే చర్యలు తీసుకుని ఉంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగేది. సురేఖ దంపతులతో రేవంత్ రాజీ కుదుర్చు కున్నారన్న అభిప్రాయం ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది.
మంత్రులు ఎవరికి వారు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖ, ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. సీఎంని ప్రైవేట్ సందర్భాల్లో విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో అవినీతి పెరిగిపోయింది. ఏసీబీ దాడులు చేస్తున్నా ఉద్యోగులు, అధికారుల్లో పిసరంత ప్రభావం కూడా కనిపించడం లేదు. సీఎం రేవంత్ కి మంత్రులపై నియంత్రణ, పాలనపై పట్టు లేదన్న వాదన బలపడుతోంది.
అంతర్గత గందరగోళాన్ని పక్కన పెట్టి, అదేపనిగా బీఆర్ఎస్ గత పాలనపై విమర్శలతో పబ్బం గడుపుతున్నారు. కనీసం బీఆర్ఎస్ ఒక్క అవినీతిని నిరూపించి చర్య తీసుకుని ఉంటే డ్యామేజీ అయిన ప్రభుత్వ ఇమేజ్ అమాంతం పెరిగేది. ఇవ్వాళ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అధిష్టానానికి సంచులు మోస్తున్నారన్న ప్రచారం ఏర్పడేదే కాదు.
ప్రభుత్వ నిర్ణయాలు కూడా బెడిసి కొడుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల నిర్ణయంలో ప్రభుత్వం అపరిపక్వత బయటపడింది. చట్టపరమైన సమస్యలను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం అభాసుపాలైంది. బీజేపీపై విమర్శలు నెపాన్ని ఆ పార్టీపై మోపడంగా మారింది. రిజర్వేషన్లు పెంపునకు అసెంబ్లీలో మద్దతు పలికిన రాజకీయ పార్టీలు ఇప్పుడు బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టి తప్పుకొంటున్నాయి. ఫలితంగా ఈ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వంపై పడింది.
ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే కొంత ఇమేజ్ పెరుగుతుంది. లేదంటే కాంగ్రెస్ డ్యామేజీ అవుతుంది. బీసీకి టిక్కెట్ ఇచ్చి ప్రచారం చేస్తున్నా, ఫలితం రాకపోతే, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిపించాల్సిన రాహుల్, అంతర్గత కలహాలను చూసీచూడనట్లుగా పోతున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయం కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనా తీరు చూస్తున్న ప్రజలు కేసీఆరే నయమన్న భావనకు వస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మారకుంటే, ఆపార్టీ ప్రభుత్వాన్ని మార్చే పనిలో తెలంగాణ ప్రజలు పడే ప్రమాదం పొంచి ఉంది.

