ఈ మధ్యే ఏపీలోని విశాఖలో భారీ టెక్నాలజీ పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 10 బిలియన్ డాలర్లు అంటే రూ.87వేల కోట్ల పైబడి పెట్టుబడిగా డిజైన్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఐదేళ్ళల్లో రాష్ట్రానికి ఏడాదికి సగటున రూ.10,518 కోట్ల జీఎస్డీపీ-రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, ఇది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి పెద్ద “గేమ్ చేంజర్” అవుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.
ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మూడు దశలుగా విశాఖలో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు జరుగుతుంది. మొదటి ఐదేళ్ళల్లోనే సగటున ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు లభిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ పక్కన, డిజిటల్, ఎయ్డబ్ల్యూ, క్లౌడ్, ఐఓటి వంటి రంగాల్లో ఉత్పాదకత పెరుగుదల ద్వారా మరో రూ. 9,553 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉంది. ఈ రకంగా చూస్తే, పోషక ప్రాజెక్ట్ గా, “ఐ టి హబ్” లేదా “ఎయ్ఐ సిటీ విశాఖ” వంటి బ్రాండింగ్కి దారి తీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
డేటా సెంటర్¬ క్లస్టర్ ఏర్పాటుతో పాటు, పర్యావరణ ఇంజనీరింగ్ పరంగా విద్యుత్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, నీటి మౌలిక వసతులు, పునరుత్పాదక శక్తి మార్గాలు-గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు ఈ ప్రాజెక్టు వల్ల ప్రేరేపితమవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మొదటగా గ్రీన్ డేటా సెంటర్ల పై దృష్టి సారిస్తోంది. ఈ విధంగా, విశాఖపట్నం నగరాల ఆర్థికాభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించగలదని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఐటి సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం పొందే అవకాశాలు మెరుగవుతాయి. అనుబంధంగా స్థానికావసరాలు, నిర్మాణ రంగం, వివిధ సేవలు, వృత్తులు, రియల్టీ, టెలికాం, లాజిస్టిక్స్ వంటి రంగాలు డెవలప్ అవుతాయి. దేశీయంగా కొత్త ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఇలాంటి భారీ స్థాయి డేటా సెంటర్ ని తొలిసారిగా భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి ఆకర్షణీయ విధానాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రాజెక్టు ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. విశాఖపట్నం సముద్రతీర నగరం కావడం వల్ల ఆఫ్షోర్ కేబుల్లకు, అంతర్జాల కనెక్టివిటీకి అనుకూల ప్రదేశంగా భావిస్తున్నారు.
అయితే, ఈ ప్రాజెక్ట్కు కొన్ని కీలకమైన ఆందోళనలు, సవాళ్లు కూడా ఉన్నాయి. డేటా సెంటర్లకు సాధారణంగా ఎంతో విద్యుత్, నీటి వనరులు అవసరం. స్థానిక విద్యుత్ శక్తి వ్యవస్థపై, సముద్రతీర ప్రాంతంలో వేడి ప్రమాణం, నీటి వినియోగం వంటి విషయాలు కీలకం కానున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ చేపడితే, తమ భూములు ఎక్కడ పోతాయోనన్న ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెబుతున్నా, సాంకేతికపరమైన ప్రాజెక్టు కావడంతో సాంకేతిక రంగాల వారికే తప్ప, మిగతా వారికి అంతగా ఉద్యోగాల కల్పన సాధ్యం కాకపోవచ్చు. నిర్మాణ దశలో ఉద్యోగాలు ఏర్పడినా, డేటా సెంటర్ స్థిరంగా నడిచే సమయంలో నిరంతర ఉద్యోగాల కల్పన ఉండదు. పెద్ద పెట్టుబడులు రావడం మంచిదే, కానీ వాటి ద్వారా వచ్చే లాభాలు రాష్ట్ర ప్రజలు, ప్రాంతాలకు సమానంగా అందుతాయా? ప్రభుత్వ ప్రోత్సాహాలను, భూవినియోగ విధానాలను, నగర గ్రామాల మధ్య అభివృద్ధి సమతుల్యాన్ని విమర్శించేవారు ఉన్నారు.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ రాష్ట్రం లేదా నగరంలో స్థిరమైన ఆదాయంగా మారుతుందా? లేక గూగుల్ సంస్థకే చెందుతుందా? వాతావరణ మార్పులు, పునరుత్పాదక శక్తుల వినియోగం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలు సవాలుగా ఉండొచ్చు. స్థానిక విద్య, నైపుణ్యాల పరంగా బలహీనంగా ఉంటే, స్థానికులకు పెద్దగా లాభం జరగకపోవచ్చు.
మొత్తానికి, ఇలాంటి సమస్యలు అదిగమిస్తే, గూగుల్ విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక పెద్ద మైలురాయి అవుతుందని అనడంలో సందేహంలేదు. డిజిటల్, నగర ఆర్థిక వృద్ధి అనేవి మౌలిక సదుపాయాలు, సాంకేతిక విద్య, వనరుల నిర్వహణ, సామాజిక వినియోగం, ప్రయోజనం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక వర్గాలు, పెట్టుబడిదారులు కలిసి సమగ్ర అభివృద్ధి, పర్యావరణ సంబంధిత బాధ్యత, సామాజిక సమగ్రత అనే మూడు మూలస్తంభాలుగా పని చేస్తే, ఈ ప్రాజెక్టు నిజమైన గేమ్ చేంజర్ గా నిలవగలదు. లేకపోతే, ఇది పెట్టుబడి ప్రకటనల్లో ఒకటిగా మిగిలి పోతుంది.

