సంక్షేమ హాస్టళ్ళు అందులో చదివే విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉభయ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పిల్లలు మృత్యు ఒడికి చేరారు. కారణాలేవైనా సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్షేమ హాస్టళ్ళే కాదు, విద్యారంగం విషయంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఓట్ల పథకాలపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ళపై లేదు. విద్య, వైద్య అభివృద్ధిపై లేదు. పిల్లలను హాస్టళ్ళకు పంపిన తల్లి దండ్రులు క్షోభకు గురవుతున్నారు.
సాంఘిక, ఆర్థిక అసమానతల కారణంగా చదువులు అర్థాంతరంగా ఆగిపోకూడదన్న సంకల్పంతో గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన, స్వేచ్ఛాయుత పరిస్థితుల్లో ఎదిగే అవకాశాలను, సౌకర్యాలను పిల్లలకు అందిస్తూ ఉన్నత విద్యావంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అణగారిన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక అన్యాయం, దోపిడీల నుంచి వారిని రక్షించాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ వైద్య విధానాలతో విద్య అంగడి సరుకుగా మారిపోయింది. రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యాల అమలు ఊసేలేదు. సరళీకరణ విధానాలతో కుటుంబాలు గడవడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో పేద, అణగారిన వర్గాలకు చెందిన లక్షల మందికిపైగా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లే ఆధారమవుతున్నాయి. వీటికి సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం, డైట్ ఛార్జీలు చెల్లించకపోవడం ఆనవాయితీగా మారిపోయింది. మెనూ అమలు ఊసేలేదు. పౌష్టికాహారం అందకపోవడం, తాగునీటి కాలుష్యం, అపరిశుభ్రత తదితర కారణాల వల్ల తరచూ అతిసార, విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులకు గురవడం సర్వసాధారణమైపోయింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.
తెలంగాణలో ఘనత వహించిన కేసీఆర్ పాలనలో హాస్టళ్ళు ఘనంగా వెలిగాయని, ఇప్పుడు హాస్టళ్ళలో మరణ మృదంగం మోగుతోందని ఇటీవలి కాలంలో కేటీఆర్ బృందం ఘోషించింది. మరి పదేళ్లలో హాస్టళ్లు బాగుంటే.. బాగుచేసి ఉంటే ఇప్పుడే ఎందుకు ఈ అధ్వాన్న పరిస్థితి వచ్చిందో వారు చెప్పలేకపోయారు. పదేళ్ల అధికారం మత్తులో అంతా బాగుందని ప్రచారం చేసుకున్నారు. బంగారు పళ్లెంలో పిల్లలు భోంచేస్తున్నారని బిల్డప్ ఇచ్చారు.
ఇప్పుడు రేవంత సర్కార్ కూడా అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్న స్కూళ్ళను గాలికి వదిలేసి, రకరకాల స్కూళ్ల పేరుతో ఊదరగొడుతోంది. ఉన్న స్కూళ్లనే అభివృద్ధి చేసి, పిల్లలను తల్లిదండ్రులకు చేరువ చేసి, హాస్టళ్లను తగ్గించాలన్న ప్రణాళిక ఉన్నట్లు చెప్పారు. కానీ అలా జరగలేదు. ఏపీలో చంద్రబాబు సమీక్షించని రంగం లేదు. అలాగే అడుగు ముందుకు పడిన దాఖలాలు కూడా లేవు. ఏళ్ల తరబడి కలుషిత నీరు తాగుతున్నా, మెనూ ప్రకారం ఆహారం అందకపోయినా, హైకోర్టు చీవాట్లు పెట్టినా పరిస్థితుల్లో మార్పేమీ రావడం లేదు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల ఓ గిరిజన హాస్టల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మంత్రులు వెళ్లి పరామర్శించారు. హాస్టళ్లను తనిఖీ చేశారు. కానీ మార్పు లేదు. పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగడం వల్లే 9, 10 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న 611 మంది బాలికల్లో 140 మంది పచ్చకామెర్లకు గురై జిల్లా కేంద్ర, విశాఖ కెజిహెచ్లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు తగిననన్ని మరుగుదొడ్లు, బాత్రూమ్లు లేకపోతే ఎలా? అవసాన దశలో ఉన్న హాస్టల్ భవనాలు కూలిపోతే విద్యార్థులేం కావాలి? మన ఇంట్లో పిల్లల్ని నేలపై పడుకో బెడతామా? ఏటా ప్రభుత్వం కేటాయించే కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదనడానికి కురుపాం హాస్టల్ దుస్థితే నిదర్శనం. ఆర్ఒ సిస్టమ్ పాడై, పరిశుభ్రమైన తాగునీరు అందుబాట్లో లేకపోవడమే విద్యార్థినుల ప్రాణాంతక పచ్చకామెర్లకు ప్రధాన కారణం. పిల్లలు ఇళ్ల వద్ద చనిపోతే ప్రభుత్వానిది బాధ్యతెలా అవుతుందని, నష్టపరిహారం ఎలా ఇస్తామని పార్వతీపురం జిల్లాకే చెందిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ సంక్షేమ మంత్రి సామాజిక బాధ్యత.
పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు ఉన్నాయని, పశువులకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోరున్న పిల్లల హాస్టళ్లను మెరుగుచేయకుండా పశువులకు హాస్టల్ అనడం సమంజసమేనా? ఆర్థిక, సామాజిక అంతరాలకు అతీతంగా నవతరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కార్యాచరణలోకి దిగితేనే ఇటువంటి పరిస్థితులను అధిగమించగలం. ఆ దిశగా ప్రజలంతా సంఘటితంగా ఒత్తిడి తేవాలి. ప్రభుత్వాలు కూడా ఇంకా ఎంతోకాలం మభ్య పెట్టే పనులు మానుకోవాలి. స్కూళ్లను బలోపేతం చేసే యత్నాలు ముమ్మరం చేయాలి. నిధులు కేటాయించాలి. అప్పుడే భావితరం ఆరోగ్యవంతంగా చదువుకుని సమాజంలోకి అడుగపెట్టగలదు.

