హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి, అతడిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. అందుకే దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవరోజు విజయదశమి కలసి దసరా జరుపుకుంటున్నాం. ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తర్వాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి, ఆ తర్వాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో మొదటి తొమ్మిది రోజులను దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు లేక శరన్నవరాత్రులు అంటారు. 10వ రోజును దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి అవతారాలైన నవదుర్గలను అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవీ నవరాత్రులలో చివరి మూడు రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటారు. విద్యార్ధులు పుస్తకాలూ, పెన్నులను పూజిస్తే, శ్రామికులు తమ పనిముట్లను పూజిస్తారు. ఇక క్షత్రియులు ఆయుధ పూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులవుతారు.
విజయ సూచిక అయిన దసరానే.. పూర్వం రాజులు తమ దండయాత్రకు శుభ ముహూర్తంగా ఎంచుకునే వారట. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో ఎక్కువ. దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన ’మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరు పర్వతశిఖరం చేరి బ్రహ్మ దేవుని గూర్చి ఘోరతపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా! ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించ’మని మహిషాసురుడు కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా.. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు. సప్తసముద్రాలకూ, మహా పర్వతాలకూ కూడా వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక, నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషా సురుడు ’విధాతా.. అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల.. ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక, పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించ’మని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థాన మయ్యాడు.
వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా, మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకర పోరు సల్పింది. మహిషా సురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో అమ్మ తలపడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపాన, సింహ రూపాన, మానవ రూపాన భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవిచేతిలో హతుడైనాడు.
మహిషుని సంహరించిన దినం కాబట్టి అప్పటి నుండి మహిషాసుర మర్ధనిని కొలిచే దసరా పర్వదినంగా ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఉత్తర భారతంలో దసరాను రావణ దహనంగా నిర్వహిస్తారు. దక్షిణాన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపుగా నిర్వహిస్తారు. ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఎలా పూజించినా అమ్మవారితో పాటు, ప్రకృతిని ఆరాధించడం శరన్నవరాత్రులు, దసరా విష్టతగా చెప్పుకోవాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! విజయోస్తు!!

