ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైనది. అసెంబ్లీ, పార్లమెంట్ వంటి శాసన సభలు ప్రజల సమస్యలు చర్చించేందుకు, పాలనకు మార్గనిర్దేశం చేసేందుకు ఏర్పాటైన వేదికలు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో విమర్శలకు తావిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్ మొండిపట్టుతో ఉన్నారు. ఇక తెలంగాణలో విపక్ష హోదా ఉన్నా, కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే చాలని ఆయన, అధికారం ఉంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదన్న ధోరణిలో ఈయనా ఉన్నారు. సాంకేతికంగా తమ ఎమ్మెల్యే పదవిని నిలుపుకోవడానికి మాత్రం ఇలా వచ్చి అలా వెళుతున్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తరవాత అసెంబ్లీకి రావాల్సిందే. సమస్యలపై చర్చించాల్సిందే. కనీసం సభకు కూడా వెళ్లకుండా జీతభత్యాలు మాత్రం ఠంచనుగా ఎత్తుకుంటున్నారు. ప్రజల సొమ్ము తింటున్న ఈ ఇద్దరు నేతలు ఇంత బాధ్యతారహితంగా ఉంటున్నారు. ఇలాంటి సమయాల్లో వారిని ఏం చేయాలి? వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులను చేయాలి. మళ్లీ ఎన్నికల్లో నిలబడకుండా చూడాలి.
ఇక ఈ ఇద్దరూ అధికారంలో ఉండగా అప్పులు చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్ప చేశారు. ఇప్పుడేమో ఉన్న ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అతి తక్కువ కాలంలో దేశంలో బహుశా ఇంతగా అప్పుల పాలైన రాష్టాల్రు లేవేమో! ఇబ్బడిముబ్డడిగా అప్పులు చేస్తూ, అనుత్పాదక రంగాలకు దుబారా చేసారు. వీటినే అభివృద్ధి, సంక్షేమం అంటూ నమ్మబలికారు. ఆర్థికంగానే గాక, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించకుంటే మట్టి కరచిపోతారని గతంలో అనేక ఉదంతాలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ, విపక్షాలను దెబ్బతీయడం, విమర్శలను సహించక పోవడం వంటి చర్యలతో ఇద్దరు సీఎంలు నిరంకుశంగా ఉంటున్నారు. అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా మరిన్ని అప్పులే చేస్తున్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో జగన్, విపక్షాలను అణచివేయడం, కేసులు పెట్టడంలో ప్రత్యేక శ్రద్ధగా పనిచేయడంతో ప్రజల్లో పలచనై, అధికారం కోల్పోయి, అసెంబ్లీకి రాలేని పరిస్థితిని కల్పించుకున్నారు. ఎదురు పార్టీ అనేదే లేకుండా, అణగదొక్కిన కేసీఆర్కు అదే ఎదురు తిరిగింది. కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేయాలన్న కుట్రతో చేసిన ప్రయత్నాలు బెడిసి, కాంగ్రెసే అధికారంలోకి వచ్చేలా విధి వింతనాటకం ఆడింది. దీంతో ఆయనా అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు.
గతంలో తెలంగాణలో టీడీపీని విలీనంచేసుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ఉనికి లేకుండా పోవాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడలు అంతా ఇంతా కావు. ఇప్పుడా రెండు పార్టీల దెబ్బకు బీఆర్ఎసే ఉనికిలేకుండా పోతోంది.
బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించుకోలేదు. తమ నిరంకుశానికి ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేలశారు. మమతా బెనర్జీ పుట్టుకు వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా ఇప్పుడు అదే నిరంకుశ పాలన సాగిస్తున్నారు. అందుకే ఆమె పునాదులు కూడా కదులుతున్నాయి. బీజేపీ అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణలో తొలుత తెలుగుదేశంను, ఆ తర్వాత కాంగ్రెస్ ను కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్, ఇప్పుడు అదీ నిర్వహించలేని ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యారు. బెంగాల్ లో మమత చేసిన తప్పే, కేసీఆర్ తెలంగాణలో చేశారు. ఆ ఇద్దరు చేసిందే ఏపీలో జగన్ చేశారు. ఇప్పుడు వాళ్లు నామరూపాలు లేకుండా చేయాలనుకున్న పార్టీలు అధికారంలో ఉండటంతో ప్రతిపక్ష హోదా కోసం దేబిరించే, ఆ పదవి ఉన్నా అసెంబ్లీకి ముఖం చాటేసే నీచంలో ఉన్నారు.
అయితే, అసెంబ్లీకి వచ్చి తమ హయాంలో మంచిచేస్తే చెప్పుకోవాలి. విపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలి. సమస్యలపై ప్రభుత్వాల్ని నిలదీయాలి. కానీ అసెంబ్లీకి ముఖం చాటేయడమేంటి? ఒకందుకు ప్రతిపక్షంలో ఉండీ ఎన్ని అవమానాల్నైనా దిగమింగుకుంటూ అసెంబ్లీకి హాజరైన చంద్రబాబే వీళ్ళందరి కన్నా నయం. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా అంతా తామే అయి, కేసీఆర్, జగన్ లు కుటుంబ అవినీతి రాజకీయాలు నడిపారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాటి పర్యవసనాలను ఇంకా అనుభవించాల్సింది మిగిలే ఉంది. ప్రజలు, వారి మనోభావాలను విస్మరించి, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తే, ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్షలు తప్పవు.

